Wednesday, 30 December 2020

గ్లాసుడు నీళ్ళు

 

🍁 ఒక సన్న్యాసి అదృష్ట వశాత్తూ భగవంతుడిని కలుసుకున్నాడు. భగవంతుడి చిరునవ్వు నవ్వి నీకేం కావాలి నాయనా అని అడిగాడు.

🍁 ఆ సన్న్యాసి నాకు సత్యాన్ని తెలుసుకోవాలని వుంది.సత్యాన్ని బోధించండి అన్నాడు. దానికి భగవంతుడు చూడు బాబూ!యిప్పుడు చాలా వేడిగా వుంది కదా ఒక గ్లాసుడు నీళ్ళు తెచ్చిపెట్టు.నీరు త్రాగి నీకు బోధిస్తాను అన్నాడు.

🍁 అక్కడికి దగ్గరగా గ్రామం కానీ,ఇళ్ళు కానీ లేవు. చాలా దూరం నడిచి వెళ్లి ఒక యిల్లు కనబడితే వెళ్లి తలుపు తట్టాడు.లోపలినుండి ఒక అందమైన కన్య వచ్చింది.

🍁 సన్నటి నడుము, కలువరేకుల్లాంటి కళ్ళు , చంద్రబింబం లాంటి ముఖం. అతను అంత అందమైన అమ్మాయిని అతను యింతవరకూ చూడలేదు.

🍁 అతని వైపు చూసి అందంగా చిరునవ్వు నవ్వింది. అలా నవ్వుతూ వుంటే యింకా అందంగా కనిపించింది. అంతే తాను వచ్చిన పని మర్చిపోయి నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడు. ఆ కన్య అంగీకారంగా తల వూచింది.

🍁 వారిద్దరూ వివాహం చేసుకున్నారు.రోజులు గడిచిపోతున్నాయి చాలా మంది పిల్లలు కలిగారు.ఎంతకాలం గడిచి పోయిందో వాళ్లకి తెలియనేలేదు.

🍁 ఇలా వుండగా ఒకరోజు పెద్ద గాలీ వాన ఒకటే ధార.ఊరూ వాడ ఏకమై పోయాయి. చెట్లు పడిపోయాయి, ఇళ్ళు కూలిపోయాయి. భార్యా పిల్లలతో అతడు ప్రవాహములో నడుచుకుంటూ పోతున్నాడు.

🍁 ప్రవాహం వేగంగా వుంది. ఎక్కడా గట్టు దొరకడం లేదు.అప్పుడు భగవంతుడు జ్ఞాపకం వచ్చాడు. 'భగవంతుడా రక్షించు' అని మొర పెట్టుకున్నాడు. భగవంతుడు అతడి మొర విని నేను అడిగిన గ్లాసుడు నీళ్లేవీ? అని అడిగాడు.

🍁 ప్రతిమానవుడు సత్యాన్వేషణ రేపో ఎల్లుండో చేద్దామని కాలం లో చిక్కుకుంటాడు. కాలం లో చిక్కుకొనినివసించడం అలవాటయి పోయింది. కాలం రెండు విధాలు

1.గడియారం సూచించే కాలమానం

 2.మనస్సు కల్పించే మానసిక కాలం.

🍁 నిన్న,ఈ రోజు,రేపు అనేవి మనస్సు నిర్మించిన. నిన్న జరిగిన సంఘటనలు యిప్పుడు లేవు. "నిన్న''గతించినట్లే అవి గతించాయి. కానీ ఆ సంఘటనలు జ్ఞాపకం చేసుకొని యిప్పుడు జరుగుతున్నట్టే భావించి ప్రవర్తించే వాళ్ళు చాలామంది వున్నారు. రేపు యింకా రాలేదు కానీ ఈ రోజున జరిగిన సంఘటనలు రేపు కూడా

జరుగుతాయేమోనని ఊహించుకొని భయపడే వాళ్ళూ చాలా మందే వున్నారు.

🍁 నిజానికి నిన్నా లేదు, రేపూ లేదు, వర్తమానమే ఎప్పుడూ వుండేది. మానసిక కాలమే మిథ్య.

పిడికెడు ఉప్పు

ఒక యువకుడు తన గురువు దగ్గరికెళ్ళి ఇలా చెప్పాడు.

"స్వామీ ! నా జీవితమంతా కష్టాలే.

ఈ జీవితాన్ని భరించలేకపోతున్నాను.

దయచేసి నా కష్టాలు తీరే మార్గo చెప్పండి."

అప్పుడు గురువు ఆ యువకుడి వైపు చూశాడు.

ఒక గ్లాసు నీటిలో ఒక పిడికెడు ఉప్పు వేయమన్నాడు.

యువకుడు అలాగే చేశాడు.

ఇప్పుడు ఆ నీటిని "తాగు" అన్నాడు గురువు.

యువకుడు గ్లాసు పైకెత్తాడు..ఆ నీటిని తాగాడు.

వెంటనే ఉమ్మేశాడు.

"అబ్బ... భరిoచలేని ఉప్పు...."

ఇంకో పిడికెడు ఉప్పు తీసుకుని

ఆ యువకుడిని చెరువు దగ్గరకు తీసుకెళ్లాడు గురువు.

"ఈ ఉప్పు ఈ చెరువులో వేసి ఈ నీళ్ళని తాగు అని చెప్పాడు గురువు.

ఆ యువకుడు చెరువు నీటిని గడగడా తాగేశాడు.

"ఎలా ఉన్నాయి ఈ నీళ్ళు ?" అడిగాడు గురువు.

"నీరు తీయగా ఉంది" చెప్పాడు ఆ యువకుడు.

"అదే పిడికెడు ఉప్పు, అప్పుడెందుకు భరించలేకపోయావు ?

ఇప్పుడెలా భరించావు ? అడిగాడు గురువు.

అప్పడు ఆ యువకుడు ఇలా చెప్పాడు.

అది తక్కువ నీరు.

గ్లాసుడు నీరు.

అందుకే ఉప్పగా ఉంది.

ఇది చెరువు.

అంటే ఎక్కువ నీరు.

అందుకే ఉప్పదనం లేదు." అన్నాడు యువకుడు.

అప్పుడు ఆ గురువు ఇలా చెప్పాడు.

"నాయనా!

సమస్యలు పిడికెడు ఉప్పు లాంటివి.

అది గ్లాసులోనూ పిడికెడే.

చెరువులోనూ పిడికెడే.

కానీ నీ జీవితం గ్లాసులా ఉండాలా.

చెరువులా ఉండాలా అన్నది మాత్రం నువ్వే నిర్ణయించుకోవాలి.

నీ ఆలోచనా శక్తి, సహన శక్తి పరిధి పెరిగితే పిడికెడు ఉప్పు తక్కువవుతుంది.

ఆ పరిధి సంకుచితమైతే పిడికెడు ఉప్పు భరించలేనంత అవుతుంది" అన్నారు గురువు. పరిస్థితి అవగాహన చేసుకొని జీవితాన్ని నందనవనం చేసుకున్నాడా యువకుడు.....

Tuesday, 29 December 2020

ఏకదండి ద్విదండి త్రిదండి

మనం ఎంతో మంది పీఠాధిపతులను లేదా యతీంద్రులను (స్వాములను) చూస్తూ వుంటాం. వారి చేతుల్లో కర్రలు పట్టుకోని వుండటం కూడా చూసివుంటాం. ఆ కర్రలను దండెములు అంటారు. అవి,  వైరాగ్యానికి, తాత్వికతకు, ద్వైత, అద్వైత మరియు విశిష్టాద్వైత భావానికి సంకేతాలు. వారి చేతిలో పొడవాటి కర్రలు ఎల్లవేళలా పట్టుకుంటారు. ఈ (దండాలు) కర్రలు వివిధ ఆకారాలలో ఉంటాయి. ప్రతీదానికి కూడా ఓ అర్థం ఉంది. గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం అనే పంచభూతాల (5) సమ్మేళనమే మనిషి, కాబట్టి సన్యాసులు అయిదు అడుడుగుల కర్రను ధరిస్తారు. 

ఆ యతీంద్రులు తమ చేతి ధరించే, కర్రలలో ఏకదండి (ఒక కర్ర), ద్విదండి (రెండు కర్రలు), త్రిదండి (మూడు కర్రలు) అని మూడు విధాలుగా ఉన్నాయి. దండి అంటే కర్ర అని అర్థం. ఒక కర్రను (ఏకదండి) ధరించే వారు అద్వైత సిద్ధాంతాన్ని నమ్మేవారని అర్థం. అద్వైతం అనగా జీవాత్మ, పరమాత్మ ఒక్కటేననే సిద్ధాంతం. అంతరాత్మకు విరుద్ధంగా అక్రమ, అన్యాయ మార్గాన సంచరించినా, ప్రవర్తించినా ఆ పాపఫలితాన్ని బతికి ఉండగానే ఏదో ఒక రూపంలో ఇక్కడే తప్పకుండా అనుభవించక తప్పదు అనే సిద్ధాంతాన్ని వారు బోధిస్తారు. ఇది  జగద్గురు ఆది శంకరాచార్యుల వారు బోధించినది. ఈ అద్వైత సిద్ధాంతాన్ని అనుసరించే వారి చేతిలో జ్ఞానానికి సంకేతమైన రావిచెట్టు నుండి సేకరించిన ఒక కర్ర ఉంటుంది.

ఇక రెండవ సిద్ధాంతం ద్వైతం. రెండు కర్రలు కలిపి (ద్విదండి) ధరించి బోధనలు చేసేవారు ద్వైత సిద్ధాంతం అనసరించి బోధించేవారు. వీరి ప్రథమాచార్యుడు మధ్వాచార్యులు. వీరిని ‘ద్విదండి స్వాములు’ అంటారు వీరు విష్ణుభక్తులు. వీరు పరమాత్మ వేరు మరియు జీవాత్మ వేరు అని బోధిస్తారు. జీవుడు మిథ్య కాదు. అలాగే జడ జగత్తు కూడా మిథ్య కాదు. ఈశ్వరుడు ఎంత సత్యమో జీవజగత్తులు కూడా అంత సత్యం.

ఇక మూడవది విశిష్టాద్వైతం. మూడు కర్రలను కలిపి (త్రిదండి) భుజాన పెట్టుకునేవారిని తత్వత్రయం అనుసరించే వారు అంటారు. వీరిది భగవద్రామానుజాచార్యుల పరంపర. ఈ సిద్ధాంతం ప్రకారం,

శరీరంలో జీవుడున్నట్లే, జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉంటాడని, జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి సత్యాలని, ఈ మూడింటిని నారాయణ తత్వంగా నమ్ముతూ, జీవుడు ఆజ్ఞానంతో సంసార బంధంలో చిక్కుకుంటాడని, నారాయణుని శరణు వేడిన వారు భగవదనుగ్రహం వలన అజ్ఞానం నుండి విముక్తులై, మరణానంతరం నారాయణ సాన్నిధ్యం (మోక్షం) పొందుతారని, వారికి మరుజన్మ ఉండదని విశిష్ఠాద్వైతపు సిద్ధాంతాన్ని బోధిస్తారు .

