Sunday, 16 May 2021

1. 1 ప్రథమాధ్యాయము. అర్జున విషాదయోగః

ఓం నమో భగవతే వాసుదేవాయ 


ఓం శ్రీ గురుభ్యోనమః`

ఓం నమో భగవతే వాసుదేవాయ 

ఓం శ్రీ గురుభ్యోనమః`

ప్రథమాధ్యాయము. 

అర్జున విషాదయోగః 


ధర్మక్షేత్రే కురుక్షేత్రే సామవేతా యుయుత్సవః | 

మామకా పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ|| 


దృతరాష్ట్ర ఉవాచ - దృతరాష్టుడు పలికాడు; ధర్మక్షేత్రే - ధర్మక్షేత్రమైన ; కురుక్షేత్రే - కురుక్షేత్రం అనే ప్రదేశం లో; సమవేతా -సమకూడి ఉన్న; యుయుత్సవ - యుద్ధోత్సాహం కలవారై; మామకా - నా పుత్రులు (పక్షం వారు); పాండవా - పాండురాజు పుత్రులు; చ - మరియు ; ఏవ- నిశ్చయంగా ; కిమ్ - ఏమి ; అకుర్వత -చేశారు; సంజయ-ఓ సంజయా 

భావం: దృతరాష్ట్రుడు సంజయుడిని ఇలా అడిగాడు. ఓ సంజయా! ధర్మక్షేత్రమైన కురుక్షేత్రము నందు నా పుత్రులు మరియు పాండురాజు తనయులు యుద్ధం చేయడానికి సిద్ధమై సమకూడిన తర్వాత ఏమి చేశారు?

భాష్యం: శ్రీమద్భగవద్గీత గొప్ప ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రం. ఇది గీతామహాత్మ్యం నుంచి తీసుకోబడింది. భగవద్గీతను కృష్ణుని భక్తుల సహకారంతో పరిశీలనాత్మకంగా చదివి ఎలాంటి సొంత అభిప్రాయాలు లేకుండా అర్ధంచేసుకోవడానికి ప్రయత్నించాలని దానియందు చెప్పబడింది.  గీతను అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడి నుంచి ప్రత్యక్షంగా విని అవగాహన చేసుకున్నాడు. ఈ విధంగా స్పష్టమైన అవగాహన కలుగుతుంది అని చెప్పడానికి భగవద్గీతలోనే నిదర్శనం ఉంది. మనిషి గురుశిష్య పరంపరలో సొంత అభిప్రాయాలు, వ్యాఖ్యానాలు లేకుండా భగవద్గీతను అవగాహన చేసుకోగల భాగ్యవంతుడైతే సమస్త వేద జ్ఞానాన్ని, ప్రపంచంలోని ఇతర శాస్త్రాలని అవగతం చేసుకోగలడు. ఇతర శాస్త్రాలలో విషయాలనే కాకుండా  ఇతర క్లిష్టమైన విషయాలని సైతం పాఠకుడు ఈ భగవద్గీత యందు చూడగలడు. అదే గీత యొక్క విశిష్టమైన ప్రాముఖ్యత.  పూర్ణ పురుషోత్తముడైన శ్రీ కృష్ణ భగవానుడి ద్వారా ప్రత్యక్షంగా చెప్పబడినందున ఈ భగవద్గీత సంపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రమై విరాజిల్లుతోంది. 

మహాభారతంలో వర్ణించబడిన దృతరాష్ట్ర, సంజయుల సంభాషణలు  ఈ గొప్ప తత్వ శాస్త్రానికి మూల సిద్ధాంతాలై ఉన్నాయి. అనాదియైన వేదకాలం నుండి తీర్థస్థలంగా ప్రసిద్ధి చెందిన కురుక్షేత్రంలో ఈ తత్వశాస్త్రం ఉద్భవించినట్లుగా తెలుస్తోంది. ఈ భూమిపై శ్రీకృష్ణ భగవానుడు అర్జుని పక్షంలో నిలిచి ఉండడం వల్ల  ధర్మక్షేత్రం అనే పదం ప్రాధాన్యతని సంతరించుకుంది. కౌరవుల తండ్రియైన దృతరాష్ట్రుడు తన పుత్రుల విజయ అవకాశం గురించి సందేహితుడై ఉన్నాడు. అందువల్ల అతను "వారు ఏమి చేసారు" అని తన కార్యదర్శి అయినా సంజయుడిని ప్రశ్నించాడు. తన పుత్రులు, పాండురాజు పుత్రులు యుద్ధం చేయాలనే నిశ్చయంతో కురుక్షేత్రం లో సమకూడారని అతనికి తెలిసి ఆవిధంగా  అడగడంలో ఒక ప్రాముఖ్యత ఉంది. జ్ఞాతులైన సోదరుల మధ్య అతను రాజీని కోరుకోలేదు. అంతే కాకుండా యుద్ధభూమిలో తన పుత్రుల విధి ఏ విధంగా ఉందొ అతను తెలుసుకోవాలనుకున్నాడు. కానీ దేవతలకు సైతం పూజనీయ స్థానంగా చెప్పబడిన కురుక్షేత్రంలో యుద్ధం ఏర్పాటు చేయబడటం వల్ల యుద్ధ పరిణామం పై స్థల ప్రభావాన్ని గురించి ఎక్కువగా భయపడ్డాడు. స్వభావరీత్యా ధర్మాత్ములైనందువల్ల అర్జునుడు మరియు ఇతర పాండు పుత్రులకు అది అనుకూల ప్రభావం చెపుతుందని అతను భావిస్తున్నాడు. సంజయుడు వ్యాసదేవుని శిష్యుడు. దృతరాష్ట్రుని మందిరంలో ఉన్నప్పటికీ అతను వ్యాసుని కరుణ వల్ల కురుక్షేత్ర రంగాన్ని చూడగలిగారు. అందువల్లనే పరిస్థితిని గురించి దృతరాష్ట్రుడు సంజయుడిని అడిగాడు. 

పాండవులు మరియు దృతరాష్ట్రుని పుత్రులు ఒకే వంశానికి చెందిన వారు. కానీ కేవలం తన పుత్రులని మాత్రమే కురుసంతానంగా చెప్పి పాండు సంతానాన్ని వంశం నుంచి వేరుపరచడం ద్వారా దృతరాష్టుడూ తన మనస్సుని వ్యక్తపరుస్తున్నారు. సోదరుని పుత్రులైన పాండవుల పట్ల దృతరాష్టునికి గల సంబంధం దీనిద్వారా ఎవరైనా అర్ధం చేసుకోవచ్చు. పంటపొలం నుంచి కలుపుమొక్కలు తీసివేయబడునట్లుగా ధర్మ పిత అయినా శ్రీకృష్ణ భగవానుడు నిలిచి ఉన్న ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం నుంచి కలుపుమొక్కలు లాంటి దుర్యోధనుడు, ఇతర దృతరాష్ట్ర తనయులు తీసివేయబడతారని, యుధిష్ఠిరుని అధ్యక్షతన ఉన్న ధర్మబద్ధులైన పాండవులు భగవానునిచే సుప్రతిష్టులు కాగలరని మొదటినుండి ఊహించబడింది. చారిత్రిక మరియు వైదిక ప్రాముఖతయే కాక 'ధర్మక్షేత్రం ' మరియు 'కురుక్షేత్రం' అనే పదాలకు  విశిష్ట అర్ధం ఇదే. 

No comments:

Post a Comment