ఆదిపర్వం. చతుర్దాశ్వాసం.
సౌతి శౌనకాది మహామునులకు చెబుతున్నాడు.
ఒకరోజు శంతనుడు యమునాతీరంలో వేటాడుతూ వెళ్తుండగా, హఠాత్తుగా అపూర్వమైన సుగంధవాసనలు ఆయన నాసికాపుటాలకు సోకాయి. ఆ వాసనలు వస్తున్న దిక్కుగా శంతనుడు వెతుక్కుంటూ వెళ్ళాడు.
కొద్దిదూరం వెళ్ళగానే, శంతనునికి అత్యంత సౌందర్యంతో ఆమడదూరం నుండే అత్యంత సుగంధాన్ని వెదజల్లతున్న, ఒక అపూర్వ స్త్రీ, సాధారణ స్త్రీ వలే పడవ నడుపుతూ కనబడింది. ఆమె అందం చూసి మతి చెదిరింది శంతనునికి. కొద్దిసేపటికి తెప్పరిల్లి ఆమెదగరికి వెళ్లి, ' ఆమె ఎవరు ? ఎందుకు పడవ నడిపే వృత్తిలో వున్నది ? ' అని తెలుసుకో కోరి ఆమెను అడిగాడు. దానికి ఆమె, చిరునవ్వు నవ్వుతూ, ' నేను దాశరాజు పుత్రికను, నన్ను సత్యవతి అంటారు. ఇది మా కులవృత్తి, నేను నా తండ్రికి సహాయం చేస్తుంటాను. ' అని చెప్పింది.
ఆమె అందానికి, పొందికైన మాటతీరుకు శంతనుడు వెంటనే దాసుడై పోయాడు. దాశరాజును వెతుక్కుంటూ వెళ్లి, సత్యవతిని తనకిచ్చి వివాహం చెయ్యమని అడిగాడు. దాశరాజు అందుకు యెంతో సంతోషించాడు. ' చక్రవర్తి స్వయంగా వచ్చి మా అమ్మాయిని చేసుకుంటానంటే కాదంటామా ? ' అన్నాడు. అయితే, అప్పటికే శంతనునికి సంతానం వున్నందున, సత్యవతికి పుట్టబోయే బిడ్డలకు రాజ్యాధికారం రాదు కనుక, సత్యవతికి పుట్టబోయే బిడ్డలకే రాజ్యాధికారం ఇవ్వాలని, ముందరే నియమ నిబంధన విధించాడు.
కానీ, శంతనుడు తాను జ్యేష్ఠపుత్రుడు గాంగేయుడికి అన్యాయం చేయలేనని భావించి, దాశరాజును అనేకవిధాల, తన స్థాయిని మరిచిపోయి దిగివచ్చి, ప్రాధేయ పడ్డాడు. అయినా దాశరాజు పట్టు విడువలేదు. శంతనుడు చేసేది లేక విచారంగా తమ రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు. రాజ్యపాలన ప్రక్కన బెట్టాడు. నిరంతరం సత్యవతీ నామ స్మరణతో ఒంటరిగా దిగులుగా వుండసాగాడు.
అది చూసి, గాంగేయుడు, సరాసరి తండ్రినే ఆయన విచారానికి కారణం ఏమిటి ? అని అడిగాడు. ఎదిగివచ్చిన కుమారునితో, తన ప్రేమ విషయం యెలా చెప్పాలో తెలియక, ' కుమారా ! వేదవేదాంగాలు చదివిన ఋషులు, ధర్మశాస్త్రాన్ని రచిస్తూ, ఉత్తమ వంశాలలో పుట్టిన వారు, అగ్నిహోత్రాన్ని, సంతానాన్ని, వేదాలను తమ గృహంలో నిరాటంకంగా ఉండేటట్లు చూసుకోమన్నారు. నీవేమో అస్త్ర శస్త్రాలలో సమర్థుడవు. సాహసికుడవు. ఏ సమయంలో ఏ యుద్ధంలో నీకు ముప్పువాటిల్లుతుందో తెలీదు. కాబట్టి ఇంకొందరు పుత్రులను కనాలని మళ్ళీ వివాహం చేసుకుందామనుకుంటున్నాను. ' అని అతి కష్టంగా, తన మనసులోని మాట చెప్పాడు, శంతనుడు.
