Wednesday, 23 June 2021

పోతన భాగవతం 0017 ధ్రువోపాఖ్యానం

 సర్వోతృష్టమయినది భగవద్భక్తి. ఆ హరిభక్తునికి అందనిదేదీ లేదు. అది చెప్పేందుకే ఇప్పుడీ ధ్రువోపాఖ్యానం. ద్రువం అంటే శాశ్వతమయినదీ, సత్యమయినదీ అని అర్థం. ధ్రువ నక్షత్రం అన్నింటి కంటే ఎత్తున ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటుంది. సప్తర్షులూ, సూర్యచంద్ర గ్రహ నక్షత్ర తారకాగణం యావత్తూ ఈ ధ్రువ నక్షత్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటాయి. కాలగణనలోనూ, ఖగోళశాస్త్రంలోనూ ధ్రువనక్షత్రానిదే ప్రముఖ పాత్ర. భాగవతంలో ధ్రువుని కథ విశిష్టమయినది. విశేషించి చెప్పుకోదగినది. మరందుకే వినండి!స్వయంభువ మనువు కుమారుడు ఉత్తానపాదుడు. అతనికి సునీతి, సురుచి అని ఇద్దరు భార్యలు. పెద్దభార్య సునీతి సద్గుణశీల సంపన్నురాలు. చిన్నభార్య సురచి మహా సౌందర్యవతి. సునీతికి ధ్రువుడు పుడితే, సురుచికి ఉత్తముడు జన్మించాడు. ఉత్తానపాద మహారాజుకి మహా సౌందర్యవతి సురుచి అంటే ప్రేమ ఎక్కువ. ఆమెను అధికంగా ప్రేమిస్తూ సునీతిని దూరం చేయసాగాడు. తల్లితో పాటు బిడ్డడు ధ్రువుణ్ణి కూడా అలక్ష్యం చేశాడు.ఒకనాడు సురుచి కుమారుడు ఉత్తముణ్ణి తొడపై కూర్చోపెట్టుకుని, వాణ్ణి ముద్దాడసాగాడు ఉత్తానపాదుడు. చూశాడది ధ్రువుడు. పసివాడయిన తననీ తండ్రి అలా ముద్దాడితే బాగుణ్ణనిపించింది. పరుగున వచ్చాడు. తండ్రి తొడ ఎక్కి కూర్చోబోయాడు. సింహాసనం మీద కూర్చున్న తండ్రి తొడ అందడం లేదు. తండ్రి చేయందిస్తాడేమోనని చూశాడు ధ్రువుడు. తండ్రి చేయందించలేదు సరికదా, పట్టించుకోలేదసలు. అది అనువుగా తీసుకుంది అక్కడే ఉన్న సురుచి. ధ్రువుణ్ణి పురుగును చూసినట్టుగా చూసింది. అసహ్యించుకుంది. సింహాసనం మీదికి ఎగబాకుతున్న ధ్రువుణ్ణి  రెక్క పుచ్చుకుని బలంగా ఇవతలికి లాగి పారేసింది.కోపంగా ఇలా అంది.


‘‘నువ్వేంటో నీ బతుకేంటో తెలుసుకోకుండా మహారాజు తొడను ఎక్కేందుకు ప్రయత్నిస్తావా? ఆ తొడను ఎక్కేందుకు ఒక్కడే అర్హుడు. వాడు నా కొడుకు ఉత్తముడొక్కడే! నీకా యోగ్యత ఈ జన్మలో లేదు. ఇంకో విషయం కూడా తెలుసుకో! రాజార్హత ఉన్న వాడే మహారాజు తొడనెక్కి కూర్చోగలగాలి. నీకా అర్హత కూడా లేదు. అధమురాలు సునీతి కడుపున పుట్టిన నీకు మహరాజయోగం లేదు. రాదు. వెళ్ళిక్కణ్ణుంచి.’’పినతల్లి మాటలు ధ్రువుడి మనసుని బాణాల్లా గాయం చేశాయి. విలవిల్లాడాడు. అనరాని మాటలని తనని సవతి తల్లి హింసిస్తున్నా పట్టించుకోని తండ్రిని చూసి మరింతగా బాధపడ్డాడు. ఏడుపొచ్చింది. ఏడుస్తూ తల్లిని సమీపించాడు ధ్రువుడు. ‘‘ఏంటమ్మా ఇది? నాన్నాగారి తొడ మీద కూర్చునే భాగ్యం నాకు లేదా? నేను అందుకు యోగ్యుణ్ణి కానా? ఉత్తముడూ నేనూ ఒకటి కాదా? నన్నెందుకు పిన్నమ్మ కసిరి కొట్టింది? పిన్నమ్మ నన్ను అనరాని మాటలని హింసిస్తుంటే నాన్నెందుకు కల్పించుకోలేదు? ఊరుకున్నారెందుకు? ఎందుకమ్మా మనం అంటే ఇంత చులకన?’’ అడిగాడు. సమాధానంగా సునీతి ముందు పెద్దగా ఏడ్చింది. తర్వాత ఇలా అంది. 

