ఆదిపర్వం. చతుర్దాశ్వాసం.
సౌతి శౌనకాది మహామునులకు చెబుతున్నాడు.
సత్యవతీదేవి, చెప్పవలసిన మాటలు అంబికకు కూడా చెప్పి, ఆమెను మానసికంగా తయారుచేసి, వ్యాసుని, ఋతుమతియైన అంబిక వద్దకు వెళ్ళమని కోరింది.
అయితే, విధి సంకల్పం వేరేవిధంగా వుంటే, అందమైన సౌందర్యరాశి అయిన అంబికకు, సత్యవతి మాటలు యెలా రుచిస్తాయి ? వ్యాసుని పొడవైన తెల్లటి గడ్డం, మునివేషంలో నల్లగా ఆజానుబాహువుగా వున్న ఆయన రూపం, ఆమెకు జుగుప్సాకరంగా కనిపించింది. అంతే అసహ్యంతో కన్నులు మూసుకుని, వ్యాసుని వద్ద గడిపింది. అది వ్యాసుడు గ్రహించి, ఆమెను అనుగ్రహిస్తూ, ' చక్కటి దేహదారుధ్యం వున్న పిల్లవాడు పుడతాడు కానీ, ఆమె కనులు మూసుకుని అసహ్యం చూపించిన కారణంగా, అంధుడుగా ఆ పిల్లవాడు పుడతాడు. ' అని చెప్పాడు. తాను చేయగలిగినది ఏమీలేక నిట్టూర్చాడు.
ఆ మాటలు విన్న సత్యవతి, అంబాలికకు కూడా ఒక పుత్రుని ప్రసాదించమని వేడుకున్నది. అయితే ఆమెకూడా తాను ఊహించిన విధంగా వ్యాసభగవానుని రూపం లేకపోవడంతో తెల్లబోయి, తన శరీరం అంతా పాలిపోయినట్లు అగుపించింది. అన్యమనస్కంగా గడిపింది. వ్యాసుడు, ఆమెకు కూడా కుమారుడిని ప్రసాదించి, ' ఆ పిల్లవాడు కూడా దేహబలం, పౌరుషం, సద్గుణాలు కలవాడు అవుతాడు గానీ, అతడు పాండువర్ణంలో జన్మిస్తాడని చెప్పాడు.
వ్యాసభగవానుడు చెప్పినట్లే అంబికకు పుట్టిన బాలుడు అమిత బలసంపన్నుడుగా పుట్టాడు. అంధుడైనా బుద్దితో చూడగల నేర్పును సంపాదించాడు. అతనే ధృతరాష్ట్ర నామధేయంతో, ఉత్తరోత్తరా, కురుసింహాసనం అధిష్టించాడు. అదేవిధంగా అంబాలికకు పాలిపోయిన, తెల్లనివర్ణంతో పాండురాజు జన్మించాడు. అతడు సద్గుణాల రాసి. పరాక్రమ వంతుడు. కురుసామ్రాజ్య రక్షణకు నిలబడే సామర్ధ్యం పొందినవాడు. బ్రాహ్మణులచేత, వీరిరువురకూ, జాతకర్మలు చేయించాడు యధావిధిగా భీష్ముడు.
ఈ ఇద్దరు వంశోద్ధారకులూ ఈ విధమైన అవలక్షణాలతో పుట్టగా, అసంతృప్తితో సత్యవతీదేవి, మళ్ళీ వ్యాసుల వారిని స్మరించుకుని, ప్రత్యక్షమవగానే, ' అంబికకు మరియొక పుతృడిని ప్రసాదించు నాయనా ! ' అని బ్రతిమిలాడింది. దానికి వ్యాసులవారు, ' ఆమెకు నిగ్రహం కలిగిన మనస్సు వుంటే, సుపుత్రోదయం అవుతుంది. ' అని చెప్పారు.