 ఈ మూడు కర్రలలో, ఒక్కో దండం ఒక్కోక్క తత్వానికి గుర్తు. ఒకటి జీవుడికి, ఒకటి ప్రకృతికి మరియూ ఒకటి పరమాత్మకి. మనం చూసే ఈ ప్రపంచం అంతా ఈ మూడు తత్వాలతోనే నిండి ఉంటుంది అని వేదం తెలియజేస్తుంది. వేదార్థాన్ని వివరించే పురాణాలు, ఇతిహాసాలు, వాంగ్మయాలు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. తత్వాలు అన్నింటినీ మూడుగా విడదీయవచ్చు. అందులో మనం లెక్కకు అందనంత మంది జీవులు వుంటారు. రెండోది రకరకాల చిత్ర విచిత్ర రూపాలు మార్చుకొనే పంచభూతాత్మకమైన ప్రకృతి. ప్రకృతి అంటే అచేతనమైనది మరియు ప్రకృతికి జ్ఞానం ఉండదు. అందుకే దానిని అచిత్తు అని అంటారు. చేతన రహితమైనప్పటికీ చేతనమైన జీవ సంబంధంచే తన రూపాన్ని మార్చుకుంటుంది. కర్మ సంబంధం చేత సహజమైన జ్ఞానం కలిగి అణుస్వరూపుడైన జీవులు, ఈ ప్రకృతిని శరీరాలుగా దాల్చి ఉంటారు. ఎనభైనాలుగు లక్షల రకాల జీవులు ఈ విశ్వంలో వుంటారని చెబుతారు. ఈ జీవులంతా ప్రకృతిలో సంచరిస్తూ, కర్మ అనుభవాన్ని కష్టమైనదో లేక సుఖమైనదో ఎదో ఒకదాన్ని పొందుతూ ఉంటారు. ప్రకృతిని జీవరాశిని ఈ రెండు తత్వాలని నిరంతరం బయట లోపల వ్యాపించి వాటిని నిలబెట్టి, వాటికి కావల్సిన శక్తిని ఇచ్చి నడిపిస్తూ ఉండే తత్వం పేరే పరమాత్మ. ఈ పరమాత్మ అనే తత్వం మూడోది. ఈ మూడు తత్వాలు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి, విడిచి ఉండటం అనేది లేనే లేదు. పరమాత్మ జీవాత్మ ప్రకృతిలలో వ్యాపించి ఉంటాడు. జీవుడు ప్రకృతిలో నిరంతరం ఉంటాడు. అంటే మరి ముక్తి ఉండదా అని అంటే అట్లాంటి సందేహం అవసరం లేదు. ప్రకృతి అనేక రకాలుగా అనేక గుణాలతో ఉంటుంది. ప్రకృతికి సత్వ, రజస్సు అని మరియు తమస్సు అనే గుణాలు కలిసి వుంటాయి. అందుకే మిశ్రమ తత్వం అని పేరు. రజస్సు, తమస్సు ఏమాత్రం లేని కేవలం సత్వం మాత్రమే ఉండే సుద్ద సత్వ ప్రకృతి విరజా నదికు ఆవల ఉండే ప్రకృతి. ఇవి రెండు కాక గుణములకు అతీతమైన కాలం అనేది ఒక ప్రకృతి. కాలం కూడా ప్రకృతిలో ఒక భాగమే, అందుకే అది సత్వ శూన్యం అని పేరు. ఇలా మూడు రకాలుగా ఉండే ప్రకృతి, ఎన్నో జీవులు, వీటికి వెనకల ఉండి నడిపించే పరమాత్మ ఈ మూడుతత్వాలని విశ్వసించి మనకు మార్గం చూపే యతులు త్రిదండాన్ని ధరించాలని శాస్త్రం యొక్క నిర్ణయం. ఈ మూడు దండాలను కలిపి కట్టి, ధరించిన వ్యక్తిని త్రిదండి అని అంటారు. చక్రం ధరించిన వాడిని చక్రీ అన్నట్టుగానే 'త్రిదండీ' అని సంస్కృతంలో పదం వస్తుంది, అదే తెలుగులో 'త్రిదండి' అని వ్యవహరిస్తాం. శ్రీవైష్ణవ సంప్రదాయంలో యతులు త్రిదండాన్ని ధరించాలని నియమం. వేదం కానీ, ఇతిహాసాలు ఇదే విషయాన్ని ప్రస్తావించాయి. దత్తాత్రేయుడు అనే భగవంతుడు వేదోద్దరణకై ఎత్తిన అవతారం. కర్నాటక రాష్ట్రంలో, మండ్యా దగ్గరలో మేలుకోట క్షేత్ర ప్రాంతంలో ఆయన పాద చిహ్నాలు ఉంటాయి. అక్కడి పుష్కరిణికి దత్తాత్రేయ పుష్కరిణి అని పేరు. భగవంతుడు, అత్రి మహర్షికి అనసూయకు తనను తానే వారి పుత్రునిగా అర్పించుకోవడం చేత దత్తుడు అయ్యాడు. అందుకే ఆయన పేరు దత్తాత్రేయుడు అయ్యింది. వైదిక ధర్మాన్ని లోకానికి నెలకొల్పి ఉన్నాడు, ఆయనకూడా త్రిదండి సన్యాసి అని తెలుస్తున్నది. ఈ నాడు దత్తాత్రేయుడు అని మూడు ముఖములో, చూపించే దత్తాత్రేయుడు వేరే అని తెలుస్తున్నది. మనకు ప్రామాణికమైన గ్రంథాలు తెలిపే దత్తాత్రేయుడు తిదండి సన్యాసి అని తెలుస్తున్నది. అందుకే అవసరం ఏర్పడినప్పుడు తిదండి సన్యాసులు మేలుకోటలో దత్తాత్రేయుని వద్దకి వెళ్ళి తిదండాన్ని పొందే సంప్రదాయం ఉంది.  రామానుజుల వారి చరిత్రలో వారికి కుళోత్తుంగచోళుడి వల్ల ఏర్పడ్డ ఉపద్రవం నుంచి రామానుజుల వారిని తప్పించడానికి, కూరేశులు రామానుజులవారి దండాన్ని మరియు కాశాయాన్ని తాను ధరించి, రామానుజులవారిని పశ్చిమ దేశం వైపు పంపారు. రామానుజులవారు మేలుకోట ప్రాంతం చేరే సరికి వారి వద్ద త్రిదండం, కాశాయం లేదు. తిరిగి వాటిని పొందే అవకాశం లేదు. అందుకే వారు మేలుకోటలోని దత్తాత్రేయుడి వద్ద కొత్త త్రిదండాన్ని, కాశాయాన్ని ఉంచి స్వీకరించినట్లు చరిత్ర చెబుతుంది. 

Monday, 28 December 2020

శ్రీ కృష్ణ సందేశం 5.1 మహాభారతం

ఈ జగత్తులో ప్రతి వ్యక్తికీ ఏదో ఒకవిధమైన బలహీనత తప్పక ఉంటుంది. ఎలాగంటే ఒకడు బాహువేగంతో పరుగెత్తలేకుంటే మరొకడు అధిక భారం మోయలేకపోవచ్చు. ఒకడు చికిత్స లేని రోగంతో బాధపడుతుంటే ఇంకొకడు పఠించిన పాఠాలను జ్ఞాపకం ఉంచుకోలేకపోవచ్చు. 


ఇలాంటి ఉదాహరణలు అనేకానేకం ఉన్నాయి. జీవితం లో సర్వమూ ప్రాప్టించినవాడు ఎవరినైనా మీరు ఎఱుగుదురా ? కానీ మనం జీవితాంతం ఒక్క బలహీనతను జీవితానికి కేంద్రంగా భావిస్తుంటాం. ఈ కారణం వల్లనే హృదయం లో దుఃఖం ఇంకా అసంతృప్తి సదా ఉంటాయి. దౌర్భల్యం అన్నది మనుషుల జన్మతః నో లేక ప్రమాదవశానో ఏర్పడుతుంది. కానీ ఆ దౌర్భల్యాన్ని చాలామంది మనుషులు తమ పరిధిగా భావిస్తారు. 


కానీ కొందరు వ్యక్తులు ఇలా కూడా ఉంటారు. వారు తమ పుషార్థంతోనూ , శ్రమతోను వారి దౌర్భల్యాన్ని పరాజితం చేస్తారు. మరి వారికి, ఇతరులకి ఉన్న బేధమేమిటి..? ఎప్పుడైనా ఆలోచించారా..? 


దీనికి సమాధానం సరళమైనదే. ఏ వ్యక్తి అయితే దౌర్భల్యం వల్ల  పరాజితుడు కాడో , ఎవరైతే పురుషార్థాన్ని నెరవేర్చాలని సాహసం గుండెల్లో నింపుకుంటారో, వారు దౌర్భల్యాన్ని అధిగమించి వెళ్తారు. అంటే దౌర్భల్యం అనేది ఆ ఈశ్వరదత్తమే. కానీ పరిధులని ఏర్పరచుకొనేది మనుషుల మనసే..  :)

Friday, 25 December 2020

చిన్న కుక్క కథ

 ఒక కిరాణా షాపు వాడి దగ్గరకు బుద్దిగా ఒక కుక్క వచ్చింది ..


నోట్లో సంచీ, సంచీ లో  ఒక సరుకుల లిస్ట్, వాటికి సరిపడా డబ్బూ ఉన్నాయి .

ఆశ్చర్య పోయిన షాపు అతను లిస్ట్ ప్రకారం సరుకులు సంచీ లో వేసి  ( బిల్లూ, మిగత చిల్లర తొ సహా ) ఆ కుక్క నోటికి అందించాడు . అది తోక ఊపి తీసుకుని వెళ్ళి పోయింది.


షాప్ అతనికి ఆసక్తి పెరిగి దాన్ని వెంబడించ సాగాడు . ఆ కుక్క దగ్గర్లో బస్ స్టాప్ కెళ్ళి నుంచుని ఒక బస్ రాగానే ఎక్కింది . మన షాపు ఓనరూ ఎక్కాడు . కుక్కేమో కండక్టర్ ని చూసి తోక ఆడిస్తూ తన మెడలోని బెల్ట్ ఊపింది. అందులో అది దిగాల్సిన బస్ స్టాప్, సరిపడా డబ్బూ ఉన్నాయి . కండక్టర్ డబ్బు తీసుకుని టికెట్ మళ్ళీ దాని మెడ బెల్ట్ లో పెట్టాడు . 


ఆ బస్ స్టాప్ వచ్చాక దిగి తన యజమాని ఇంటికి బయలుదేరింది . వెనకే ఆశ్చర్యంతో  షాపు యజమాని కూడా ..

ఇంటికి వెళ్ళి సంచీ కింద పెట్టి కాళ్ళతో ఓ నాలుగైదు సార్లు  తలుపు తట్టింది.


ఇదంతా గమనిస్తున్న షాపు యజమాని కుక్క తెలివి తేట లకు నోటమాట రాక దాని యజమానికి తన అభినందనలు చెప్పడానికి, వీలైతే వాళ్లతో సెల్ఫీ కి కూడా రెడీ అయిపోయాడు.


కుక్క యజమాని తలుపు తీసి ...

....

.....


కుక్కను పాపం కర్రతో చితక బాదేశాడు !!!

..

...

అది చూసిన షాపు ఓనరు " ఏంటండీ ... మీ కుక్క ఎంత తెలివైనది తెలుసా .... ఆలా కొడతారా ..???" అని అడిగాడు ...


