Friday, 18 October 2019

దుష్టుల అండ కోరితే....

ఆపదలో అందుకునే సహాయం, గోడపట్టుకుని నడిచినట్లు వుండాలిగానీ, గోతిలో పడేటట్లు కాదని తెలియజెప్పే, పంచతంత్ర కథ.
గంగదత్తుడనే కప్పలరాజు, తనబంధువుల పోరుపడలేక, వారందరినీ విడిచిపెట్టి, తాను వుండే పెద్దబావిలోనుండి, యెలాగో బయటకువచ్చి, తన పరిస్థితికి యెంతో చింతిస్తూ వుండగా, ప్రియదర్శనుడనే ఒక నల్లని త్రాచుపాము, దాని కంటబడింది.
' నాబంధువులే శత్రువులైనవేళ, నేను మళ్ళీ నాస్థానం పొందాలంటే, మా జాతి శత్రువైన యీ త్రాచుని ఆశ్రయించవలసిందే. ' అని భావించి, తనతో స్నేహం కలపమని అడిగింది, కప్పలరాజు, నల్లత్రాచుని. ముందు త్రాచుపాము, తటపటాయించినా, ' తన బంధువులపైన, పరాయివాడైన తనకు పితూరీలు చెబుతూ, వాళ్ళు వుండేచోటు చూపిస్తాను. ' అని ఆశపెట్టడంతో స్నేహానికి ఒప్పుకుంది. కప్పలరాజు తెలివితక్కువ తనం అప్పటికే అంచనావేసింది, నల్లత్రాచు. 
చెప్పినట్లుగానే, కప్పలరాజు, తన బంధువులు నివసించే, పెద్దబావిలోనికి వెళ్ళడానికి, తనకు తెలిసిన రహస్యమార్గం చూపించి, త్రాచుపాముకు, బావిలో సుఖంగా నివాసం కూడా యేర్పాటు చేసింది. మెల్లమెల్లగా, గంగదత్తుడు చూపిస్తున్న విధంగా, అతని శత్రువులైన బంధువర్గాన్ని అంతా త్రాచుపాము, మాయం చేసేసింది, రోజూ తనఆహారంగా స్వీకరించి.
ఇప్పుడు, క్రమంగా కప్పల సంతతి అంతరించి పోతుండడంతో, తనకు యిక ఆహారం దొరికేమార్గం కోసం, ప్రియదర్శనుడు, ' నీవు చూపించిన వారినందరినీ చంపివేసి, నీకు మేలుచేశాను. ఇప్పుడు నా ఆహారం యికపై నీవే యేర్పాటు చేయాలి. ఎందుకంటే, నన్ను యిక్కడికి తీసుకువచ్చినది నీవేగదా ! ' అని గంగదత్తుడితో అన్నది.
కానీ గంగదత్తుడు, ' నీ సహాయానికి కృతజ్ఞతలు. ఇక నీవు యీ ప్రదేశం వదలివెళ్లిపోయే సమయం వచ్చింది. కాబట్టి ఇక్కడినుంచి బయలుదేరు. ' అన్నది. ' నేనెక్కడికి వెళ్తాను. నీవు నాకు ఆహారంగా రోజుకి ఒకకప్పను సమర్పించుకో, నేను యీబావి విడిచివెళ్లే ప్రసక్తిలేదు. ' అని నిక్కచ్చిగా చెప్పింది, త్రాచుపాము.
.
గంగదత్తుడికి యేమిచేయాలో పాలుపోక, బలవంతునితో తగవుపడలేక, సరే అన్నది.
' తెలివైనవాడు, చిన్నవిషయాలకు, పెద్దసంపదను పోగొట్టుకోలేరు కదా ! ' అని తనను తాను సమర్ధించుకున్నది. తప్పని పరిస్థితులలో, తనదగ్గరవున్న పరివారంలోని అనుచరులను, ఒక్కొక్కరిగా రోజూ పాముకు సమర్పిస్తూ వచ్చింది. ' కూర్చునితింటే, కొండలే కరిగిపోతాయి. ఇక కప్పలు ఒక లెక్కా ! ' అన్నట్లు, కొన్నాళ్ళకు, బావిలోవున్న కప్పలన్నీ పాముకు ఆహారంగా అయిపోయాయి.
త్రాచుపాము తన ఆహార౦ కోసం మళ్ళీ కప్పలరాజును వత్తిడిచేయగా, తనను వేరే బావి కనుక్కునే ప్రయత్నం చెయ్యడానికి వదలమని చెప్పింది. ఆహారం చూపిస్తానని నమ్మబలికింది. త్రాచుపాము, ముందు ' ససేమిరా ' అన్నది. కానీ, కూర్చుని తినమరిగినదై, తన ఆహారం సంపాదించుకునే శక్తి కోల్పోయి, పైకి బింకంగా, గంగదత్తుడిని వెళ్ళడానికి అంగీకరించింది. త్వరగా రమ్మనిచెప్పింది. 
ఒక్కసారి పైకి వచ్చిన గంగదత్తుడు గట్టిగా వూపిరిపీల్చుకుని, మళ్ళీ ఆబావిముఖం చూడకుండా తన భార్యాపిల్లలతో, ' బ్రతుకు జీవుడా ' అని పారిపోయింది.
ప్రియదర్శనుడు కబురుచేస్తే, ' ఆకలితోవున్న నీకంటబడడానికి నేను మూర్ఖుడినికాదు. నిన్నునమ్మి నాబంధువులను నీకు అప్పగించాను. పెద్ద తప్పుచేశాను. కొద్దిగా ఆలోచించి నీతో చెయ్యికలపకుండా వుంటే, కనీసం నా బంధువులైనా సుఖంగా వుండేవారు. ' అని కబురుచేసింది.
అందుకే కయ్యానికి, నియ్యానికీ సమ ఉజ్జీలు కావాలి. ' మనతోటివారితో విరోధం తెచ్చకుని, మనకన్నా అధికుల సహాయం పొందేటప్పుడు, ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. సహాయంచేసి నెత్తినెక్కి స్వారీ చేసేవాళ్ళ విషయం లో మరీజాగ్రత్తగా వుండాలి. ' అని గంగదత్తుడి కథ మనకు చెబుతున్నదికదా !
Source: Gandavarapu Prabhakar Garu
(Facbook)

No comments:

Post a Comment