Sunday, 20 October 2019

ఏకలవ్యుని విషయం లో గురు ద్రోణులు అన్యాయం చేసారా... ?

ఇటువంటి ఘట్టాల వద్ద ఏకాగ్రంగా పరిశీలించాలి. బుద్ధిని ఉపయోగించాలి. పాండవులు రాజ్యపాలన బాధ్యతగల కుటుంబంలోని వారు – అంటే క్షత్రియులు. నాటి సాంఘిక వ్యవస్థను అనుసరించి రాజ్యరక్షణ బాధ్యత వారి ధర్మం. అటువంటి క్షత్రియులకు రాజ్య రక్షణార్థం అవసరమైన విద్య ‘ధనుర్వేదం’. ఇది సమంత్రకమైన విద్య. దీనికొక తపశ్శక్తి, సంస్కార విశేషం అవసరం. అవి కలిగిన వారు పాండవులు, విశేషించి అర్జునుడు.
ఏకలవ్యుడు ప్రఙ్ఞాశాలి.ఏకాగ్రమైన చిత్తంతో సాధన చేసి కొంతమేరకు విద్యను సాధించిన ప్రతిభావంతుడు. అందులో సందేహం లేదు. కానీ అతడు ద్రోణుని గురువుగా భావించాడు. కనుక అతడు తన విద్యతో సాధించే ప్రతిపనికీ ద్రోణుని ‘గురుముద్ర’ ఉండి తీరుతుంది. తద్వారా ద్రోణుడూ బాధ్యుడవుతాడు. ఆ బాధ్యత కలిగియున్నవాడు కనుక ద్రోణుడు ధర్మాన్నీ, దేశక్షేమాన్నీ, దృష్టిలో ఉంచుకొని ఏకలవ్యుని బొటనవ్రేలిని దక్షిణగా అడిగాడు.
ఇందులో రాజకులానికి అమ్ముడుపోవడం లేదు. దేశపాలకులకు గురువైన వాడు, దేశరక్షణకు అవసరమైన యుద్ధ విద్యను, ఆ రక్షణ ధర్మం కలిగిన రాజులకు అందిస్తున్నాడు. దేశరక్షణకు ప్రధానమైన యుద్ధ విద్య సామాన్యులకు నేర్పుతారా! ఇప్పటికైనా రక్షణ శాఖారహస్యాలను ప్రభుత్వం ప్రజలకు బట్టబయలు చేస్తుందా? దానిలో సుశిక్షితులై, అంకితభావంతో నియమితులైన వారికి మాత్రమే కదా అవి తెలిసేవి! అలా కాదని ప్రజలందరికీ వాటిని తెలియజేస్తే ప్రమాదం కాదా!
ఒకవేళ పొరపాటున ఒక సామాన్యునికి తెలిస్తే అతడి నుండి సమాజానికి ప్రమాదం వస్తుందేమోననే ఊహతోనైనా ప్రభుత్వం శిక్షిస్తుంది కదా! ఇందులో ‘వర్గవివక్ష’ లేదు కదా. ‘డిఫెన్స్’(రక్షణశాఖ) వారి వద్దకు వెళ్ళి ‘మిస్సైల్స్’ ఎలా చేయాలో నేర్పండి అని ఎవరైనా వెళ్ళి అడిగితే నేర్పుతారా? అవి చేసే పరికరాలను ఏర్పాటు చేయమంటే చేస్తారా? అంతేకాక మరో రహస్య విషయమేమిటంటే ఆటవికుడైన ఏకలవ్యుడు, శబరులు వంటి వారికి అలవాటైన ఒక విధమైన ఉపాసనతో ద్రోణుని ప్రతిమ ద్వారా విద్యను గ్రహించాడు. అది కపటోపాసన. దానికి శిక్ష కూడా ధర్మపరంగా విధించాడు ద్రోణుడు.
అదేవిధంగా రహస్యమైన ధనుర్వేదం పాండవాదులకే నేర్పుతున్నాడు. ఆ విద్య ఏకలవ్యుని వద్ద ఉంటే భవిష్యత్తులో సమాజానికి హాని కలుగవచ్చు. ఎందుకంటే విద్యకు ప్రయోజనమనేది ముఖ్యం. ఆ ప్రయోజనం తెలియని విద్య ఏకలవ్యునిది. అతడు వృత్తిపరంగా నిషాదుడు. హింసా ప్రధాన ప్రవృత్తి గల విద్య అతనిది. క్షాత్రమైన ధనుర్వేద విద్య హింసా ప్రధానమో, పోషణ ప్రధానమో కాదు. ధర్మ దేశ పరిరక్షణార్థమైనది. సంస్కారాన్ని అనుసరించి విద్యను ఉపదేశిస్తేనే, విద్యా ప్రయోజనం నెరవేరుతుంది. ఇక్కడ వర్గ ప్రస్తావన కన్నా వారి వారి స్థానాల ప్రస్తావనను గమనించాలి. విద్యా