అప్పుడు ఆ కుక్క ఓనరు " ఏం తెలివీ ?? నన్ను నిద్ర లేపేబదులు ఇంటి తాళం తీసుకెళ్లచ్చు కదా" అని విసుగ్గా అన్నాడు !!


ఎంత చేసినా, ఏమి చేసినా, ఎవరికోసమైతే చేస్తున్నామో వాళ్ళు సంతృప్తి చెందకపోతే అంతా వృధా నే.

Wednesday, 23 December 2020

నీ దారిలో! బోధివృక్షం* ఒక ఆధ్యాత్మిక కథ

 అది వేసవి కాలం... గయలో బోధివృక్షం కింద సిద్ధార్థుడు తపస్సులో ఉన్నాడు.

తీవ్ర తపోదీక్షలో ఉన్న ఆయనకు మిట్టమధ్యాహ్నం హఠాత్తుగా దప్పికైంది. సమీపంలో ఉన్న కొలను దగ్గరకు వెళ్లాడు. దాహం తీర్చుకుని అందులోనే కాసేపు సేదతీరాడాయన. ఆ కొలనులో అక్కడక్కడా తామర పూలున్నాయి. వాటి అందానికి ముగ్థుడైన సిద్ధార్థుడు ఒక పువ్వును తెంచబోయాడు. వెంటనే ఆకాశవాణి వినిపించింది. ‘సిద్ధార్థా! ఆ పువ్వు ఏం తప్పు చేసింది. కొమ్మనుంచి కమలాన్ని వేరు చేసే హక్కు నీకెక్కడిది?’ అని ప్రశ్నించింది.


ఆయన మారు మాట్లాడకుండా కమలాన్ని నీటిలోనే వదిలేసి పొరపాటుకు చింతిస్తూ కొలనుగట్టున కూర్చున్నాడు.

ఇంతలో ఓ వేటగాడు కొలను దగ్గరకు వచ్చాడు. నీరు తాగి దాహం తీర్చుకున్నాడు. ఆ కొలనులో జలకాలాడాలనుకున్నాడు. అందుకు నీటిలోని ఆ పువ్వులు ఆటంకం అనుకుని వాటిని వేళ్లతో సహా పీకి గట్టుపై వేశాడు. అది దూరం నుంచి చూసిన సిద్ధార్థుడు ‘ఓ ఆకాశవాణీ! నేను పూలను కోయడం తప్పని హితవు పలికావు. మరి ఆ వేటగాడు వాటిని వేళ్లతో సహా పీకేశాడు. సరస్సును చిందరవందర చేశాడు. అతన్ని నువ్వు ఏమీ అనలేదు’ అన్నాడు.

అప్పుడు ఆకాశవాణి తథాగతుడితో ‘నాయనా! పామరులు చేసిన పనులను ఎవరూ పట్టించుకోరు. కానీ తాపసులు, జ్ఞానులకు సమాజంపై బాధ్యత ఉంది. వారు చేసే పనులను పదిమందీ గమనిస్తారు. వారిని అనుసరిస్తారు. అందుకే నువ్వు అనుచితంగా ప్రవర్తించకూడదు. లోక కల్యాణమే జ్ఞానుల లక్ష్యంగా ప్రవర్తించాలి’ అని పలికింది.

దీంతో సిద్ధార్థుడు మౌనంగా బోధి వృక్షంవైపు నడిచాడు.

విలువలతో కూడిన కథ

 వెంకట్ ఒక గవర్నమెంట్ బ్యాంకులో పనిచేస్తున్నాడు...

రోజూ బైక్ లో ఆఫీసుకి వెళ్లడం, సాయంత్రం ఆఫీసు నుంచి నేరుగా ఇంటికి రావడం...

సిటీకి కొత్తగా రావడం వలన

ఆప్యాయంగా పలకరించే వారు ఎవరూ లేరు తనకు, డ్యూటీ తరువాత తన భార్యతో కలిసి కాసేపు అలా అలా తిరిగి రావడం అంతే...

హడావుడిగా పరుగులు తీసే జనాలు

ఎవరి అవసరం వారిది, ఎవరి పనులు వారివి. ఒక్కరికీ ఆగి ఆప్యాయంగా పలకరించే సమయం లేదు.

సిటీ కదా... ఇంతేనేమో అనుకుంటూ రొటీన్ గా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు.

రోజులను బిజీగా గడిపేస్తున్నాడే గానీ, జీవితంలో ఏదో తెలియని వెలితి.

బహుశా ఆ వెలితి అందరిలోనూ ఉందనుకుంటా, కానీ పైకి కనబడకుండా లేని పనిని కల్పించుకుని బిజీగా ఉన్నట్టు నటిస్తూ

వాస్తవానికి దూరంగా పారిపోతున్నట్టున్నారు...


ఒకరోజు సాయంత్రం డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తూ, యధాలాపంగా రోడ్డు పక్కన కూర్చున్న ఒక ముసలావిడను చూసాడు. ముందు చిన్న బుట్ట పెట్టుకుని ఏదో అమ్ముతోంది. దగ్గరకు వెళ్ళి చూసాడు...

బుట్టలో సపోటా పండ్లు పెట్టి అమ్ముతోంది. బాగా వయసు మళ్ళిన వృద్ధురాలు, ఈ వయసులో కూడా ఎంత కష్టపడుతోంది అనిపించింది వెంకట్ కి. కానీ ఒక్కరూ ఆవిడ దగ్గర ఆగి పండ్లను కొనడం లేదు, అసలు అక్కడ ఒక మనిషి కూర్చుని ఉందన్న విషయం కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. చాలా బాధ కలిగింది తనకు,బండి ఒక ప్రక్కగా ఆపి ఆమె దగ్గరకు వెళ్ళాడు.

"ఎలా అమ్మా సపోటాలు, కిలో ఎలా ఇస్తున్నావ్" అనడిగాడు.

ఆమె రేటు చెప్పింది...

సరే ఒక కిలో ఇవ్వు అన్నాడు.

ఆమె ఒక కిలో తూచి సంచిలో వేసి ఇచ్చింది.

సంచిలోనుంచి ఒక పండు తీసి తిని, "ఏంటమ్మా అస్సలు తియ్యగా లేవు పండ్లు" అంటూ ఇంకో పండు సంచిలోనుంచి తీసి ఆమెకిచ్చాడు. ఆమె ఆ పండు తిని" అదేంటి నాయనా... పండు తియ్యగానే ఉంది కదా" అంది.

సరేలే అంటూ డబ్బులిచ్చి ఇంటికి బయలుదేరాడు.

ఆరోజు మొదలు ప్రతీరోజూ

ఆమె దగ్గర ఆగడం, ఒక కిలో సపోటాలు కొనడం, సంచిలోనుంచి ఒక పండు తీసుకుని తిని రుచిగా లేదు అని చెప్పడం, కావాలంటే నువ్వే చూడు అని ఆమెకు ఒక పండు ఇవ్వడం, ఆమె తిని బావుంది కదా అంటే డబ్బులు ఇచ్చి ఇంటికి వెళ్లడం - దినచర్య అయిపోయింది వెంకట్ కి.

ఒకరోజు తన భార్యతో కలిసి వెళుతూ ఆగాడు ఆమె దగ్గర...

ఎప్పటిలానే కిలో పండ్లు తీసుకున్నాడు. సంచిలోనుంచి ఒక పండు తీసుకుని తిని, పండ్లు తియ్యగా లేవని చెప్పి తన సంచిలోనుంచి ఒక పండు తీసి ఆమెకిచ్చాడు. ఆమె పండు తిని తియ్యగానే ఉన్నాయి కదా నాయనా అని చెప్పగానే డబ్బులిచ్చి బయలుదేరాడు. ఇదంతా చూసిన వెంకట్ భార్యకు కోపం వచ్చింది.

ఇంటికి వెళ్లాక

"రోజూ నువ్వు తీసుకుని వచ్చే పండ్లు చాలా తియ్యగా ఉంటాయి, ఎందుకని ఆవిడకు అబద్ధం చెప్పి బాధపెట్టావ్... పాపం కదా అసలే పెద్దావిడ" అనడిగింది.

వెంకట్ చిరునవ్వు నవ్వి

"ఆమె దగ్గర పండ్లు తియ్యగానే ఉంటాయని నాకూ తెలుసు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆవిడ ఆ పండ్లన్నింటినీ అమ్మడానికి కూర్చుంటుందే కానీ, ఒక్క పండు కూడా ఆమె తినదు. అలా అని నేను కొన్న పండ్లు ఆమెకు తినడానికి ఇస్తే ఆమె తీసుకోకపోవచ్చు. అందుకే అలా అబద్ధం చెప్పి, రోజూ ఆమె తినడానికి ఒక పండు ఇస్తున్నా"అని అసలు విషయం చెప్పాడు...


వెంకట్ తన భార్యతో కలిసి వెళ్లిపోగానే

వృద్ధురాలికి కొంచెం దూరంలో కూరగాయలు అమ్మే ఒకామె వృద్ధురాలి దగ్గరకు వచ్చి

" రోజూ చూస్తున్నాను... ఆ అబ్బాయి వస్తాడు, పండ్లు కొంటాడు. బాగాలేదని మొహం మీదే చెబుతాడు. అయినా కూడా రోజూ నువ్వు ఒక పండు ఎక్కువ తూయడం నేను చూస్తూనే ఉన్నా. అటువంటి వాడికి రోజూ ఒక పండు ఎందుకు ఎక్కువిస్తున్నావ్" అని అడిగింది.

వృద్ధురాలు చిన్నగా నవ్వి చెప్పింది

"పిచ్చిదానా... నేను తీసుకొచ్చే పండ్లన్నీ తియ్యగానే ఉంటాయని నాకు తెలుసు, అయినా తియ్యగా లేవని అబద్ధం చెప్పి కావాలనే రోజూ ఒక పండు నాచేత తినిపిస్తున్నాడు. ఆ అబ్బాయి చూపిస్తున్న ప్రేమకు ఆప్యాయతకు తెలియకుండానే ఒక పండు దానంతటదే ఎక్కువ తూగుతోంది" అని.


నిజంగా ఇలాంటి చిన్న చిన్న విషయాలలో ఎంతో ఆనందం దాగుంటుంది కదా. అన్ని ఆనందాలనూ డబ్బుతో కొనలేం, ఎదుటివారి పట్ల ప్రేమ ఆప్యాయతలే జీవితంలో నిజమైన తియ్యదనాన్ని నింపగలవు. మనిషికి ఉండవలసిన ఉదార స్వభావం కనుమరుగైపోతోంది. ఇవ్వడంలో ఉన్న ఆనందం, తీసుకోవడంలో దొరకదు.

ఆనందం పంచితే పెరుగుతుందే గానీ తగ్గదు.


అన్నీ ఉన్నా కూడా

ఈరోజుల్లో ఆప్యాయంగా పలకరించే వారు లేకుండా పోతున్నారు. ఆప్యాయంగా పలకరించడానికి ఎదుటివారితో మనకు బంధుత్వమే ఉండనవసరం లేదు, అందరూ ఆప్తులే అని చెప్పడం కోసమే ఈ చిన్న కధ...