తప్పు మీ పిన్నిది కాదు నాయనా! తప్పంతా మహారాజుదే! ఆయనే మనల్ని నిరాదరిస్తున్నారు. నన్ను తన భార్యగా చెప్పుకోవడం మహారాజుకి సిగ్గుచేటు. ఏం చేస్తాం, అంతా మన ఖర్మ.’’భార్యని భార్యగా చెప్పుకోవడం మహారాజుకి ఎందుకు సిగ్గుచేటు? ఆలోచించసాగాడు ధ్రువుడు. ఆ పసివాణ్ణి అట్టే ఆలోచించనీయలేదు తల్లి. ఏడుస్తూ అంతలోనే ఇలా అంది.‘‘కొందరు పుట్టుకతోనే కష్టాలూ కన్నీళ్ళూ వెంటబెట్టుకుని పుడతారు. వారిలో నేనొకదాన్ని. నా కడుపున నువ్వు పుట్టావు. అదే నువ్వు చేసిన నేరం. పెద్ద పాపం.’’‘అవునా’ అన్నట్టుగా చూశాడు ధ్రువుడు. కన్నీరు తుడుచుకుంది సునీతి. చెప్పిందిలా.


‘‘సింహాసనం మీద కూర్చున్న తండ్రి తొడను ఎక్కలేదే అన్న బాధే కనుక నిజంగా నీకు ఉంటే బాధపడకు. నేనో మాట చెబుతాను, వింటావా?’’‘‘చెప్పమ్మా’’‘‘దేవాదిదేవుడు ఆ శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధించు. అతన్ని వేడుకుంటే నాన్నగారి తొడ మీదే కాదు, నాన్నగారి సింహాసనం మీదే నువ్వు కూర్చునే అవకాశం, అదృష్టం లభిస్తాయి. బ్రహ్మాది దేవతలెందరో హరిని పూజించి, అందరాని అదృష్టాలు అందుకున్నారు. ఆలస్యం చెయ్యకు, వెళ్ళు. నిండు గుండెతో విష్ణువుని పూజించు. అతని కరుణా కటాక్షం కోసం తపస్సు చెయ్యి.’’ చెప్పింది సునీతి. ఆ మాటలు మంత్రోపదేశం అయ్యాయి. అంతే! అయిదేళ్ళు కూడా నిండని  ధ్రువుడు అక్కణ్ణుంచి కదలి, అరణ్యమార్గం పట్టాడు. కాకులు దూరని కారడవిలో ఒంటరిగా నడచి వెళ్ళసాగాడు. అది గమనించాడు నారదుడు. ఆకాశం నుంచి కిందికి దిగాడు. ధ్రువునికి ఎదురయ్యాడు.‘‘అయిదేళ్ళయినా లేవు. చూడబోతే రాకుమారుడిలా ఉన్నావు. ఎక్కడికయ్యా ఈ కీకారణ్యంలోకి?’’ అడిగాడు నారదుడు.‘‘తమకు తెలియనిదేమున్నది మునీంద్రా? నా సవతితల్లి నన్ను అవమానించింది. నా గుండెను గాయం చేసింది. తట్టుకోలేకపోతున్నాను, తపస్సు చేసుకునేందుకు పోతున్నాను.’’ అన్నాడు ధ్రువుడు. ‘‘తపస్సా?’’ ఆశ్చర్యపోయాడు నారదుడు. తర్వాత పగలబడి నవ్వి, ఇలా అన్నాడు.‘‘ఏది మంచో ఏది చెడో తెలియని వయసు నీది. ఈ వయసులో తపస్సు చేస్తానంటున్నావు, సాధ్యమా?’’‘ఎందుక్కాదు మునీంద్రా?’ అన్నట్టుగా చూశాడు ధ్రువుడు.‘‘మహా మహాయోగులకు కూడా లభించని భగవత్‌ సాక్షాత్కారం నీకు లభిస్తుందని నువ్వు ఎలా అనుకుంటున్నావు? తపోనిష్ఠను తట్టుకోవడం చాలా కష్టం. అది నీ వల్ల కాదుగాని, నా మాట విను. ఎలా వచ్చావో అలాగే తిరిగి వెళ్ళిపో!’’ అన్నాడు నారదుడు. అతన్ని సన్నగా నవ్వుతూ చూశాడు ధ్రువుడు.


