Friday, 18 October 2019

వ్యాస మహాభారతం - 31 (S-16)

ఆదిపర్వం. చతుర్దాశ్వాసం.
సౌతి శౌనకాది మహామునులకు చెబుతున్నాడు.
సత్యవతీ, శంతనుల దాంపత్యఫలంగా, వారికి యిద్దరు కుమారులు, చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు కలిగారు. వారు పెరిగి పెద్దవారు అవుతున్నారు. శంతనుడు కాలం చేసిన తరువాత, భీష్ముడే ఇద్దరు పిల్లలను, పితృసమానుడై, కంటికి రెప్పలా సాకసాగాడు. 
వారు యుక్తవయస్కులైన తరువాత, దాశరాజుకు భీష్ముడు యిచ్చిన మాట ప్రకారం, పెద్దవాడైన చిత్రాంగదునికి రాజ్యాభిషేకం చేసాడు. చిత్రాంగదుడికి దురహంకారం యెక్కువ. చీటికీ మాటికీ పెద్దా చిన్నా లేకుండా, చివరకు దేవతలూ, గంధర్వులను కూడా లక్ష్యపెట్టక, అందరితో తగాదా పడుతుండేవాడు. ఒక రోజు చిత్రాంగదుడు అనే పేరుగల గంధర్వునితో అకారణంగా, ' నా పేరు వున్న నిన్ను బ్రతకనీయను. నీవో నేనో ఒక్కడే చిత్రాంగదుడు వుండాలి. ' అని అతనిని ద్వందయుద్ధానికి ఆహ్వానించి, కురుక్షేత్రంలో యుద్ధం చేసాడు. వద్దని వరించినా భీష్ముని పలుకులను కూడా చిత్రాంగదుడు లెక్కచేయలేదు. పోగాలము దాపురించింది కదా ! మాయా యుద్ధంలో నేర్పరి అయిన గంధర్వరాజు చిత్రాంగదుని ధాటికి నిలబడలేక అతని చేతిలో, అతి చిన్న విషయానికే ఈ చిత్రాంగదుడు హతుడయ్యాడు
ఆ తరువాత భీష్ముడు రెండవవాడు అయిన విచిత్రవీర్యునికి పట్టాభిషేకం చేసి, రాజ్యపాలన తాను చూసుకోసాగాడు. విచిత్రవీర్యుడు కూడా భీష్ముని యెంతో గౌరవించేవాడు. విచిత్రవీర్యునికి వివాహం చేయ సంకల్పించి, కాశీరాజు తన ముగ్గురు కుమార్తెలు అంబ, అంబికా, అంబాలికలకు స్వయంవరం ప్రకటించగా, భీష్ముడు స్వయంగా, తమ్మునికొరకు స్వయంవరానికి వెళ్ళాడు. వెళ్ళీవెళ్ళగానే, స్వయంవర ప్రక్రియ ప్రారంభం కాకుండానే, ' నేను తమ్ముడు విచిత్రవీర్యుని కొరకు ఈ ముగ్గురినీ తీసుకుని వెళ్తున్నాను. నన్ను యెదిరించగల ధీరుడు యెవరైనా వుంటే అడ్డుకోండి. ' అని ప్రకటించాడు. 
అయితే, అందరు రాజులూ ప్రక్కకు తప్పుకోగా, అప్పటికే ఆముగ్గురు కన్యలలో పెద్దదైన అంబను ప్రేమించిన సాళ్వుడు గట్టిగా ప్రతిఘటించాడు. భీకరంగా యుద్ధం చేసాడు. కానీ, భీష్ముని నిలువరించలేక పోయాడు. ఆవిధంగా ముగ్గురినీ యిచ్చి విచిత్రవీర్యునికి వివాహం చేద్దామని భీష్ముడు నిర్ణయించగా, అంబ, ' మహానుభావా ! యింతకుముందే, నేను సాళ్వరాజు పరస్పరం ప్రేమించుకున్నాము. నా తండ్రి కూడా సాళ్వునికి మాట యిచ్చాడు. కాబట్టి నీకు ఏది ధర్మం అని తోస్తే అది చేయి. ' అని అభ్యర్ధించింది. 