మూడు ప్రశ్నలు

 ఓ దేశాన్ని పాలించే రాజు మనస్సులో మూడు ప్రశ్నలు ఉదయించాయి. ఆ ప్రశ్నలకు ఎన్నోమార్లు జవాబులు యోచించినా సరైన సమాధానం దొరకలేదు. తన ఆస్థానంలో ఓ రోజు సమావేశమై పండితులను, శాస్తక్రారులను, మేధావులను ఆహ్వానించాడు. తాను మూడు ప్రశ్నలు వేస్తానని, వాటికి జవాబులు చెప్పడానికి ముందుకువచ్చి సరైన సమాధానం చెప్పినవారికి గొప్ప బహుమతి లభిస్తుందని చెప్పాడు. 

లేదంటే వారు ముందుకు వచ్చి సరైన సమాధానం చెప్పకపోతే కారాగారం పాలు చేస్తానని చెప్పారు. దాంతో భయపడి ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయం దేశమంతా చాటింపబడింది. ఓ కుగ్రామంలోనుండి పశువుల కాపరి ఒకాయన ముందుకు వచ్చాడు. 

రాజాస్థానం చేరుకొన్నాడు. రాజు సభలో ఎందరో మేధావులు శాస్త్ర పండితులు కూర్చొన్నారు. పశువుల కాపరి మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు రాజుకో విషయం నిర్దేశం చేసాడు. ‘‘చెప్పేవాడు గురువు; వినేవాడు శిష్యుడు. గురువు పైన ఉండాలి, శిష్యుడు క్రింద ఉండాలి’’. కాబట్టి మహారాజా! మీరు సింహాసనం దిగండి అన్నాడు. రాజు సింహాసనం నుండి క్రిందికి దిగాడు. పశువుల కాపరి సింహాసనం అధిష్ఠించి, ‘‘మహారాజా ఇప్పుడు అడగండి మూడు ప్రశ్నలు’’ అన్నాడు.

మొదటి ప్రశ్న 

దేవుడు ఎక్కడ చూస్తున్నాడు? 

దీనికి జవాబు చెప్పండి అన్నాడు రాజు. వెంటనే ఒక దీపాన్ని తెప్పించమన్నాడు గురువు స్థానంలో వున్న పశువుల కాపరి. దీపం తెచ్చి సభ మధ్యలో పెట్టాడు. మహారాజా! ఈ దీపం ఎక్కడ చూస్తుంది? నావైపా? నీవైపా? తూర్పువైపా? పశ్చిమానికా? పైనకా? క్రిందకా? ఎక్కడ చూస్తుందో చెప్పండి? అని ప్రశ్నించాడు. ‘‘అన్నివైపులకు చూస్తుంది’’ అని జవాబిచ్చాడు రాజు. ఇంత చిన్న జ్యోతి అన్నివైపులా చూడగలిగినపుడు పరంజ్యోతి స్వరూపమైన భగవంతుడు అన్నివైపులా చూడలేడా? సమస్త జీవుల కళ్ళల్లో వెలుగుగా వున్న పరంజ్యోతి పరమాత్మనే. 

ఇక రెండవ ప్రశ్న 

దేవుడు ఎక్కడ ఉంటాడు? 

అన్నాడు రాజు. ‘‘సరే! ఓ చిన్న పాత్రలో పాలు తెప్పించండి’’ అన్నాడు పశువుల కాపరి. పాలు తెచ్చారు. ‘‘మహారాజా! ఈ పాలల్లో నెయ్యి ఎక్కడ ఉందో చెప్పగలవా?’’ అని అడిగాడు. ‘పాలను బాగా మరుగబెట్టాలి. వాటిని తోడు (మజ్జిగ) కలిపి కొన్ని గంటలు కదలకుండా ఉంచాలి. పెరుగు సిద్ధం అవుతుంది. దాన్ని కవ్వంతో చిలికితే వెన్న వస్తుంది. తర్వాత తయారైన వెన్నను కాస్తే నెయ్యి తయారవుతుంది’’ అన్నాడు రాజు.

‘సరిగ్గా చెప్పారు మహారాజా! అలాగే హృదయం అనే పాలను గురువు అనే నిప్పులపై బాగా మరిగించి, మనస్సు అనే తోడు వేసి, స్థిరంగా ఉంచితే వచ్చే సత్యం అనే పెరుగును సాధన అనే కవ్వంతో చిలికితే జ్ఞానం అనే వెన్న వస్తుంది. ఆ సాధన ‘అంతర్ముఖం’ అనే నిప్పులపై బాగా కాచినట్లయితే పరమాత్మ అనే నెయ్యి వస్తుంది’’ అన్నాడు కాపరి. సభలో హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. 

చివరి ప్రశ్న 

దేవుడు ఏం చేస్తాడు? అని. ‘

నేను పశువుల కాపరిని, మీరు మహారాజు. క్రింద వున్న నన్ను సింహాసనంపైన కూర్చోబెట్టారు. పైన వున్న మిమ్మల్ని క్రిందికి దించేశారు. ఇదే పరమాత్మ లీల. సత్కర్మలు చేసే జీవులను పై జన్మల్లో ఉత్తమ జన్మగా మార్చడం, దుష్కర్మలు చేసే వాళ్ళను మరుజన్మలో క్రింది స్థాయికి పంచడమే పరమాత్మ పని’ అన్నాడు. సభలో గంభీర వాతావరణం నెలకొంది. రాజు పశువుల కాపరి ముందు పాదాక్రాంతుడయ్యాడు

ఒక తండ్రి తన పిల్లలకు రాసిన ఒక లేఖ....

 నేను ఈ లేఖ రాయడానికి మూడు కారణాలున్నాయి.


1. జీవితం లో అదృష్టం, దురదృష్టం అనేవి చాలా చంచలమైనవి. ఎవరూ వీటిని ఖచ్చితంగా అంచనా వేయలేరు.

2. నీ తండ్రిగా నేను నీకు ఇవి చెప్పకపోతే, ఇంకెవ్వరూ నీకు చెప్పరు.

3.నీకు ఇవి తెలిస్తే బహుశా జీవితంలో చాలా సమయాలలో నీ గుండె గాయపడకుండా ఉంటుంది.

ఈ క్రింద విషయాలు జాగ్రత్తగా గుర్తుంచుకో....

1. నీతో సఖ్యంగా లేని వారి పట్ల ద్వేషం పెంచుకోకు.

నేను, మీ అమ్మ తప్ప నీకు తప్పనిసరిగా మంచే చేయాలన్న బాధ్యత ఎవరికీ లేదని బాగా గుర్తెరిగి మసలుకో.

నీతో మంచిగా ఉన్నవారిపట్ల కృతజ్ఞుడివై వుండు.

అలాగే జాగ్రత్తగా గమనించు కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చేసే ప్రతి పనికీ ఒక ఉద్దేశం ఉంటుంది.

నీతో ఎవరైనా స్నేహంగా ఉంటే ఎప్పటికీ అలానే ఉండాలని లేదు, జాగ్రత్త, గుడ్డిగా వారిని ఆత్మీయులుగా నమ్మి మనసు గాయపరచుకునేవు సుమా!

2. ఏ ఒక్కరూ తప్పనిసరి కాదు మరియు తప్పక కలిగి ఉండితీరవలసినది ఏదీ లేదని మరచిపోకు.

ఇది నీవు సరిగా అర్థం చేసుకున్న రోజు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను వద్దనుకున్నా,

నువ్వు బాగా కోరుకున్నది నీకు దూరమైనా నీ మనసు పెద్దగా గాయపడదు.

3. జీవితం చిన్నది.

ఒక్క రోజు వ్యర్థమైనా చక్కగా అనుభవిం చాల్సిన,

మళ్ళీ తిరిగిరాని ఒక రోజుని కోల్పోయావన్న విషయం గుర్తించు.

4. ప్రేమ అనేది ఒక నిలకడలేని, చంచలమైన ఒక భావన.

కాలాన్ని, మూడ్ ని బట్టి వెలసిపోయే ఒక ఎమోషన్.

నువ్వు బాగా ప్రేమించానను కున్నవారు దూరమైనపుడు కుంగిపోకు, ఓపిక పట్టు. కాలం నీ గాయాలను, బాదలను అన్నింటినీ కడిగేస్తుంది.

ప్రేమ యొక్క సౌందర్యాన్ని ,

అలాగే ప్రేమ విఫలమవడాన్ని అతిగా ఊహించుకోకు.

ఇవి ఏమంత పెద్ద విషయాలు కావని కాలం గడిచే కొద్దీ తెలుసుకుంటావని తెలుసుకో.

5. చాలామంది పెద్దగా చదువుకోకుండానే జీవితంలో బాగా పెద్ద స్థాయికి వెళ్లుండచ్చు,

కానీ దానర్థం నువ్వు కష్టపడి చదవకుండానే గొప్పవాడయిపోతావని కాదు.

నువ్వు సంపాదించే జ్ఞానమంతా నీ ఆయుధాలని గ్రహించు.

దీవాళా తీసిన స్థితి నుండి తిరిగి ఉన్నతమైన స్థానం చేరడం సాద్యమే,

కానీ దీవాళా తీసినప్పటి పరిస్థితి దారుణంగా ఉంటుందని మరచిపోకు.

6. నేను వృద్ధాప్యంలో ఆర్థికంగా నీమీద ఆధారపడను, అలాగే జీవితాంతం ఆర్థికంగా నీకు ఆసరా ఇవ్వలేను. నువ్వు పెద్దవాడవుతూనే నా బాధ్యత తీరిపోతుంది. తర్వాత బస్సులో తిరుగుతావా నీ సొంత లగ్జరీ కారులోనా? రిచ్ గానా మామూలు జీవితమా? అన్నది నీవే నిర్ణయించుకో.

7. నువ్వు నీ మాట నిలబెట్టుకో. ఇతరులనుంచి ఏది ఆశించకు.

నువ్వు అందరితో మంచిగా ఉండు,

అందరూ నీతో మంచిగా ఉంటారని అనుకోకు.

ఇది నువ్వు సరిగా అర్ధం చేసుకోకపోతే నీకు అనవసర సమస్యలు తప్పవు.

8. లెక్కలేనన్ని లాటరీ టికెట్లు చాలా కాలం కొన్నా, ఒక్క చెప్పుకోదగ్గ పెద్ద ప్రైజ్ కూడా ఎప్పుడూ రాలేదు. కష్టపడితేనే ధనవంతులవుతాము అన్నదానికి ఉదాహరణమిదే. విజయానికి షార్ట్ కట్ లేదని బలంగా నమ్ము.

9. అది ఎంత తక్కువ/ ఎక్కువ కాలమైనా సరే, మనం కలసివున్న కాలాన్ని జాగ్రత్తగా దాచుకుందాం. వచ్చే జన్మలో మళ్లీ కలుస్తామో లేదో మనకు తెలియదు కదా కన్నా!

మనం నేర్చుకోవలసింది

 ఒక ఊరిలో ఒక తెలివైన వ్యక్తి ఉన్నాడు. అతనికి దేవుడిపై భక్తి ఎక్కువ, ఎప్పుడు గుడికి వెళ్తూ ఉండేవాడు  దేవుడికినమస్కారం 

చేసుకోని అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని అమ్ముకొని వచ్చిన డబ్బులతో ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్నాడు . ఒక రోజు ఎప్పటిలాగానే అడవికి వెళ్తూ దారిలో ఒక నక్కని చూసాడు. ఆ నక్కకి రెండు కాళ్ళు లేవు. ఏదో ప్రమాదంలో దాని రెండు కాళ్ళు పోయినాయి అనుకుంటున్నాడు . నక్క దాని దారిన అది వెళ్ళి ఒక చెట్టు క్రింద కూర్చుంది.  దానిని చూసి అతనికి ఒక సందేహం వచ్చింది. ఈ నక్కకు రెండు కాళ్ళు లేవు అది ఎలా వేటకు వెళ్ళి దాని ఆహారాన్నిసంపాదించు

కుంటుందిఅనిఆలోచిస్తున్నాడు. 