స్వరూపమూ, ప్రయోజనమూ తెలియకపోవడం చేతనే వేటకుక్కపై విద్యా కౌశల్యాన్ని ప్రయోగించి ఏడు బాణాలను వేశాడు ఏకలవ్యుడు. ఇందులోనూ వృధాహింసాత్మకమైన రాక్షస వృత్తి గోచరిస్తుంది. విద్యాదుర్వినియోగం కనబడుతుంది. ఉత్తముడైన గురువు శిష్యుడి చిత్త సంస్కారాన్ని, లక్షణాలనీ కూడా గ్రహించగలడు. ద్రోణుడు అటువంటి ఉత్తమ గురువు. అందుకే ఏకలవ్యునిలోనూ ప్రమాదకర ప్రవృత్తిని గమనించాడు. ధనుర్వేదం కేవలం ‘విలువిద్య’ కాదు. అస్త్రవిద్య వేరు, శస్త్రవిద్య వేరు. మంత్రపూరితమైనది అస్త్రవిద్య. ఈ రెండూ కలిసి ధనుర్విద్య. దేశక్షేమంకరమైన ధనుర్వేదం రక్షణ బాధ్యతగల వారి వద్ద మాత్రమే ఉండవలసిన విద్య. అందుకే మొదటే ఆ విద్యను ఏకలవ్యునికి నేర్పడానికి నిరాకరించాడు. అది రాజగురు ధర్మం. పైగా అడవిలో ఏకలవ్యుడు తారసపడడం, ద్రోణుడు బొటనవ్రేలిని అడగడం వెనుక దైవసంకల్పం కూడా ఉంది. ఈ విషయం కర్ణపర్వంలో ఘటోత్కచ వధానంతరం శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పారు. రాక్షసాంశతో ఉద్భవించిన పాత్రలలో కంస, జరాసంధ, ఘటోత్కచ, ఏకలవ్యుల పేర్లు చెప్పబడ్డాయి. అందుకే వారు వివిధ విధాలుగా దెబ్బతీయబడ్డారు. రాక్షస భావాలున్న వారి చేతిలో విఙ్ఞానశాస్త్రాలుంటే రణమూ, లోకవినాశనము కలుగుతాయి. పైగా గురు ముఖతః ప్రత్యక్షంగా నేర్వని విద్యలు ప్రమాదకరాలు అని శాస్త్రవచనం. అందుకే పరమాత్మ ప్రేరణ వల్లనే ఉత్తమ చిత్తవృత్తి కలిగిన ద్రోణునకు ఆ సంకల్పం కలిగింది.
ధర్మరక్షణకోసం సుక్షత్రియులకు శిక్షణనిస్తున్న ఆచార్యుడు తనను ఆరాధిస్తున్నాడనే మోహంతో ఒక నిషాదుని (హింసయే వృత్తిగా జీవించే వేటగాడిని) క్షమిస్తే విపత్కర పరిణామాలు ఎదురుకావా!
పాండవాదులను శిష్యులుగా అంగీకరించి విద్య నేర్పుతున్న గురువు ద్రోణుడు. తాను విద్యను నేర్పకపోయినా తనను గురువుగా అంగీకరించిన శిష్యుడు ఏకలవ్యుడు. కేవలం అంగీకరించిన మాత్రం చేతనే ఆ కళంకం ద్రోణునికి వచ్చే ప్రమాదముంది. తరువాత ఏవైనా విపరీత పరిణామాలొస్తే దానికి అతడు బాధ్యుడౌతాడు.
పాండవాదులు తనను పోషిస్తున్నారనే భావంతో ప్రవర్తించలేదు ద్రోణుడు. ఒక ధార్మిక మూర్తిగా వ్యవహరించాడు. ఒక సమిష్టిగతమైన శాశ్వత, ఉన్నత ధార్మిక ప్రయోజనంకోసం ఒక వ్యక్తికి అన్యాయం ‘జరిగినట్లు’ ప్రవర్తించడం అధర్మం కాదు. నిజానికి అది అన్య్తాయమూ కాదు. అదే న్యాయం కూడా.
ఇలా ఎన్నో కోణాలతో కూడుకున్నది ఈ ఘట్టం.
ధర్మ సూక్ష్మాలమయమైన భారత ఇతివృత్తాలను సూక్ష్మదృష్టితో పరిశీలించాలి. ద్రోణుడు వశిష్ఠాదుల వంటి ముని(ఋషి)జీవనం గలవాడు కాదు. కేవలం ఆచార్యుడు. వశిష్ఠుడు ఋషి, ఆచార్యుడు కూడా. ఇరువురికీ భేదముంది. ఏనాడూ గురుధర్మాన్ని అతిక్రమించలేదు ద్రోణుడు.

సంగ్రహణ: బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి Facebook Page నుండి 

No comments:

Post a Comment