ఆమె మాటలకు భీష్ముడు నొచ్చుకున్నాడు. ' ఈవిషయం స్వయంవరంలోనే నీ తండ్రి గానీ, నీవు గానీ ధైర్యంగా చెప్పవలసినది. ఏది ఏమైనా, నీవు కోరుకున్న సాళ్వరాజు వద్దకు నిన్ను యిప్పుడే పంపిస్తాను. ' అని చెప్పి అంబను గౌరవ ప్రదంగా, సకల మర్యాదలతో సాళ్వుని వద్దకు పంపించాడు భీష్ముడు. మిగిలిన ఇద్దరు సోదరీమణులు అంబికా, అంబాలికలను యిచ్చి విచిత్రవీర్యునకు ఘనంగా వివాహం జరిపించాడు. 
అంతా బాగా జరిగిందని భీష్ముడు ఊపిరి పీల్చుకునే లోపే, విచిత్రవీర్యుడు, తనకు లభించిన అతి లావణ్యమైన సుందరీమణులు, యిద్దరు భార్యలతో, విచ్చలవిడిగా కామకేళి జరిపి, పగలనక రేయనక, యెక్కడబడితే అక్కడ, వారితో క్రీడించి, మితిమీరిన కామవాంఛతో, కొద్దిరోజులలోనే క్షయవ్యాధితో మరణించాడు. 
చూస్తున్నాము గదా, మహాభారత గాథలో వేదవ్యాసుడు, అనేకచోట్ల, చెయ్యకూడని పనులు చెయ్యవద్దని, యెంత అంతర్లీనంగా చెబుతున్నారో ! అందుకే ఇది పంచమవేదం అయింది. అలాగే చెయ్యవలసిన విధులు కూడా మనకు కనిపిస్తాయి. అవీ ఇవీ అన్నీ మననం చేసుకుంటూ, వితండవాదాలు చెయ్యకుండా, జీవితం సార్ధకం చేసుకోవాలి. 
ఇప్పుడు భరతవంశం నిర్వీర్యమై, వారసులు లేక అంతరించడానికి సిద్ధంగా వున్నది. బీష్ముడు అతి దుఃఖాన్ని అనుభవిస్తూ కూడా, తల్లి సత్యవతిని, మరదలు అంబికా, అంబాలికలను ఓదారుస్తూ, రాజ్యపాలన చేయసాగాడు. ఈబాధ భరించలేక, సత్యవతి, భీష్ముని వివాహం చేసుకొమ్మని వంశవృద్ధి చెయ్యమని వత్తిడి చేయసాగింది. ఏ సత్యవతి అయితే, లోక విరుద్ధమైన కోరిక కోరి, దేవవ్రతుని ఆజన్మబ్రహ్మచారిగా మార్చిందో, అదే సత్యవతి నోటినుండి, వివాహం చేసుకొమ్మని అభ్యర్ధన రావడం, విచిత్ర పరిణామం కదా ! 
అయితే, భీష్ముడు సత్యవతి వత్తిడికి తలవొగ్గలేదు. తాను వివాహమాడే ప్రసక్తి లేదన్నాడు. ఆవిషయంమళ్ళీ మళ్ళీ యెత్తవద్దని, తల్లిని ప్రార్ధించాడు. ' సూర్యుడు తన ప్రకాశాన్ని కోల్పోవడం సంభవమేమో కానీ, అగ్ని తన ఉష్ణప్రవృత్తిని మార్చుకున్నా మార్చుకోవచ్చేమో కానీ, చంద్రుడు తన వెన్నెలను గ్రీష్మ తాపంగా మార్చవచ్చేమో గానీ, నేను మాత్రం పంచభూతాల సాక్షిగా చేపట్టిన నా బ్రహ్మచర్య వ్రతాన్ని వదులుకోను. ' అని తల్లితో నిర్ద్వందంగా చెప్పాడు. ' శంతనుని వంశం ముందుకు కొనసాగాలంటే, యేమి చెయ్యాలో, ధర్మ శ్రేష్ఠులైన పురోహితులనూ,పండితులనూ పిలిచి చర్చిద్దాము. ' అని తల్లితో చెప్పాడు. 