అలా ఆలోచిస్తున్న సమయంలో అక్కడికి ఒక పులి వచ్చింది. ఆ పులిని చూసి అతను ఒక చెట్టు వెనక్కి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో గమనిస్తూ ఉన్నాడు.

ఆ పులి ఏమి చేస్తుంది అంటే ఒక పెద్ద జింకని వేటాడి అక్కడికి ఇడ్చుకొని వచ్చి తినింది. ఆ పులి తిన్న తరువాత మిగిలినది అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయింది . పులి వెళ్లిపోయిన తరువాత ఆ కాళ్ళు లేని నక్క అక్కడికి వెళ్ళి మిగిలిన ఆహారాన్ని కడుపు నిండా తినింది.

 ఇది అంతా గమనిస్తూ ఉన్న అతనికి ఇలా అనిపించింది, రెండు కాళ్ళు లేని ఈ నక్కకు ఆ దేవుడు ఆహారాన్ని ఇస్తున్నప్పుడు రోజు దేవుడికి పూజలు చేసే నేను ఎందుకు ఇంత ఎండలో, వర్షంలో కష్టపడి చెమటోర్చి కట్టెలు కోట్టాలి అని ఆలోచించాడు.  ఆ సంఘటన తర్వాత అడవికి వెళ్ళటం మానేశాడు, గొడ్డలి పడేశాడు ఏమి మాట్లాడకుండా ఒక ప్రక్కన కూర్చున్నాడు అప్పుడప్పుడు గుడికి వెళ్లి వస్తున్నాడు. ఆ దేవుడే నన్ను కాపాడతాడు, నాకు భోజనం పెడతాడు అని నమ్ముకొని దేవుడి గుడి మండపంలో ఒక స్తంభాన్ని ఆనుకొని కూర్చున్నాడు. రోజులు గడుస్తున్నాయి, భోజనం దొరికే సూచనలు కనిపించలేదు. అతను ఆకలితో బాగా నిరసించిపోయి  ఎండిపోయిన ఆకులాగా, ఎలుగుబంటి తోలు వలే మారిపోయాడు.

ఒక రోజు రాత్రి గుడిలో ఎవ్వరు లేని సమయంలో కళ్ళు తెరిచి దేవుడా! నా భక్తి మీద నీకు నమ్మకం లేదా నేను ఇలా ఆకలితో మాడి చనిపోవాల్సిందేనా !

అడవిలో ఉన్న నక్కకి పులి ద్వారా ఆహారం పంపించావు కానీ నన్ను ఇలా వదిలేశావు నీకు ఇది న్యాయమా! అని అడిగాడు.

 దేవుడు మెల్లగా కళ్ళు తెరిచి ఇలా చెప్పాడు. వెదవా! నువ్వు నేర్చుకోవాల్సింది నక్క దగ్గర కాదు పులి దగ్గర, పులి లాగా నువ్వు కష్టపడి కావల్సినది తిని మిగిలినది ఇతరులకు ఇవ్వాలి అని అన్నాడు. చదివిన దానిలో నచ్చినది మనం ఎవ్వరి దగ్గర నుంచి ఏమి నేర్చుకోవాలి అనేది మనమే నిర్ణయం తీసుకోవాలి.

మహాభారతంలోని ఒక చిన్నకథ

 పంచ పాండవులలో ఒకరైన సహదేవుడు ఒకరోజు గుర్రాలు సంతలోకి వెళ్లారు. ఆ సంతలో అతను ఒక అందమైన గుర్రాన్ని చూసారు. అరెరె ఇంత అందమైన గుర్రాన్ని నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. ఎలాగైన సరే నేను ఈ గుర్రాన్ని ఎంత దరకైన కొనాలి ఆనుకొని గుర్రం యజమాని గారిని గుర్రం ధర ఎంత అని అడిగారు.


గుర్రాన్ని నేను ఎవరకూ అమ్మను కానీ ఎవరైతే నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెపుతారో వారికి నా గుర్రాన్ని ఉచితంగా ఇస్తాను అని చెప్పారు. సహదేవుడు సరే నన్ను అడుగు ఎటువంటి ప్రశ్నలకైన నేను సమాధానం చెపుతాను అని చెప్పారు.


దానికి గుర్రం యొక్క యజమాని, సరే నేను అడిగే ప్రశ్నలు చాలా జాగ్రత్తగా విని సమాధానాలు చెప్పి గుర్రాన్ని ఉచితంగా తీసుకుని వెళ్లు అని ప్రశ్నలు అడుగుట మెదలుపెట్టారు.


మెదటి ప్రశ్న:


ఒక పెద్ద బావి ఉంది. ఆ పెద్ద బావి లోని నీరు ని తీసుకుని వెళ్లి ఏడు చిన్న బావులను పెద్ద బావి లోని నీటితో నింపవచ్చు కానీ ఆ ఏడు చిన్న బావులలోని నీటితో పెద్ద బావిని నింపలేము ఎందుకు అని అడిగారు. మరల గుర్రం యొక్క యజమాని, బాగా ఆలోచించి నాకు సమాధానం చెప్పండి అని అడిగారు.


సహదేవుడు కొంచెం సమయం దాకా బాగా ఆలోచించిన కూడా సమాధానం చెప్పలేకపోయారు. చేసేది ఏమి లేక అక్కడే ఉండి పోయాడు. కొంచెం సమయం తరువాత నకులుడు సహదేవుడు ను వెతుక్కుంటూ వెతుక్కుంటూ సహదేవుడు ఉన్న గుర్రాలు సంతకు చేరుకున్నారు.


సహదేవుడు ని చూసిన నకులుడు ఎందుకు ఇక్కడ కూర్చుని పోయునావు అని అడిగారు. దానికి సహదేవుడు ఆ గుర్రం మరియు గుర్రం యొక్క యజమాని గురించి నకులుడు కి వివరంగా చెప్పారు. ఆ గుర్రమును చూసిన నకులుడు ఆశ్చర్యపోతూ , సహదేవ నీవు చెప్పినట్లు ఈ గుర్రం ఎంత అందంగా ఉంది. ఎలగైన సరే దీనిని మనం మన రాజ్యానికి తీసుకుని వెళ్లాలి అని గుర్రం యొక్క యజమానిని నకులుడు కలిసి నన్ను అడుగు ఎటువంటిప్రశ్నలయున నేను నీకు సమాధానం చెప్పి ఆ గుర్రాన్ని మా అన్నయ్య సహదేవుడు కి బహుమతి గా ఇస్తాను అని చెప్పారు.


గుర్రం యొక్క యజమాని సరే నీవైన జాగ్రత్త గా ఆలోచించి ఆలోచించి సమాధానం చెప్పు అని రెండోవ ప్రశ్నను అడిగారు.


రెండోవ ప్రశ్న


మనము బట్టలు కుట్టటం కోసం ఉపయోగించే సూది రంధ్రం ద్వారా పెద్ద ఏనుగు ఇవతలి వైపు నుండి రంధ్రం ద్వారా అవతలి వైపుకు వెళ్లింది కానీ ఆ ఏనుగు తోక మాత్రం ఆ సూది రంధ్రంద్వారా వెళ్ల లేకపోయింది . అది ఏమిటి అని అడిగారు.


ఈ ప్రశ్నకు నకులుడు సమాధానం చెప్పలేకపోయారు. చేసేదేమీ లేక సహదేవుడు మరియు నకులుడు ఆ సంతలో ఉండి పోయారు. ఎంతసేపటికి తమ్ముళ్ళిద్దరూ రాజ్యానికి రాక పోయే సరికి కంగారుగా ధర్మరాజు భీముడు ను పిలిచి తమ్ముళ్ళిద్దరు ను వెతుక్కుని ఎక్కడఉన్న రాజ్యానికి తొందరగా తీసుకుని రావాలి అని చెప్పారు.


అన్నగారు మాటలు ప్రకారం భీముడు తమ్ముళ్ళిద్దరను వెతుక్కుంటూ వెళ్ళాడు.


చివరికి తమ్ముళ్ళిద్దరను ఒక సంతలో చూసి తమ్ముళ్ళిద్దరను ఎందుకు ఇక్కడ కూర్చుని ఉన్నారు అని అడిగారు. అన్నయ్య ధర్మరాజు గారు చాలా కంగారు పడుతున్నారు. వెంటనే రాజ్యానికి బయలుదేరి వెళ్లదాము అనగానే తమ్ముళ్ళిద్దరను అక్కడ వారు ఎందుకు ఉన్నారో వివరంగా చెప్పారు.


అంతా వినిన భీముడు గుర్రం యొక్క యజమాని గారిని కలిసి నేను మీ ప్రశ్నలకు సమాధానాలు చెపుతాను అన్నారు. గుర్రం యొక్క యజమాని చూడండి నేను వేసిన రెండు ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నీ

తమ్ముళ్ళిద్దరు ఓడిపోయారు. కావున నీవు బాగా ఆలోచించి ఆలోచించి సమాధానం చెప్పాలని అన్నారు. దానికి సరే అన్నారు భీముడు.


మూడవ ప్రశ్న


ఒక పొలంలో ధాన్యం బాగా పండింది. ఆ పొలం చుట్టూ పెద్ద పెద్ద గట్టులు ఉన్నాయి. ఆ ధాన్యం పంట కోసే సమయంలో ధాన్యం మాయమైంది. అది ఎలా అని అడిగారు. భీముడు కూడా సమాధానం చెప్పలేకపోయారు. తమ్ముళ్ళిద్దరను రాజ్యానికి తీసుకుని వెళ్లి జరిగింది జరిగినట్లు అన్ని అన్న ధర్మరాజు గారు కి వివరంగా చెప్పారు.


అన్న ధర్మరాజు గారు ఆ ప్రశ్నలన్నీ వినిన తరువాత చెమటలు పట్టి భయపడ్డారు. అన్నయ్య ధర్మరాజు గారు లో భయాన్ని చూసిన తమ్ముళ్ళందరూ ఏమిటి అన్నయ్య మీరు సమాధానాలు చెప్పలేక భయపడుతున్నారా అనగానే అన్నయ్య ధర్మరాజు గారు నేను బయటపడుతుంది సమాధానాలు చెప్పలేక కాదు. మిమ్మల్ని ఆ ప్రశ్నలన్నీ అడిగింది కలిపురుషుడు. అతను కలికాలం లో జరిగే యధార్థ సంఘటనలను ప్రశ్నల రూపంలో మిమ్మల్ని అడిగారు.


మెదటి ప్రశ్నకు సమాధానం. పెద్ద బావి అనేది తల్లి తండ్రులు. ఏడు చిన్న బావులనేవి వారి పిల్లలు. తల్లి తండ్రులు ఎంత మంది పిల్లల కైనా ప్రేమ ఆప్యాయతలతో పెంచి పోషిస్తారు.

