Friday, 18 October 2019

వధువుకు తగిన వరుడు.

గంగానదీ తీరంలో ఒకచోట చాలా అందమైన ఆశ్రమం ఒకటి వుండేది. అందులో నిష్టాగరిష్టులైన బ్రహ్మచారులు, గృహస్థాశ్రమంలో వున్న మునిదంపతులు, సన్యాసులు, వేరు వేరు కుటీరాలలో వుంటూ, సదా దైవధ్యానంలో యోగాభ్యాసాలతో వుండేవారు. 
వారిలో యాజ్ఞ్యవల్కుడు అనే గృహస్తు, వుండేవాడు. అయన ఒకరోజు గంగానదిలో పవిత్రస్నానం చేస్తూ, అర్ఘ్యం యిస్తుండగా, ఆయన దోసిలి లోనికి చిన్న ఎలుకపిల్ల వచ్చింది. దానిని చూడగానే, గగుర్పాటుతో ప్రక్కనేవున్న లేతఆకుతో దానిని తప్పించి, ఆకులోనే వుంచి, దానిని తగిలిన దోష నివారణార్ధం మళ్ళీ స్నానం చేసి బయటకు వచ్చాడు. 
అయితే, ఆశ్చర్యకరంగా, ఆ యెలుకపిల్ల ఆకులో అలానే వుండి, యాజ్ఞ్యవల్కుని వైపు ప్రేమగా చూడసాగింది. దానిచూపులకు కరిగిపోయి, ఆయన, తనకు వున్న మంత్రబలంతో, ఆ ఎలుకపిల్లను చక్కని చిన్న పిల్లగా మార్చివేసాడు. ఆ చిన్నపిల్లను తన ఆశ్రమానికి తీసుకువెళ్లి, తన భార్యకు జరిగినదంతా చెప్పి, జాగ్రత్తగా పెంచమని అప్పజెప్పాడు. వాళ్లకు సంతానం లేనందున, ఆ భార్యాభర్తలు ఇద్దరూ చిన్నపిల్లను దైవమిచ్చిన సంతానంగా, అల్లారు ముద్దుగా పెంచసాగారు. 
ఇలావుండగా, ఆ మునిభార్య తమ పెంపుడు కుమార్తెకు యుక్తవయసు వచ్చిందని గ్రహించి, వివాహ సంబంధాలు చూడమని తన భర్తకు చెప్పింది. యాజ్ఞ్యవల్కుడు కూడా అది తన బాధ్యతగా భావించి, ఆమెకు తగిన చక్కని వరుడిని వెదుక ప్రారంభించాడు. ' తనకు ఆ కుమార్తె దైవికంగా సంప్రాప్టించింది కాబట్టి, దేవతలకు యిచ్చి వివాహం చేస్తే బాగుంటుంది. ' అనే ఆలోచన కూడా చేసాడు. 
ఏ తండ్రి అయినా, తమ కుమార్తెలను, మంచి కుటుంబంలో, మంచి నడవడిక వున్న , భార్యను పోషించుకునే స్తొమత వున్న, చదువూ సంస్కారం వున్న ఆరోగ్యవంతునికి యిచ్చి వివాహం చేద్దామనుకోవడం లో తప్పులేదు కదా ! అందుకనే, యాజ్ఞ్యవల్కుడు సరాసరి సూర్యదేవుని తమ అల్లుడిగా చేసుకోవాలనే కోరికతో, సూర్యుని ప్రసన్నం చేసుకుని, తనను పిలిచిన కారణం సూర్యుడు అడుగగా, ' ఈమె నాకుమార్తె. ఈమెకు అంగీకారం అయితే, దయచేసి, నీవు ఈమెను వివాహం చేసుకోవలసినది. ' అని అర్ధించాడు. 
ఈలోగా, తన కుమార్తె సమ్మతి కోసం అడుగగా, ఆమె, ' సూర్య దేవుడు తాపం ఎక్కువగా ప్రదర్శిస్తుంటాడు. నేను ఆయనను వివాహం చేసుకోలేను తండ్రీ ! ' అని చెప్పింది. వెంటనే ఆ ముని, సూర్యుడినే, ఆయనకంటే అధికులెవరైనా వుంటే మా అమ్మాయికి వరుడిగా చెప్పమని ప్రాధేయపడ్డాడు. ఇది అంతా విచిత్రం గా తోచిన సూర్యుడికి, వెంటనే, ' మేఘాలు నాకంటే అధికమైనవి. అవి వస్తే, నా ఉనికే ప్రజలకు కనబడదు. కాబట్టి మేఘుడికి యిచ్చి మీ అమ్మాయి వివాహము చెయ్యి. ' అని చెప్పి వెళ్ళిపోయాడు. 