' ఆప్రకారం ఆలోచిస్తే, పూర్వము పరశురాముడు కారణాంతరాల వలన క్షత్రియులపై కోపించి రాజపత్నుల గర్భాలలోని శిశువులను కూడా ఒక్కళ్ళనీ మిగల్చకుండా చంపివేస్తే, బ్రాహ్మణశ్రేష్ఠులు, ఆ రాజపత్నులకు ధర్మశాస్త్రప్రకారం సంతానాన్ని కలిగించి వారివంశాలను నిలిపారు. '
' అదేవిధంగా, ' గొప్ప మనోనిగ్రహం కలవాడు, ధర్మమూర్తి అయిన బ్రాహ్మణశ్రేష్ఠుని ఆరాధించి, విచిత్ర వీర్యుని భార్యలకు సంతానం కలిగే విధంగా చూడు తల్లీ ! ' అని భీష్ముడు సత్యవతిని కోరగా, ఆమె, పూర్వము పరాశరుని ద్వారా తనకు కన్యత్వ దోషము కలుగకుండా, జన్మించిన వ్యాసభగవానుని జ్ఞప్తికి తెచ్చుకుని, అవసరమైతే పిలువమని చెప్పిన ఆయన మాటలను స్మరించుకుని, వ్యాసుని ఆ సమయంలో అక్కడకు ఆహ్వానించింది. వెంటనే ఇంద్రనీల మణివలె వ్యాసుడు తల్లికి దర్శనమిచ్చాడు. పాదాలకు నమస్కరించాడు. తనను పిలిచిన కారణమేమిటని అడిగాడు. 
సత్యవతీ దేవి కుమారుడైన వ్యాస భగవానునికి జరిగినదంతా పూస గ్రుచ్చినట్లు చెప్పి, దేవరన్యాయాన్ని పాటించి అతని తమ్ముడు విచిత్రవీర్యుని భార్యలైన అంబికా, అంబాలికలకు పుత్రభిక్ష పెట్టి వంశాన్ని కాపాడమని కోరింది. సత్యవతి వ్యాసునితో, రాజులేని రాజ్యం లో యెలాంటి విపత్కర పరిస్థితులు సంభవిస్తాయో చెప్పింది. నీవు ఏమాత్రం ఆలశ్యం చెయ్యకుండా, రాజ్యాన్ని, రాజవంశాన్నినిలబెట్టాలని వేడుకున్నది. 
ఆమె కోరికను మన్నిస్తానని వ్యాసుడు చెప్పాడు. ఇదిచాలా పురాతనమైన వేదాలలో వున్న ధర్మమే ! నేను ఈకాశీరాజు పుత్రికలను ధర్మనీతితో సంతానవతులను చేస్తాను. నేనుచెప్పే వ్రతాన్ని వీరు సంవత్సరం పాటు ఆచరించాలి. అప్పుడే వారి హృదయాలు పునీతమై, వారికి ఉత్తములైన పుత్రులు పుడతారు. ' అని వ్యాసుడు చెప్పాడు. 
సత్యవతీదేవి, చెప్పవలసిన మాటలు అంబికకు కూడా చెప్పి, ఆమెను మానసికంగా తయారుచేసి, వ్యాసుని, ఋతుమతియైన అంబిక వద్దకు వెళ్ళమని కోరింది. 
సత్యవతీ దేవి వంశవృద్ధికి పడుతున్న తాపత్రయం యెలా పరిణమిస్తుందో !
Source: Gandavarapu Prabhakar Garu
(Facbook)

No comments:

Post a Comment