‘‘వెళ్ళను మునీంద్రా! సవతితల్లి అవమానాన్ని తట్టుకుని బతకలేను. ఆ అంతఃపురంలో అడుగు పెట్టలేను.’’ అన్నాడు. గట్టి నిర్ణయం మీద ఉన్నట్టుగా గుండె నిండుగా ఊపిరి పీల్చి వదిలాడు.‘‘తండ్రి తొడని అధిరోహించడం కాదు, వారి సింహాసనాన్ని అధిష్ఠించడం అంతకంటే కాదు. ఇంతకు ముందు మా పెద్దలెవరూ పొందని ఉత్తమపదం నేను పొందాలి. దాన్ని నేను సాధించాలి. సాధించే మార్గం చెప్పండి మునీంద్రా.’’ నారదుడికి చేతులు జోడించి నమస్కరించాడు ధ్రువుడు.‘‘పరమ భాగవతోత్తములు. బ్రహ్మమానస పుత్రులు. మీరే నాకు దిక్కు. కర్తవ్యాన్ని బోధించండి.’’ ప్రార్థించాడు.వజ్రసంకల్పంతో వన్నె తేరిన ధ్రువుణ్ణి చూసి సంతోషించాడు నారదుడు.‘‘నీ దీక్ష మహదాశ్చర్యాన్ని కలిగిస్తున్నది. నీ కోరిక తీరాలంటే ఒకటే మార్గం, నీ తల్లి చెప్పినట్టుగా నువ్వు ఆ దేవదేవుణ్ణి, శ్రీహరిని ధ్యానించి తీరాలి. మరో దిక్కు లేదు.  వెళ్ళు, నిశ్చల మనస్కుడవై శ్రీహరిని ధ్యానించు.’’ అన్నాడు నారదుడు. తపోనిష్ఠకు సంబంధించిన విధి విధానాన్ని చెప్పాడు. భక్తితత్త్వాన్ని బోధించాడు. వాసుదేవుని ద్వాదశాక్షర మంత్రం ఉపదేశించాడు. 

‘‘నాయనా! నిష్ఠతో ఈ మంత్రాన్ని జపించు. నీ కోరిక సిద్ధిస్తుంది.’’ అన్నాడు నారదుడు.‘‘ధన్యుణ్ణి మునీంద్రా’’ అన్నాడు ధ్రువుడు. నారదునికి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. తర్వాత మధువనికి తరలిపోయాడు.భార్య సురుచి చేసిన అవమానాన్ని తట్టుకోలేక, కొడుకు ధ్రువుడు తపోవనాలకు తరలిపోయాడని తెలిసి, తండ్రి ఉత్తానపాదుడు తీవ్రంగా దుఃఖించాడు. జరిగిన దానిలో తన తప్పూ ఉన్నదని బాధపడ్డాడు. నిరాహారంతో ధ్రువుడు ఎన్నాళ్ళు బతికి ఉంటాడు? అసలు బతికి ఉన్నాడో లేదో? ఈ సరికి ఏ వన్యమృగం నోట పెట్టుకున్నదో? అని వాపోయాడు రాజు. కన్నీరు పెట్టుకు కూర్చున్నాడు. అప్పుడక్కడ నారదుడు ప్రత్యక్షమయ్యాడు.‘‘నీ కొడుకు ధ్రువుడు దేవతలూ మునులూ సాధించలేని గొప్ప కార్యాన్ని సాధిస్తాడు. ముల్లోకాల్లో కీర్తి గడిస్తాడు.’’ అని చెప్పాడు. అయినా కొడుకుని దూరం చేసుకున్న దుఃఖం ఉత్తానపాదుణ్ణి నిలువనీయలేదు. రాజ్యభోగాలకు దూరమయ్యాడతను. నిరక్తుడయిపోయాడు.కాలం గడుస్తోంది.మధువనానికి చేరుకున్నాడు ధ్రువుడు. కాళిందీనదిలో స్నానం చేశాడు. దీక్ష చేపట్టాడు. నారదుడు ఉపదేశించినట్టుగా తపస్సు ప్రారంభించాడు.మూడు రోజులకొకసారి దొరికిన కాడికి పళ్ళు తినేవాడు. అలా ఓ నెల రోజులు గడిపాడు. తర్వాత నెల ఆరు రోజులకొకసారి ఆకులూ అలములూ తింటూ గడిపాడు. ఆ తర్వాతి నెల తొమ్మిది రోజులకొకసారి మంచితీర్థం పుచ్చుకుంటూ గడిపి, ఆ పైనెల పన్నెండు రోజులకొకసారి వాయుభక్షణ చేస్తూ గడిపాడు. నాలుగు నెలలు అలా పూర్తి చేసి, అయిదవ నెలలో ఉచ్ఛ్వాస నిశ్వాసలు నిరోధించాడు. 