కానీ అదే తల్లి తండ్రులు వృద్ధులు అయినా తరువాత ఆ ఏడుగురు పిల్లలు తల్లి తండ్రులను భారంగా చూస్తారు.


రెండో వ ప్రశ్నకి సమాధానం. ఏనుగు అంటే పెద్ద పెద్ద అవినీతి పరులు. ఏనుగు తోక అంటే చిన్న చిన్న దొంగతనాలు చేసేవారు.

ఏనుగు రంధ్రం ద్వారా అవతలి వైపుకు వెళ్లిపోతుంది అంటే పెద్ద పెద్ద అవినీతి పరులు చట్టానికి దొరక్కుండా రంధ్రం ద్వారా వెళ్లిపోతారు. కానీ చిన్న చిన్న దొంగతనాలు చేసేవారు ఆ రంధ్రం దాటలేక ఆ ఏనుగు తోక లాగా ఇరుక్కు పోతారు.

మూడవ ప్రశ్నకు సమాధానం. ఇక్కడ ధాన్యం అంటే ప్రజలు. చుట్టూ ఉన్న పెద్ద పెద్ద గట్టులు అంటే అధికారులు. ఎంతమంది అధికారులు ఉన్న ప్రజలకు దక్కాల్సిన ఫలాలు అధికారులు స్వాహా చేస్తారు. ఆ విధంగా ధాన్యం మాయమైనట్లు ప్రజల ఫలాలు కూడా అధికారులు మాయం చేస్తారు. ఇవన్నీ భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు మీకు కలిపురుషుడు ముందుగా తెలియ చేసారు అని ధర్మరాజు గారు తమ్ముళ్ళందరకూ వివరంగా చెప్పారు.

పరోపకారం

 అనగనగా ఓ శివాలయం ఉండేది. దాని పూజారి శంకరశాస్త్రి, గొప్ప పుణ్యాత్ముడు. "ఆయన అభిషేకం చేసి ఇచ్చే తీర్థం త్రాగితే అనేక రోగాలు నయమవుతాయి" అని చెప్పుకునేవాళ్ళు జనం. ప్రతిరోజూ ఆయన చేతిమీదుగా తీర్థం, విభూతి స్వీకరించటం కోసం చుట్టు ప్రక్కల అనేక గ్రామాల్లోంచి భక్తులు వస్తూండేవాళ్ళు. ఒకసారి ఆయనకు శివుడు కలలో కనిపించాడు. "స్వామీ, ఏ రోజుకారోజు నీ రాక కోసం ఎదురు చూడటం తప్పిస్తే, మరింకేవీ నాకు తృప్తినివ్వటం లేదు. నన్ను నీతో తీసుకొని పోరాదా?" అని అడిగాడు శంకరశాస్త్రి, ఆయనకు నమస్కరిస్తూ.


శివుడు నవ్వి, "దానికోసం నువ్వు మరింత కృషి చేయవలసి ఉన్నది" అంటూ తన చేతిలో ఉన్న మట్టిపాత్రను అతని చేతిలో పెట్టాడు. "ఇదిగో, ఈ మట్టి పాత్రను చూసావు కదా! ఇది ఎవరి చేతిలో ఉన్నప్పుడు బంగారం లాగా మెరుస్తుందో, అట్లాంటి వాళ్ళు అత్యంత పుణ్యవంతులన్నమాట. వాళ్ళు చేస్తున్నవి పవిత్ర కర్మలు. ఆ కర్మల కారణంగానే వారికి అనంత దీర్ఘాయుష్షు, ఆ తర్వాత నా సాన్నిధ్యం లభించనున్నాయి" అని చెప్పేసి, మాయమైపోయాడు శివుడు.


మొదట 'ఇదేదో అద్భుతమైన కల' అనుకున్నాడు గానీ; ఆ తర్వాత ఆలయానికి వెళ్ళి చూసేసరికి నిజంగానే అక్కడ ఓ మట్టిపాత్ర కనిపించింది శంకరశాస్త్రికి. ఆయన చాలా భక్తిగా ఆ మట్టిపాత్రను తాకి చూసాడు: అది రంగు మారలేదు! అయితే స్వతహాగా మంచివాడైన శంకరశాస్త్రి అందుకు బాధపడలేదు. "నేను ఇంకా పుణ్యం‌ సాధించాలి అని తెలియజేసేందుకుగాను భగవంతుడు ఇచ్చిన కానుక ఇది! ఇప్పుడిక దీన్ని కొలమానంగా వాడి, ఆలయానికి వచ్చేవాళ్ళలో అసలైన పుణ్యాత్ములెవరో గుర్తిస్తాను. వాళ్ళ అడుగుజాడల్లో నడచి, నేనూ పవిత్రుడినౌతాను" అనుకున్నాడు.


ఆ రోజునుండీ గుడికి వచ్చే భక్తులందరిచేతా ఆ మట్టి పాత్రను తాకించేవాడు ఆయన. చుట్టుపక్కల గ్రామాల్లో అన్నదానాలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు చేసి పేరెన్నిక గన్న భక్తులు ఎందరో వచ్చి మట్టిపాత్రను తాకారు. ఎంతమంది తాకినా అది మట్టి పాత్రగానే ఉండింది తప్ప, రంగు ఏ కొంచెం కూడా తిరగలేదు. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకసారి, మహా శివరాత్రి సందర్భంగా గుడిలో వేడుకలు జరుగుతున్న సమయంలో, ఎవరో ఒక బాటసారి అటుగా వచ్చాడు- మాసిన గడ్డంతో, మురికి పట్టిన వస్త్రాలతో- దైవదర్శనం కోరి వచ్చాడు. చలి బాగా ఉన్న ఆ సమయంలో మెట్ల దగ్గర అడుక్కుంటూన్న ముసలాయన ఒకడు చలికి వణికిపోవటం మొదలెట్టాడు. భక్తులందరూ ఎవరి తొందరలో వాళ్ళు ఉడ్న్నారు- అతన్ని ఎవరూ గమనించలేదు; గమనించినా పట్టించుకోలేదు. 


పూజారి శంకరశాస్త్రి కూడా ముసలాయన్ని చూసి; జాలి పడ్డాడు- కానీ "ఇంత రద్దీ ఉన్న సమయంలో నేను ఏం చేయగలను?" అనుకొని ఊరుకున్నాడు. అయితే వచ్చిన ఆ బాటసారి మటుకు ముసలాయన దగ్గర ఆగాడు. తన భుజం మీద ఉన్న కంబళిని తీసి అతనికి కప్పాడు. ఆ పైన తన చొక్కా కూడా తీసి అతనికి తొడిగాడు. బయటికి వెళ్ళి, వేడి వేడి టీ తెచ్చి అతని చేత త్రాగించాడు. భగవంతుడికి అర్పించేందుకుగాను తను తెచ్చిన పండును కూడా ముసలాయనకు ఇచ్చివేసాడు. ఆ తర్వాత ఒట్టి చేతులతో గుడిలోకి వచ్చాడు.


గమనించిన శంకరశాస్త్రి ఆలోచనలో పడ్డాడు. "ఈ ముసలతన్ని నేను రోజూ చూస్తుంటాను; పలకరిస్తుంటాను- అయినా అతనికి సాయం అవసరమైనప్పుడు నేను ముందుకు రాలేదు. ఈ బాటసారి ఎవరో నిజంగానే పుణ్యాత్ముడు- తను కప్పుకున్న చొక్కాని కూడా కరుణతో ఇచ్చేసాడు. పరోపకారాన్ని మించిన ధర్మం లేదు అని శాస్త్రం ఘోషించటంలేదా? నేను నా ధర్మాన్ని విస్మరించాను. ఇక ఎప్పుడూ అలా చేయను. ఇతరుల కష్టాల్ని తీర్చేందుకు నావంతుగా కృషి చేస్తాను!" అనుకుంటూ సిగ్గుపడ్డాడు.


ఇన్నాళ్ళుగా లేనిది, ఆ రోజున ఆయన చేయి సోకగానే మట్టి పాత్ర కొద్దిగా బంగారు వర్ణంలోకి మారినట్లు తోచింది- బాటసారి చేయి సోకే సరికి అది నిజంగానే వెలుగులు చిమ్మింది! ఆనందాతిశయంతో కళ్ళు మూసుకున్న పూజారి శంకరశాస్త్రి కళ్ళు తెరిచి చూసే సరికి ఎదురుగా బాటసారి లేడు! 'సాక్షాత్తూ శివుడే ఈ రూపంలో తనకు మార్గం చూపించాడు' అనిపించింది, ఆశ్చర్యంతో నోరు తెరిచిన శంకరశాస్త్రికి. అటుపైన "ఏలాంటి ప్రయోజనాన్నీ ఆశించకుండా ఇతరులకు సహాయం చేయాలి అందరం- అదే పుణ్యం అంటే!" అని ఆచరణలో చూపిస్తూ చరితార్థుడైనాడాయన

పూర్వ జన్మ కర్మ.....

 ఒక గురువు చెట్టు క్రింద కూర్చొనీ...భక్తి గురించి దేవుని గురించి...జన్మ రాహిత్యం గురించి చెబు తున్నాడు. అటుగా వెళుతున్న బాటసారి గురువు చెబుతున్నది. వినీ దగ్గరకు వెళ్లి తనకు మంత్రోప దేశం ఇవ్వమని అడిగాడు. గురువు అప్పుడు అడిగాడు, నీకు భార్య బిడ్డలు ఉన్నారా...అని తన భార్య గర్భవతి అని చెప్పాడు.


గురువు ఇలా అన్నాడు గురు దక్షిణగా నువ్వు నాకే మిస్తావు? అని అడిగాడు గురువు. మీరు ఏది అడిగితే అదే ఇస్తాను అన్నాడు. సరే...నీ భార్యను అడిగి రా...తనకు పుట్టిన బిడ్డలను నాకు ఇవ్వ గలదా? అలా చేస్తే నీకు మంత్రోపదేశం చేస్తాను. వెళ్లి నీ భార్యను అడిగిరా, పిల్ల పుట్టిన వెంటనే రక్తం మడుగులో ఉండ గానే నాకు ఇచ్చేయాలి అన్నాడు గురువు. అతను వెంటనే ఇంటికి పరుగెత్తి భార్యకు విషయం చెప్పి మన పిల్లలను గురువుకు ఇవ్వ గలవా ? అని అడిగాడు. అందుకు ఆమె అలాగే ఇచ్చేద్దాం.


మన పిల్లలు గురువు వద్ద ఉంటే మంచిదే కదా, అంటూ ఒప్పు కుంది. ఆ విషయాన్ని గురువుకు చెప్పాడు. కొద్ది రోజులకీ ఆమె ప్రసవించింది.


మగ పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడిని నెత్తుటి మడుగులో ఉండ గానే తీసుకెళ్లి గురువు చేతిలో పెట్టారు. భార్య భర్తలు గురువు ఆ పిల్ల వాడిని తీసు కెళ్లి గొయ్యి తీసి అందులో పూడ్చేసాడు.


తల్లి దండ్రులు బిత్తర పోయి చూస్తు, చేసేది. ఏమి లేక వెను తిరిగి వెళ్లి పోయారు. ఈ విధంగా రెండో పిల్ల వాడిని కూడ గొయ్యి లో పూడ్చి పెట్టేసాడు.