మేఘుడిని అడగబోయేముందు, ఒక్కమాట అడుగుదామని, ఆ అమ్మాయిని, ' అమ్మా ! నీకు మేఘుడిని చేసుకోవడం ఇష్టమేనా ? ' అని లాలనగా అడిగాడు. దానికి ఆ కన్య, ' వద్దు నాన్నా ! మేఘుడు నల్లగా చల్లగా ఉంటాడు. ' అని చెప్పింది.. మేఘుడుకూడా, ' వాయువు నాకంటే అధికుడు, అతడు గట్టిగా వీస్తే నేను దూదిపింజలాగా ఎగిరిపోతాను, నీకు తెలుసు కదా ! ' అని మునితో అన్నాడు. అయితే, వాయుదేవుడు కూడా ఆ బాలామణికి నచ్చలేదు. ' ఎప్పుడూ, రకరకాలుగా వీస్తూ వుంటాడు. నాకు అతనిని చేసుకోవాలని లేదు, ఇంకెవరినైనా మంచివాడిని చూడు. ' అని తండ్రితో చెప్పింది. 
ఇక ఏమిచేయలో పాలుపోక, ముని వాయుదేవుడినే ' నీకంటే శక్తిమంతుడు ఎవరైనా వుంటే చెప్పు. ' అని అడిగాడు. దానికి వాయుదేవుడు, ' పర్వతరాజు నాకంటే శక్తిమంతుడు. ఎందుకంటే, నేనెంత శక్తితో వీచినా ఇసుమంతైనా చలించడు. ' అని సలహా ఇచ్చాడు. దానికి కూడా, ఆ అమ్మాయి, ' పర్వత రాజు కఠినంగా వుంటాడు, ఎక్కడకూ నన్ను తిప్పలేడు. కాబట్టి అతడిని నేను వివాహమాడలేను తండ్రీ ! ' అని చెప్పింది. ఇది కూడా పితృహృదయానికి సబబుగానే అనిపించి, ' పర్వతరాజా, నీకన్నా శక్తిమంతుడు, నాకుమార్తెకు తగిన వరుడిగా అనిపిస్తే చెప్పవా ! ' అని అడిగాడు. 
దానికి పర్వతరాజు, ' నాకంటే మూషికరాజు యెంతో శక్తిమంతుడు. నా శరీరం నిండా బొరియలు చేస్తూ సన్ను చాలా ఇబ్బంది పెడుతూ వుంటాడు. నీ కుమార్తెను ఆ మూషికరాజుకు యిచ్చి వివాహం చెయ్యి. ' అని చక్కని సూచన చేసాడు. 
వెంటనే ముని, మూషికరాజును ఆహ్వానించి, అతనిని వివాహం చేసుకునే విషయంలో ఆమె, అభిప్రాయం చెప్పమన్నాడు. ఆశ్చర్యకరంగా, మూషికరాజును చూడగానే, ఆ కన్య శరీరమంతా పులకించి, ' తండ్రీ ! ఈ మూషికరాజు నాకు తగిన వరుడు. తక్షణమే నన్ను అతనికి యిచ్చి వివాహం జరిపించండి. ' అని ప్రార్ధించింది. అంతేకాకుండా, తనను కూడా మూషికంగా మార్చమని వేడుకున్నది. 
వెంటనే తన మంత్రబలంతో మళ్ళీ యాజ్ఞ్యవల్కుడు, ఆ కన్యను మూషికంగా చేసి మూషికరాజుతో పరిణయం గావించాడు. 
చూసాము కదా ! సూర్యుని మొదలుకుని,పర్వతరాజు దాకా ఆమెకు ఎవరూ నచ్చలేదు. వారిలో ఏదో ఒక వంక చూసింది. కానీ తన జన్మ సంబంధమైన మూషికరాజు కనబడగానే, తన సమ్మతి తెలియజేసింది. అలాగే, పుట్టుకతో వచ్చిన వాసనలను వదిలిపెట్టడం అంత తేలికగా జరిగే పనికాదని చెప్పే కథయిది.
Source: Gandavarapu Prabhakar Garu
(Facbook)

No comments:

Post a Comment