పంచప్రాణాల్నీ బిగబట్టాడు. ఒంటికాలిపై నిలుచుని, నిశ్చలుడయినాడు. స్థాణువయ్యాడు. శ్రీహరిని ప్రార్థిస్తూ చాలా ఏళ్ళు అలా తపస్సు చేశాడు ధ్రువుడు. అయినా భగవత్‌ సాక్షాత్కారం లభించలేదు. కాలి బొటన వేలు మీద నిలబడి తపస్సు ప్రారంభించాడు. ఘోర తపస్సు చేపట్టాడు. ఆ తపస్సుకీ, బొటన వేలితో నొక్కిపెడుతున్న బాధకీ భూమి వణకి పోసాగింది. సురలూ, మునులూ భ యకంపితులయినారు. లోకంలో ప్రాణి కోటి అంతా ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయింది. దేవతలకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. శ్రీమన్నారాయుణ్ణి శరణు కోరారు. కాపాడమని ప్రార్థించారు. అభయాన్ని ప్రసాదించాడు శ్రీహరి. శంకు చక్రాలు దాల్చి, గరుడవాహనారూఢుడై మధువనానికి బయల్దేరాడు. చేరుకున్నాడక్కడకి.‘‘భక్తా’’ పిలిచాడు. ఆ పిలుపునకు కళ్ళు తెరచి, శ్రీమన్నారాయుణుని చూశాడు ధ్రువుడు. ఆనందంతో కన్నీరు పెట్టుకున్నాడు. చేతులు జోడించి, సాష్టాంగప్రణామం చేశాడు. తర్వాత లేచి ఆ దేవదేవుణ్ణి ఏమని స్తుతించాలో, ఎలా స్తుతించాలో తెలియక చూస్తూ నిల్చున్నాడు. అయిదేళ్ళ పసివాడికి అనంతుని ఆరాధనలు ఎలా తెలుస్తాయి? నవ్వుకున్నాడు శ్రీహరి. నవ్వుతూనే ధ్రువుడి చెక్కిళ్ళు నిమిరాడు. తర్వాత వేదమయమయిన శంఖాన్ని తాకించాడతనికి. ఎప్పుడయితే శ్రీహరి చెక్కిళ్ళు నిమిరి, శంఖాన్ని తాకించాడో అప్పుడు ధదివ్యజ్ఞానం కలిగింది. సరస్వతి జిహ్వాగ్రంపై నాట్యం చేయడంతో వేదసూక్తాలతో శ్రీమన్నారాయునిని వేయి విధాల స్తుతించాడు ధ్రువుడు. ఆ స్తుతులకు పొంగిపోయాడు శ్రీహరి. సంతుష్టాంతరంగుడయినాడు.


‘‘భక్తా! నువ్వు కోరుకున్నది సిద్ధిస్తుంది. ఇంతకు మునుపెన్నడూ ఎవరూ అధిష్ఠించని మహోన్నతపదం నీకు ప్రసాదిస్తున్నాను. నీ పదం గ్రహనక్షత్రాది జ్యోతిశ్చక్రానికి ఆధారభూతమవుతుంది. ముల్లోకాలకూ పైన ఉండే నక్షత్రరూపులయిన మహామహులంతా నీ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు.’’ అన్నాడు శ్రీహరి.‘‘ధన్యుణ్ణి’’ అన్నాడు ధ్రువుడు.‘‘తొలుత ఈ భూమిని పరిపాలించి, తర్వాతే నేను ప్రసాదించిన మహోన్నత పదాన్ని అధిష్ఠిస్తావు. నీ కీర్తి చిరస్థాయిగా నిలుస్తుంది.’’ అన్నాడు శ్రీహరి. అదృశ్యుడయ్యాడు.సూర్యుడిలా వెలిగిపోతూ ధ్రువుడు, తల్లిదండ్రుల్ని కలిసేందుకు తిరుగు ప్రయాణమయ్యాడు. శ్రీహరి కరుణా కటాక్షాలతో కుమారుడు తిరిగి వస్తున్నాడని తెలుసుకుని, భార్యలిద్దరితోనూ, కొడుకు ఉత్తముడితోనూ ధ్రువుడికి ఎదురేగాడు ఉత్తానపాదుడు. బంగారు పల్లకీలో వచ్చాడు. మంగళవాయిద్యాలతో స్వాగతించాడు. తల్లిదండ్రుల్ని చూసి, ఆనందించాడు ధ్రువుడు. నమస్కరించాడు వారికి.  ధ్రువుణ్ణి ప్రేమగా కౌగలించుకున్నాడు తండ్రి. తమ్ముడు కూడా అతన్ని చేరదీశాడు. రాజధానికి చేరుకున్నారంతా.