మూడో సారికీ ఆవిడ ఒప్పు కోలేదు. ఇదేం గురువయ్యా ? నాకు నచ్చలేదు. నా కొడుకును ఇవ్వనుకాక ఇవ్వను అంటూ మొండి కేసింది. అతను గురువు వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. గురువు గారే ఆమె దగ్గరకు వెళ్లి ఇలా... అన్నాడు. అమ్మ నీ బిడ్డను ఇవ్వనన్నావు కదా, ఇప్పుడు నీ బిడ్డను నేనేమి చేయను. కాని ఒక్క సారి బిడ్డను నా చేతి కిచ్చి నా వెంట రండి. మీ బిడ్డను నేనేమి చేయను.తిరిగి మీ బిడ్డను మీకు ఇచ్చేస్తా అని అన్నాడు.


సరే ననీ బిడ్డను తీసుకొని గురువు వెంట బయలుదేరారు వారిరువురు.


గురువు వీళ్లిద్దరినీ ఇంతకు ముందు గొయ్యి తీసి పెట్టిన చోటికి తీసుకుని వెళ్ళాడు. ఆ రెండు గొయ్యిల మధ్య తెల్లని గుడ్డ పరిచి...ఈ పిల్ల వాడిని వాటి మద్యలో పడుకో బెట్టి చేతి లోకి నీళ్ళు తీసుకొని మంత్రించి...ఆ ముగ్గురు పిల్లల మీద చల్లాడు. తల్లిదండ్రులను కొంచెం దూరంలో నిలబెట్టి...


ఆ గొయ్యిలో నుండి వస్తున్న శబ్దాలను విన మన్నాడు. గొయ్యి లో నుండి మొదటి పిల్లవాడు రెండవ వాడిని అడుగుతున్నాడు. ఒరేయ్ వీళ్ళకు కొడుకుగా పుట్టావు. కదా దేని కోసం పుట్టావు. వీళ్ళకి నీకు ఏమిటి సంబంధం అని అడిగాడు.


రెండో వాడు ఇలా చెబుతున్నాడు. గత జన్మలో వీడు బాకి పడ్డాడు. నాకు డబ్బులు ఇవ్వ కుండానే పోయాడు. అందుకనీ వీడికి కొడుకునై పుట్టి అందినంత లాగేసుకుందామని వచ్చాను. మరీ నువ్వు ఎందుకొచ్చావు అని అడిగాడు. వీడు నాకు కూడా ఇవ్వాలిరా...నేను కూడా అందుకే వచ్చాను.


వీడికి కొడుకునై పుట్టి దొరికి నంత దోచుకొని వదిలేసి వెళదామని వచ్చాను . కానీ వీడు మనల్ని గురువు చేతిలో పడవేసాడు.


ఇంకే ముంది? వాడు మనకు పడిన బాకీలన్నీ గురువు తెగ్గొట్టేశాడు. ఇప్పుడు వాడికి మనకి రుణ బంధం తెగిపోయింది అని వాళ్ళు మాట్లాడు కుంటున్నారు. ఈ ఇద్దరూ కలిసి బ్రతికి ఉన్న మూడో వాడిని అడిగారు. ఒరేయ్ నువ్వెందు కొచ్చావురా అని? అప్పుడు బ్రతికి ఉన్న మూడోవాడు ఇలా చెప్పాడు, గతజన్మలో నాకు కొడుకులు బిడ్డలు ఉండికూడ దిక్కు లేకుండా పడిఉంటే వీడు నన్ను చేరదీసి అన్నంపెట్టి ఆదరించాడు.


నేను పోయే వరకు నన్ను పోషించాడు.


అందుకే...ఈ జన్మ లో వీనికి కొడుకునై పుట్టి తల్లితండ్రులిద్దరినీ వాళ్ళు బ్రతికినంతకాలం అన్నం పెట్టి వాళ్లను సంతోషంగా ఉంచి ప్రశాంతమైన జీవితాన్ని వాళ్ళకు ఇచ్చి వారి రుణం తీర్చు కుందామని వారికి కొడుకునై పుట్టాను. మీరు ఆయన్ని పీడించాలని వచ్చారు. గనుక గురువు మిమ్మల్ని గొయ్యి లో పాత పెట్టాడు. నేను అలా కాదు గనుక నేను బ్రతికి ఉన్నాను అని చెప్పాడు. ఈ ముగ్గురు మాట్లాడుకున్న మాటలు ఈ తల్లి తండ్రులు విన్నారు. గురువు పాదాల మీద పడి క్షమించమని వేడు కున్నారు. కాబట్టీ గురువు లేని పూజ గుడ్డి పూజ అని అర్ధం.


ఆత్మ జ్ఞానము తెలిసిన గురువును పట్టు కుంటే రుణానుబంధాలే కాదు, జన్మ రాహిత్యమే కలుగుతుంది.ఈ జన్మ లోనే మోక్షం లభిస్తుంది...


మోక్ష మంటే చని పోయిన తర్వాత మోక్షం వస్తుందనీ చాలా మంది అను కుంటారు కాని అది కాదు.మోక్షం అంటే బ్రతికుండగానే ఆత్మ జ్జానాన్ని పొందటం...దైవం ఏ ఏ రూపాలలో ఉన్నాడు.. ఎక్కడ ఉన్నాడు...ఏం చేస్తున్నాడు.ఈ సృష్టి ఏమిటి. ఎలా తయారైంది, నేనెవరిని,ఎక్కడ నుండి వచ్చాను,మళ్లీ ఎక్కడికి వెళతాను. అసలు మాయ అంటే ఏమిటి??? ఇలా ఎన్నో సృష్టి రహస్యాలు బ్రతికుండగానే తెలిసిపోతాయి.ఇదే మోక్షం.మరుజన్మకి రాకుండా భగవంతుడు తన రూపాన్ని ఇచ్చి తానుగా మార్చు కుంటాడు.


ఈ ఆత్మ జ్ఞానం కలగ డానికి ధ్యానం అనే ఆత్మ విద్యను మనకి బోధిస్తారు.

కొంప తీసిన వైద్యం.(కథ)

 ఒకానొక గ్రామంలో ఆచారి అనే వైద్యుడు ఉండేవాడు. ఆయన అనేక రకాల మూలికలతో ఔషదాలు తయారు చేసి, గ్రామ ప్రజలకు వైద్యం చేస్తూ ఉండేవాడు. 

               అయితే అదే ఊరిలో పరమేశు అనే నిరుపేద యువకుడు ఉండేవాడు. పరమేశు అమాయకుడు. ఒకనాడు అతని తండ్రికి ఏదో అనారోగ్యం చేసింది. పరమేశు వెంటనే ఆచారి ఇంటికి వెళ్ళి, తండ్రి అనారోగ్యం గురించి ఆచారితో చెప్పాడు. 

             ఆచారి పరమేశు తండ్రిని పరీక్షించి, పరమేశు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని, ఇది సామాన్యమైన రోగం కాదు. దీనిని నయం చేయాలంటే, రాజహంస గ్రుడ్డు కావాలి; అది దొరకడం అసంభవం. అన్నాడు. 

          అమాయకుడైన పరమేశు ఎలాగైనా రాజహంస గ్రుడ్డుని సాధించి తీసుకు వస్తానని చెప్పి, దాని గురించి వివరాలన్నీ ఆచారిని అడిగి తెలుసుకొని, గ్రుడ్డు కోసం బయలు దేరాడు. 

            ఎక్కడెక్కడో తిరిగి అలసిపోయిన పరమేశు ఒక చెట్టు క్రింద ఆగి విశ్రాంతి తీసుకోసాగాడు. 

         అయితే అదే సమయంలో మరో చెట్టు క్రింద విశ్రమించిన   ఒక గాడిద... ఒక గ్రుడ్డును పెట్టింది. 

         ఆ వింతను చూసిన పరమేశు మరింత ఆశ్ఛర్య పోయి, ఆ గ్రుడ్డుని పరీక్షగా చూసేసరికి దానికి ఆచారి చెప్పిన లక్షణాలన్నీ ఉన్నాయి. అయితే రాజహంసకి బదులుగా గాడిద ఎందుకు గ్రుడ్డు పెట్టిందో బోధ పడలేదు. 

        ఏదైతేనేం మనకు కావల్సింది లభించింది కదా! అని అనుకొని, పరమేశు ఆ గ్రుడ్డుతో పాటు గాడిదను   కూడా తన ఇంటికి తోలుకుపోయి గాడిదను పాకలో కట్టేసి, గ్రుడ్డు తీసుకువెళ్ళి ఆచారికి చూపించాడు. 

         బంగారు ఛాయలో ధగ ధగ లాడే ఆ గ్రుడ్డుని చూసి,  ఆచారి మరింత ఆశ్ఛర్య పోయాడు. 

అన్నమాట ప్రకారం ఆ గ్రుడ్డుతో ఆచారి  ఔషధాన్ని తయారు చేసి, పరమేశు తండ్రి రోగాన్ని కుదిర్చాడు. 

        ఆ తరువాత పరమేశు నుండి ఆ గ్రుడ్డు ఎలా లభించిందా అని ఆరా తీసాడు. 

         లోకజ్ఞానం తెలియని అమాకుడైన పరమేశు... మా అయ్య (తండ్రి) రోగాన్ని కుదర్చడానికి ఆ భగవంతుడే రాజహంసని... ఈ భూమ్మీద గాడిదగా పుట్టించి ఉంటాడు. అంటూ తనకు ఆ గ్రుడ్డు ఎలా లభించిందో అన్ని వివరాలూ పూస గ్రుచ్చినట్లు ఆచారికి చెప్పాడు. 

         అంతా విన్న ఆచారి మరింత ఆశ్ఛర్యానికి లోనై, కావలసినంత డబ్బు తీసుకొని ఆ గాడిదను తనకు అమ్మమని అడిగాడు. 

         వెంటనే పరమేశు " ఆచారి గారూ! మీరు మాఅయ్య రోగాన్ని కుదిర్చారు. నాకు అదే చాలు. మీ బుుణాన్ని ఈ రూపంగా నైనా తీర్చుకోనివ్వండి." అంటూ పరమేశు ఆ గాడిదను స్వయంగా ఆచారి ఇంటికి తోలుకుపోయి, పాకలో కట్టేసి వచ్చాడు. 

        అయితే ఆ గాడిద ప్రతీ రోజూ ఒక గ్రుడ్డుని పెట్టసాగింది. ఆచారి బుఱ్ఱలో ఆశా పిశాచం ఆవహించింది. అతని బుద్ది మారిపోయింది. ఇక ఎప్పటికీ నయం కావు అనుకున్న దీర్ఘవ్యాధుల్ని సైతం నయం చేయసాగాడు. రోగ గ్రస్తులైన సంపన్న కుటుంబీకులకు రోగాల్ని నయం చేస్తూ వేలాది వరహాల్ని సంపాదించి గొప్ప శ్రీమంతుడయ్యాడు. 

            ఇలా ఉండగా ఒకనాడు ఆ దేశాన్నేలే రాజు గారు ఆచారికి కబురు పంపి, యువరాజుకి ఏర్పడిన విచిత్ర రోగాన్ని నయం చేయమని అడిగాడు.

