Friday, 18 October 2019

ఎంతవారలైనా...

కోతి ( రక్తముఖుడు ) యొక్క గుండెకాయను తీసుకువెళ్లి భార్యకు సమర్పిద్దామనుకుని మొసలి ( కరాళముఖుడు ) భంగపడిన విషయం గుర్తు వుంది కదా ! అప్పటి నుంచి, ఆ మగ మొసలి, మిత్రద్రోహం చేశాననే అపరాధ భావంతో, కోతితో స్నేహంగా వుండలేక పోతున్నది.
అది గమనించి కోతి మొసలితో స్నేహభావం ప్రకటిస్తూ, అతని మనసు తేలిక పరచాలని, ' కరాళముఖా ! ఎంతటివారికైనా భార్య కోరిక తీర్చడానికి, యెన్ని తిప్పలైనా పడవలసి వస్తుంది. నీవు నాగుండె నీభార్యకు సమర్పించాలనుకోవడంలో నేనేమీ తప్పు పట్టడం లేదులే. ఎందుకంటే గొప్పగొప్ప మహారాజులూ, మంత్రులే భార్యల కోరికలు తీర్చడానికి పడ్డశ్రమ నాకుతెలుసు. ఈ కథ విను. ' అని ఒక చతురత నిండిన కథ చెప్పసాగాడు. :
ఒకప్పుడు ' నందుడు ' అనే గొప్పరాజు వుండేవాడు. ఆయన గొప్ప పరాక్రమవంతుడు. మేధావి. ఆయన దగ్గర ప్రధాన సచివుడిగా ' వరరుచి ' అనే ఆయన వుండేవాడు. ఇద్దరూ ఒకరికొకరు తీసిపోని సమవుజ్జీలు. వీరి యిద్దరు భార్యలు కూడా ఒకేరాజ్యం నుండి వచ్చినవారు అవడంవలన, యెంతో సఖ్యంగా, సరదాగా, ప్రేమగా వుండేవారు.
వీరి భర్తలగురించి ప్రజలు చాలా గొప్పగా చెప్పుకుంటుంటే, వారిద్దరినీ ఆటపట్టించాలని రాజుగారి భార్యా, మంత్రిగారి భార్యా అనుకున్నారు. అనుకున్నట్లుగానే, ఒకరోజు మంత్రిగారి భార్య, అకారణంగా అలిగి, వరరుచి, యెంత బ్రతిమిలాడినా, అలక మాననట్లు నటించసాగింది. అంతటి ప్రధానమంత్రి కూడా, భార్య అలుకకు తట్టుకోలేక, తాను చేసిన తప్పేమిటో చెప్పమనీ, ' ఏ శిక్ష విధించినా అనుభవిస్తానుగానీ, యిలా అలిగి హింసపెట్టకు భార్యామణీ ! ' అని వాపోయాడు.
అతడు చాలాసేపు ఆవిధంగా బ్రతిమిలాడిన తరువాత, ' మిమ్ములను నేను యెప్పటి నుంచో ఒకటి అడగాలనుకుంటున్నాను. కానీ వింటే యేమంటారో అని సందేహిస్తున్నాను. ' అన్నది. ' అయ్యో ! నేనేమీ అనుకోను. చెప్పు, త్వరగా చెప్పు నీకోరిక ఏమిటో ! ' అని వరరుచి తొందరచేశాడు. ' అయితే, మీరు శిరో ముండనం చేయించుకుంటే చూడాలని నాకు కుతూహలంగా వున్నది. మీరు వెంటనే శిరస్సు మీద కేశములు పూర్తిగా తీసివేసుకుని నా దగ్గరకు వస్తే, నేను యెంతో ఆనందిస్తాను. ' 
అన్నది, మంత్రిభార్య. ' దానికేమి భాగ్యం, ప్రియా ! ఇప్పుడే నీకోరిక తీరుస్తాను. ' అని వరరుచి వెంటనే, శిరోముండనం చేసుకుని వచ్చి, తన భార్యకు ఆనందం కలుగచేశాడు.
ఈవిషయం తమ పెంపుడు చిలుక ద్వారా, మంత్రిభార్య, ' అనుకున్నట్లే జరిగింది. ' అని వర్తమానం పంపింది రాణీ గారికి. ఈవార్త తెలియగానే రాణీగారుకూడా, అకారణ బింక౦తో రాజుగారిని అదరగొట్టింది. కథమామూలే. అక్కడా రాజుగారు నానావిధాలా తిప్పలుబడి ఆమెకేమికావాలో తెలుసుకున్నాడు. రాణీగారు, ' మహారాజా ! నాకు మీరు గుఱ్ఱంలాగా నడుస్తుంటే, మీ వీపుమీద కూర్చుని సవ్వారీ చెయ్యాలనివుంది. అయితే, నేను సవారి చేస్తూ, కళ్ళాలు లాగుతుంటే, మీరు గుర్రంలాగా సకిలించాలి. అప్పుడే నాకు సంతోషం. అయినా మీరు మహారాజులు కదా ! వద్దులెండి. నాదోవన నేను యిలా వంటరిగానే వుంటాను. ' అన్నది.
వెంటనే రాజుగారు కంగారుపడి, ' అలాంటిదేమీలేదు దేవీ ! నీ ముందు నా రాజరికం ఎందుకు ? నీఆనందమే, నాఆనందం ' అని ఆమె చెప్పినట్లే గుఱ్ఱంలాగా అభినయించి, ఆమె నోటివద్ద గుడ్డలాగుతున్నప్పుడల్లా, పెద్దగా సకిలించడం ప్రారంభించాడు. అలా కొద్దిసేపు ఆడిన తరువాత, రాణీ గారు సుముఖులైనారు. ఇదంతా, చూస్తున్న మంత్రిగారి భార్య పెంపుడు రామచిలుక, నవ్వుకుంటూ, తుర్రున ఎగిరిపోయింది, రాణీగారికి, జేజేలుచెబుతూ.
అక్కడ మంత్రిగారి భార్య, పైన వున్న గవాక్షం నుండి, రామచిలుక వర్తమానం కోసం యెదురు చూడసాగింది, ఉత్సుకతో. ఆమెను చూడగానే, రామచిలుక, ' రాణీగారి అశ్వారోహణం, మంత్రిగారి శిరోముండనం. బాగు బాగు ! ' అని ఆమెకు నెమ్మదిగా చెప్పింది. అయితే యీమాట, వరరుచి విననే విన్నాడు. అది గమనించి, మంత్రిగారి భార్య, వాతావరణాన్ని తేలికబరుస్తూ, తాము సరదాగా చేసినపని చెప్పి, వరరుచికి కోపం రాకుండా చూసుకుంది.
మర్నాడు కొలువులొ, రాజుగారు వరరుచిని చూస్తూనే, ' ఏమి మహామంత్రీ ! ఈ హఠాత్ శిరోముండనం ! ' అని అడిగారు. ' ఏదోలే మహారాజా ! భర్తలన్న తరువాత, అశ్వ ఆరోహణలు, శిరోముండనములు తప్పవు కదా ! ' అని గుంభనగా జవాబుచెప్పి పక్కకు తప్పుకున్నాడు.
' కాబట్టి, కరాళముఖా ! నీమీద నాకేమీ కోపంలేదులే ! ఎప్పటిలాగే నేరేడుపళ్ల కోసం వస్తూ వుండు.' అనిచెప్పాడు. ' సంసారంలో ఇలాంటి సరిగమలు మామూలే ! ' అని చెప్పే, సరదా కథ !
Source: Gandavarapu Prabhakar Garu
(Facbook)

No comments:

Post a Comment