అది విని గాంగేయుడు రాజుగారి ముఖ్య అనుచరుల ద్వారా సత్యవతీ దేవిపై రాజుగారి మనసు వున్నదని గ్రహించి, శంతనునికి తెలియకుండా, మంత్రులను వెంట బెట్టుకుని, సరాసరి గాంగేయుడు దాశరాజు ఇంటికి వెళ్ళాడు. తన తండ్రికి ఆయన కుమార్తె సత్యవతిని ఇవ్వవలసినదిగా సూటిగా అడిగాడు. దానికి, దాశరాజు, ముచ్చటపడి, ' గాంగేయా ! ఈ సత్యవతి కారణ జన్మురాలు. ఈమెకు శంతనునితో వివాహము జరుపవలెనని, ముందే నాకు వర్తమానం వున్నది. అందువలన, ఎందరు గొప్పవారు ఈమెను వివాహం చేసుకుంటామని ముందుకు వచ్చినా నేను అంగీకరించలేదు. '
' అయితే, నీవు అసహాయ శూరుడవు. నీవు నీ సవతి తల్లి సంతానానికి రాజ్యాధికారం ఇవ్వడానికి యిష్టపడవు. ఒక వేళ నీవు ఇష్టపడినా, ఉత్తరోత్తరా నీకు జన్మించే సంతానం అందుకు ఒప్పుకోక పోవచ్చును. కాబట్టి ఈ సమస్య పరిష్కారం నీ చేతుల్లోనే వున్నది. ' అన్నాడు.
అప్పుడు గాంగేయుడు, తన ముందున్న కర్తవ్యం గ్రహించి, ' స్థిరమైన బుద్ధితో యిప్పుడే బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరిస్తున్నాను. అందువలన, నేను సంతానం లేనివాడిని అయినప్పటికీ, రాబోయే కాలంలో అనేక లోకాలు నన్ను ఆదరించడానికి సిద్ధంగా వుంటాయి. అందువలన జీవితాంతం నేను బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తానని, అష్ట దిక్పాలకుల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా, భీషణ ప్రతిజ్ఞ చేస్తున్నాను. ' అని ఎలుగెత్తి చెప్పాడు.
ఆవిధరంగా గాంగేయుడు, దేవవ్రతుడు తన ప్రతిజ్ఞను ప్రకటించగానే, అతడి పితృభక్తికి మెచ్చుకున్న దేవతలు, మొదలైనవారు సంతోషించి, అతనిపై పూలవర్షం కురిపించారు. అప్పటి నుండి దేవవ్రతుడు, ' భీష్మ ' నామాంతరం కలవాడు అయ్యాడు.
అప్పటికప్పుడే, బీష్ముడు సత్యవతిని, రాజధానికి తీసుకు వచ్చి, తనతండ్రి శంతనునితో వివాహం జరిపించాడు. గాంగేయుడు చూపించిన త్యాగబుద్ధికి శంతనుడు పొంగిపోయి, అతనికి ' ఇచ్చా మరణం ' వరంగా అనుగ్రహించాడు.
ఆ తరువాత, భీష్ముడు రాజ్యపరిపాలన ఏ లోటూరాకుండా చూసుకోసాగాడు. శంతనుడు సత్యవతీ దేవితో దాంపత్యసుఖాన్ని నిశ్చింతగా అనుభవించాడు. సత్యవతీ, శంతనుల దాంపత్య ఫలంగా, వారికి ఇద్దరు కుమారులు, చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు కలిగారు. వారు పెరిగి పెద్దవారు అవుతున్నారు.
ముందు ముందు చూద్దాం ! భీష్ముని త్యాగం కురువంశానికి ఏమాత్రం ఉపయోగపడిందో !
Source: Gandavarapu Prabhakar Garu
(Facbook)
No comments:
Post a Comment