          అందుకు గాను వైద్యం నిమిత్తం లక్ష వరహాలు కావాలని అడిగి పుచ్చుకొని ఇంటికి తిరిగి వచ్చాడు ఆచారి. గాడిద ఎప్పుడు గ్రుడ్డు పెడుతుందా..ఎంత త్వరగా ఔషధం చేద్ధామా! అని ఎదురు

చూడసాగాడు. 


అయితే నిజానికి ఆ గాడిద ఒక రాజహంస. 


       ఒకనాడు ఒక  రాజహంస  గగన మార్గాన పయనిస్తూ, రెట్ట వేసింది. అది సరాసరిగా సూర్య నమస్కారం చేసుకుంటున్న ఒక మహర్షి శిరస్సున పడింది. ఆ మహర్షి మహా కోపిష్టి కావడంతో.. కళ్ళల్లో నిప్పుల్ని కురిపిస్తూ, ఆకసం వైపు చూసి, రాజహంసవై ఉండి కూడా ఇంగిత జ్ఞానం లేకుండా గాడిదలా అప్రాచ్యపు పని చేసావు. భూలోకంలో గాడిదవై జన్మించు. అని శపించాడు. 

         వెంటనే రాజహంస మహర్షి వద్దకు వచ్చి తన తప్పిదాన్ని మన్నించమని ప్రాధేయపడింది. 

        మహర్షి ఎంత మాత్రం చలించక పోవడంకో కనీసం శాప విమోచన అయినా ప్రసాగించమని వేడుకున్నది. 

       మహర్షి కొంత సానుభూతిని కనబరుస్తూ, "నువ్వు రూపానికి గాడిదవైనా... నీ జాతి లక్షణాలనే కలిగి ఉంటావు. నూరు గ్రుడ్లను పెట్టడం పూర్తి కాగానే, తిరిగి రాజహంస రూపాన్ని పొందుతావు." అని శాప విముక్తి తెవిపాడు. 

       " మహా ప్రసాదం " అంటూ మహర్షికి నమస్కరించి, భూలోకం చేరి గాడిదగా మారి, ఆనాటి నుండి రోజుకి ఒక గ్రుడ్డుని పెట్టసాగింది. 

         అయితే అది అప్పటికే తొంబై కొమ్మిది గ్రుడ్లు పెట్టింది. 

       ఇక నూరవ గ్రుడ్డు పెడితే దాని శాపం తీరిపోతుంది. ఆ విషయం తెలియని ఆచారి... గాడిద పెట్టబోయే గ్రుడ్డు కోసం ఎదురు చూస్తుండగా ఆనాటి రాత్రి నూరవ గ్రుడ్డుని పెట్టింది. 

         ఆచారి ఎంతో ఆనందించాడు. అయితే ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. కారణం...గ్రుడ్డుని పెట్టిన మరు క్షణంలో ఆ గాడిద తనకు శాప విమోచన కలుగబోతున్నది అనే ఆనందంలో 

ఆ గ్రుడ్డుని పొరపాటున కాలితో తొక్కేసి, రాజహంసగా  మారిపోయి ఆకసంలోకి ఎగిరి పోయింది. 

         ఈ విషయం తెలియని ఆచారి సమయానికి గ్రుడ్జు దొరక్క పిచ్చి పట్టినట్లయి ఔషధాన్ని తయారు చేయలేక పోయాడు. 

          సమయానికి చికిత్స జరక్కపోవడంతో యువరాజు మరణించాడు. 

ఆచారి లబో దిబో మన్నా వినిపించుకోకుండా ఆచారికి మరణశిక్ష విధించాడు. 


           ఈ కథ వలన నీతి :

(ఏ మనిషికైనా దురాశ వినాశనాన్ని తెచ్చి పెడుతుంది)

ఓం నమశ్శివాయ!!

 ఉన్నత స్థానంలో నేనుండాలనే కోరిక కోరుకొవాలని నిన్నేతుక్కుంటూ వస్తే "స్మశానంలో కనపడ్డావ్"..నువ్వెంత ఉన్నత స్థానానికి వెళ్ళినా,రావాల్సిన స్థానం ఇదేనని కాటి కాపారితో చెప్పించావ్ ..ఇంకా నిన్నేం అడగాలిరా శివ...


వేల కోరికలు కోరుకొని గుడిబయటికొస్తుంటే ప్రసాదంగా "బూడిదిచ్చారు"..నేను నీకేమిచ్చిన,నువ్వు సొంతంగా ఏది పొందినా ..నా శరీరం మీద ఎప్పుడు ఉండేది,నీ శరీరం ఎప్పటికైనా పొందేది ఇదేనని పూజారితో చెప్పించావ్...ఇక నిన్నేం అడగమంటావురా శివ...


కోపాన్ని అధీనంలో ఉంచుకునే వారమడుగుదామని వస్తే ...పూల బాణం వేసినందుకు మన్మధుణ్ణి భస్మం చేసావని,తలుపుకి అడ్డుగా నిలబడ్డందుకే కొడుకు తల నరికేసవని చెప్పారు..అది విని వెనక్కి వెళ్లిపోవడం  తప్ప ఎం చెయ్యగలనురా శివ...


ఎవరికీ చెప్పుకోలేని కష్టాలు నీకు చెప్పుకుందామని వస్తే ..ఆయనే గొంతులో విషాన్ని పెట్టుకొని మింగలేక ,కక్కలేక కష్టపడుతున్నాడనే మాటలు విన్నాను...ఇక నేను చెప్పుకోవాలనుకోవడం మూర్కత్వమే కదారా శివ...


రాక్షసులు అంతమవ్వాలనే వరం ఇమ్మని అడగుదామని వస్తుంటే....నీ దర్శనం చేసుకొని ఆనందంతో తాండవం చేసుకుంటూ వస్తున్న రాక్షసులు నాకు ఎదురు పడ్డారు...నాకు నువ్వెంతో,వాళ్ళు అంతే అనుకొనే నిన్ను ఇంకేం అడుగుతామురా శివా.....


తృప్తి,ముక్తి పొందాలని నీ దెగ్గరికి వస్తే.. రెండిటికోసం నువ్వే కల్లు తాగుతూ,గంజాయి పిలుస్తున్నావని తెలిసింది..ఇంకా నా నోటా,మాటెలా వస్తుందిరా శివా...


మనశ్శాంతిగా ఉండే జీవితం కోసం నీ దెగ్గరికి వస్తే ..నువ్వే దానికోసం ఎముకలు కొరికి చలున్న హిమాలయాల్లో,ఎవరు రాని ప్రదేశంలో ధ్యానం చేసుకుంటున్నావని చెప్పారు..అడగటానికి ఇంకేముంటుందిరా శివ... 


హహ...కానీ,నువ్వంటే ఇష్టం ,నువ్వొక వ్యసనం కారణం...


"ఆడవాళ్ళని,మగవాళ్ళని వేరు చేసి చూసే మాకు గంగని తలపై పెట్టుకొని,పార్వతికి శరీరంలో సగ భాగం ఇచ్చి..ఆడవాళ్లంటే,మగవాళ్ళకి వ్యతిరేకం కాధు..మగవారిలాగే,ఆడవాళ్లు కూడా ఈసృష్టిలో ఒక భాగం అనే విషయం చెప్పావు చూడు అందుకే నువ్వంటే వ్యసనం"...


"మేడలో పాముని వేసుకొని,అది తినే ఎలుకని కొడుక్కి వాహనంగా ఇచ్చి,పాముని తినే నెమలిని ఇంకో బిడ్డకి వాహనంగా చేర్చి,నువ్వెక్కి తిరిగే నందిని తినే సింహాన్ని పార్వతికి ఆసనంగా మార్చి,అవన్నీ ఒకే దెగ్గర ఉండేలా చేసి ..ఇవే జాతి వైరం లేకుండా పక్క, పక్కన బ్రతుతున్నాయి,మరి జ్ఞానమున్న మనుషులు మీ పరిస్థితేంటి అని ప్రశ్నిస్తున్నావు కదా " అందుకే నువ్వంటే వ్యసనం..


"సాగర మధనంలో విషం వచ్చినప్పుడు అందరికంటే ముందుగా అక్కడికి చేరింది నువ్వే,అమృతం వచ్చినప్పుడు అక్కడికి రానిది కూడా నువ్వే...ఫలితం ఎవ్వరు సుఖంగా అనుభవించినా పర్లేదు,కానీ దాని తాలూకు కష్టం మొత్తం మనమే అనుభవించాలనుకునే నీ ఆలోచనకి నేను వ్యసనపరుడనే "...


"కోపం ప్రతి జీవి లక్షణం ,కానీ,అది అవలక్షణం అవ్వకూడదనే విషయాన్నీ మాకు తెలియడానికి నీ జీవితాన్నే చాలసార్లు ఉదాహరణగా చుపించావ్ కదా అందుకే నీకు వ్యసనపరుణ్ణి"...


" అర్హతలేని వాళ్లకి అవకాశమిస్తే ఏమవుతుందో "ఒక రాక్షసుడికి తల మీద చెయ్యి పెడితే భస్మమై పోవాలనే వరాన్ని ఇచ్చి,ఒక రాక్షసుడికి చావే లేకుండా వరాన్ని ఇచ్చి నువ్వు పడిన బాధనే మాకొ గుణపాఠంలా చెప్పావ్ కదా అందుకే నువ్వంటే వ్యసనం"...


"మనం చేసిన తప్పు ఎంత పెద్దదైనా సరిచేసుకొని అవకాశం ఉంటుందని,వస్తుందని "మాములు బాలుడి తల ఆవేశంతో నరికి, తర్వాత ఆలోచనతో ఏనుగు తల అతికించి... అందరూ ముందు పూజించాల్సినంత గొప్ప స్థాయికి బాలున్ని పంపి అందరికి నాయకుడిగా ఉండే వినాయకుణ్ణి చేసి చూయించావు కదా "అందుకే నువ్వొక వ్యసనం...


"కల్లు తాగినా ,గంజాయి పీల్చిన ఒక్కసారి కూడా తప్పుగా ప్రవర్తించిన సందర్భం లేకుండా, వెంటనే ధ్యానం చేసుకుంటూ.."మన జీవితపు శాశ్వత ఆనందాన్ని తాత్కాలికంగా మార్చేది వ్యసనం,తాత్కలిగంగా చేసిన శాశ్వతంగా ఆనందాన్ని ఇచ్చేది ధ్యానం" అని అలవాట్లు అనుభవించి మాలాంటి వాళ్ళకి అర్ధమయ్యేలా చేసావు కదా " అందుకే నువ్వొక వ్యసనం...


నీ గురించి ఎంత చెప్పిన తరిగేది కాదు...ఎందుకంటే నీ గురించి చెప్పడం కూడా నీ ఛెర్యే కదా...


"శివుడు అర్చర్యం కలిగించే శక్తులు ఉన్నవాడు కాదు,అర్ధం చేసుకుంటే అద్భుతం అనిపించే వ్యక్తిత్వం ఉన్నవాడు"..."శివుడికుండాల్సింది భక్తుడిగా కాదు,విద్యార్థిగా"...


"శివుడు పూజించాల్సిన దేవుడో లేక నమ్మాల్సిన దేవుడో కాదు..అర్ధం చేసుకోవాల్సిన దేవుడు...


ఓం నమశ్శివాయ!!


నాలోన శివుడు గలడు,నీలోన శివుడు గలడు....