హరి హిరణ్యాక్షుల యుద్ధం.
హిరణ్యాక్షుడు ఎల్లప్పుడూ యుద్ధాన్ని కోరుకునేవాడు. అయితే అతనితో యుద్ధం చేసేందుకు ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు. దేవతలు కూడా హిరణ్యాక్షుడు కనిపిస్తే చాలు, అతనికి కనిపించక దాగునేవారు. స్వర్గ మర్త్య పాతాళలోకాల్లో తనతో యుద్ధం చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో పిచ్చెక్కినట్టయింది హిరణ్యాక్షుడికి. ‘రండిరా రండి! యుద్ధానికి రండి.’ అంటూ కేకలేస్తూ లోకాలన్నీ చుట్టబెట్టాడు. ఎవరూ రాలేదు. భూమి మీద తనతో యుద్ధం చేసేవారు ఎవరూ లేరని తెలిసి, గదాదండం గిరగిర తిప్పుతూ సముద్రంలోనికి ప్రవేశించాడతను. చాలా ఏళ్ళు జలంలో వీరవిహారం చేసి, ఆఖరికి విభావరీపురం చేరాడు. ఆ పురం వరుణుని రాజధాని. అక్కడ నిల్చుని యుద్ధానికి వరుణుని కేకేశాడు. వరుణుడొచ్చాడు. తాను యుద్ధానికి రాలేదంటూ ముందుగా చేతులు జోడించాడతను. తర్వాత ఇలా చెప్పాడు.‘‘ఈ ముల్లోకాల్లోనూ నీతో యుద్ధం చెయ్యగల సమర్థుడు ఆ విష్ణుమూర్తి ఒక్కడే! అతను వైకుంఠంలో ఉన్నాడు. వెళ్ళు. నీ బలపరాక్రమాలు చూపించు.’’ అన్నాడు. హిరణ్యాక్షునికి చావు దగ్గర పడిందని ఆనందించాడు. తనతో యుద్ధం చేసేందుకు ఇన్నాళ్ళకు ఒక్కడయినా దొరికాడని సంతోషించాడు హిరణ్యాక్షుడు. వైకుంఠానికి బయల్దేరాడు. ఆకాశమార్గాన పయనిస్తున్న హిరణ్యాక్షుని అటుగా వస్తున్న నారదమహాముని చూశాడు.‘‘మహావీరా! గదాదండం తిప్పుతూ ఎక్కడికి ఇటు? ఎవరి మీద యుద్ధానికి?’’ అడిగాడు నారదుడు.
‘‘ఎవడో విష్ణుమూర్తిట! వైకుంఠంలో ఉన్నాట్ట! నాతో యుద్ధం చేయగలిగేది వాడొక్కడే అని తెలిసింది, వాడితో యుద్ధానికి పోతున్నాను.’’ అన్నాడు హిరణ్యాక్షుడు.‘‘అలాగా’’ అని నవ్వాడు నారదుడు. తర్వాత ఇలా చెప్పాడు.‘‘నీకు కావాల్సిన విష్ణుమూర్తి ఇప్పుడు వైకుంఠంలో లేడు. పాతాళంలో ఉన్నాడు. యుద్ధం కావాలనుకుంటే నువ్వు పాతాళానికి వెళ్ళాల్సిందే!’’నారదుని మాటతో హిరణ్యాక్షుడు పాతాళానికి పరుగుదీశాడు. అక్కడ మహా తేజస్సుతో, తనంత బలంగా, తనంత ఎత్తున ఉన్న ఒక వరాహాన్ని చూశాడత ను. రసాతలంలో మునిగి ఉన్న భూమండలాన్ని యజ్ఞ వరాహరూపంలో ఉండి, కోరల కొనలతో ఎత్తుతున్నాడప్పుడు విష్ణుమూర్తి. ‘ఈ వరాహమా విష్ణుమూర్తి’ అని నవ్వుకున్నాడు హిరణ్యాక్షుడు.‘‘నువ్వేనా విష్ణుమూర్తివి? ఇలా పంది రూపంలో పాతాళంలో దాగున్నావా? నీ కోసమే వచ్చానిక్కడకి. రా! నాతో యుద్ధానికి రా.’’ పిలిచాడు హిరణ్యాక్షుడు. పట్టించుకోలేదు విష్ణుమూర్తి. భూమండలాన్ని జలమధ్యం నుండి వెలికి తీసే ప్రయత్నంలో కష్టపడుతున్నాడతను.‘‘యుద్ధానికి రమ్మంటే రావేమిటి? నిన్నే! వినిపించడం లేదా? సిగ్గూ ఎగ్గూ ఉంటే యుద్ధానికి రా.’’ రెట్టించాడు మళ్ళీ హిరణ్యాక్షుడు. అయినా విష్ణుమూర్తి నుంచి సమాధానం లేదు. శక్తియుక్తులన్నీ ఉపయోగించి, భూమండలాన్ని పైకి తీసే ప్రయత్నంలో నిమగ్నమయి ఉన్నాడు విష్ణుమూర్తి. గమనించాడది హిరణ్యాక్షుడు. ఇలా అన్నాడప్పుడు.‘‘ఆ భూమండలం అంతా నా అధీనం. దానిని దొంగిలిద్దామని ప్రయత్నిస్తున్నావేమో! జరగని పని. ఆజ్ఞాపిస్తున్నాను, ఆగిపో.’’ఆ మాటలకి కోపోద్రిక్తుడయ్యాడు విష్ణుమూర్తి. భూమిని నీటి ఉపరితలాన జాగ్రత్తగా నిలిపి ఉంచాడు. దాని ఆధారశక్తి తానై కదలకుండా చేశాడు. హిరణ్యాక్షుణ్ణి కోపంగా చూశాడు. క్షణం కళ్ళు మూసుకున్నాడు. మూసిన కళ్ళు తెరిచేసరికి అతను మణిమయ భూషణాలూ, బంగారు కవచాన్నీ ధరించి కానవచ్చాడు. చేతికి గదాదండం అందింది. మరుక్షణంలో హిరణ్యాక్షుని ఎదుర్కొన్నాడు వరాహమూర్తి. ఇద్దరూ ప్రళయ భీకరంగా యుద్ధం చేయసాగారు. కాలం కరిగిపోతోంది. రోజులూ, వారాలూ, నెలలూ గడిచిపోతున్నాయి. యుద్ధానికి అంతులేకుండాపోతోంది. ఆ యుద్ధాన్ని బ్రహ్మాది దేవతలూ, మునులూ దగ్గరుండి చూస్తూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు.
(ఆంధ్రజ్యోతి - AN Jagannatha Sharma)
కోదండరాం కూరెళ్ల
https://t.me/koorellaBhagavatham
No comments:
Post a Comment