ఈసారికూడా అంబిక వ్యాసుని వికృతరూపం తలుచుకుని భయపడి, తనవద్ద వున్న దాసీని తనలాగా అలంకరించి, వ్యాసులవారి వద్దకు పంపింది. ఆ విధంగా వ్యాసుని వద్దకు వెళ్లిన ఆ దాసి, ఏ విధమైన తొట్రుపాటు పడకుండా, మునీశ్వరునికి భక్తితో పూజలు చేసింది. ఆమె చేసిన సేవకు సంతోషించి, వ్యాసభగవానుడు, ఆమె అంబిక కాదని తెలిసికూడా పుత్రుని ప్రసాదించారు. ఆయనే, మాండూక్యముని శాపఫలంగా యముని అంశతో, వేదవ్యాసుని ద్వారా విదురుడు గా అవతరించాడు. విదురుడు సకల శాస్త్ర నిష్ణాతునిగా, అమిత పరాక్రమవంతునిగా మహాభారత గాధకు అనేక చోట్ల ఆయువుపట్టుగా నిలిచాడు.
విదురుని పుట్టుక గురించి విన్న జనమేజయుడు, వైశంపాయనునితో, ' మహర్షీ ! సమవర్తి అయిన అందరకూ నియమాలు వర్తింపజేసే, యమధర్మరాజుకు, భూమిమీద పుట్టవలసిన అవసరం ఏమి వచ్చింది ? ' ఆ విషయం గురించి చెప్పండి మహానుభావా ! ' అని వినయంగా అడిగాడు.
వైశంపాయనుడు చెప్పసాగాడు : పూర్వం మాండవ్యుడనే మహర్షి అన్ని పుణ్యకార్యాలూ ఆచరించి అడవిలో ఒక పర్ణశాల నిర్మించుకుని, నిగ్రహంతో, తపస్సు చేసుకుంటున్నాడు. ఒకరోజు కొందరు దొంగలు, రాజుగారి సొమ్ము అపహరించి, రక్షకభటులు తరుముతుండగా, దిక్కుతోచక, మహర్షి పర్ణశాలలో ప్రవేశించారు. రక్షకభటులు అక్కడ కూడా వెదుకుతూ, దొంగలనూ, వారు కొల్లగొట్టిన ధనాన్ని తీసుకు వెళుతూ, వారితోపాటు మాండవ్యమహర్షిని కూడా దొంగలతో సంబంధం వున్నవాడిగా భ్రమించి, రాజుగారి వద్దకు తీసుకువెళ్లారు.
రాజు దొంగలకు మరణశిక్ష విధించి, మాండవ్యుని మాత్రం, ఒక శూలానికి అతడి శరీరాన్ని గ్రుచ్చి ఆహారపానీయాలు లేకుండా వుంచమని ఆజ్ఞాపించాడు. ఆతరువాత కొంత కాలానికి, మాండవ్యుడు గొప్ప మహర్షి అని తెలుసుకుని, ఆయనకు విధించిన శిక్షనుండి తప్పించాడు, మహారాజు. అయితే, ఆయనను వ్రేలాడదీసిన శూలంలో కొంతభాగం ఆయనతో ఉండిపోయి, అయన ' అణి మాండవ్యుడు ' అని పిలువబడ సాగాడు.
అయన, తనకు జరిగిన అవమానాన్ని దిగమింగుకుంటూ, నిత్యం జపతపాదులు చేసుకుంటూ, ముల్లోకాలు తిరుగుతుండేవాడు. ఆవిధంగా సంచరిస్తున్న సమయంలో యమధర్మరాజును చూడడం తటస్థించింది మాండవ్య మహర్షి. అప్పుడు ఆయన యముడిని, ' యమధర్మరాజా ! నాకు ఆరాజు చేత ఎందుకు అంత క్రూరమైన శిక్ష నా తప్పు ఏమీ లేకపోయినా విధింపజేసావు ? ఇది నీకున్యాయమా ! ' అని వేదనగా అడిగాడు. దానికి సమాధానంగా యముడు, ' నీవు చిన్నప్పుడు తూనీగలు వంటి అమాయక ప్రాణులను పట్టుకుని మేకుకు గ్రుచ్చి, అవి యెగరలేక పోతుంటే చూసి, ఆనందించేవాడివి. అందువలననే,నీకు ఈ శిక్ష ఈ జన్మలోనే విధించడం జరిగింది. ' అని చెప్పాడు.
దానికి మాండవ్యముని కోపించి, కంపిస్తున్న కంఠంతో, యమధర్మరాజుతో యేదో అంటున్నాడు.
Source: Gandavarapu Prabhakar Garu
(Facbook)
No comments:
Post a Comment