ధ్రువుడికి యుక్తవయసు రాగానే అతనికి రాజ్యాన్ని అప్పగించి, తపోవనాలకు తరలిపోయాడు తండ్రి.  ద్రువుడు భ్రమిని వివాహమాడాడు. ఆమె శిశుమారుడు కుమార్తె. వాయుపుత్రి ఇలను కూడా వివాహమాడాడతను.ఉత్తముడు, హిమవత్పర్వత ప్రాంతానికి వేటకి వెళ్ళి, అక్కడ యక్షులతో పోరాడి మరణించాడు. ఎంతకీ తిరిగి రాని కుమారుణ్ణి వెదుకుతూ సురుచి బయల్దేరింది. కుమారుణ్ణి వెదుకుతూ వెదుకుతూ మరణించిందామె. సవతితల్లీ, తమ్ముడూ మరణించడంతో అందుకు కారణమయిన యక్షుల మీద కోపగించాడు ద్రువుడు. వారి మీద యుద్ధాన్ని ప్రకటించాడు. ఒకొక్కరినీ సంహరించసాగాడు. తరిగిపోతున్న యక్ష సంతతి మీద జాలి చెందాడు స్వాయంభువమనువు. తాతగా అతను ద్రువుణ్ణి వారించాడు. హింస తగదని, యుద్ధం మానమన్నాడు. మానాడు ద్రువుడు. కుబేరుడితో స్నేహం చేసుకున్నాడు. తిరిగి వెళ్ళిపోయాడు. అరవై ఆరువేల సంవత్సరాలు రాజ్యాన్ని పాలించాడు. రాజభోగాలన్నీ అనుభవించాడు. మరిక భౌతికంగా అనుభవించేదీ ఆశించేదీ లేక రాజ్యాన్ని త్యజించాడు ద్రువుడు. బదరీవనానికి వెళ్ళిపోయాడు. అక్కడ మందాకినిలో స్నానం చేసి, హరిని ధ్యానిస్తూ సమాధివిష్టుడయినాడు.కొన్నాళ్ళు గడిచింది.భౌతికదేహాన్ని త్యజించే సమయం ఆసన్నమయింది. విష్ణుదూతలు దివ్య విమానాన్ని వెంటబెట్టుకుని రావడంతో భౌతికదేహాన్ని త్యజించి, జ్యోతిర్మయమయిన దివ్య రూపాన్ని ధరించాడు ద్రువుడు. విమానాన్ని అధిరోహించాడు. సమస్త దేవతలూ, మునులూ కీర్తించగా ముల్లోకాలనూ, గ్రహమండలాన్నీ, సప్తర్షుల స్థానాన్నీ అతిక్రమించి, ఉత్తర దిక్కున అన్నిటికంటే ఎత్తున ఉండే సత్యమూ నిత్యమయిన ద్రువపదం చేరుకున్నాడు. 


స్వయం ప్రకాశిగా వెలుగొందుతూ అక్కడే స్థిరనివాసాన్ని ఏర్పరుచుకున్నాడు. ఆ క్షణం దేవదుందుభులు మోగాయి. పూలవాన కురిసింది. గంధర్వగానం వినిపించింది. ఆసరికే అతని తల్లి సునీతి స్వర్గాన్ని అలంకరించింది.ఉత్తర దిక్కున సప్తర్షి మండలానికి ఎగువున మహోన్నత స్థానంలో ద్రువనక్షత్రం అందరికీ కనిపిస్తూ నేటికీ కను విందు చేస్తున్న సంగతి తెలిసిందే! శుభప్రదమయిన ఈ నక్షత్రాన్ని నూతన వధూవరులకు చూపడం సంప్రదాయంగా వస్తోంది. అయితే గొప్ప కీడు మూడునున్నవాడికీ, అంత్యకాలం సమీపించేవాడి కీ ద్రువనక్షత్రం కనిపించదంటారు ఆర్యులు.


జగన్నాథ శర్మ, ఆంధ్రజ్యోతి 

కోదండరాం కూరెళ్ల 

https://t.me/koorellaBhagavatham

No comments:

Post a Comment