Saturday, 12 June 2021

పోతన భాగవతం 0001

 ఋషుల కోరిక మేరకు సూతుడు తాను శుక మహర్షి ద్వారా విన్న భాగవత కథను వారికి చెప్పగా, దానిని వేదవ్యాసుడు గ్రంథస్తం చేశాడు. 


తెలియని వెలితి ఆవహించడంతో నారద మహర్షి సూచన మేరకు భగవంతుని లీలలను వర్ణించే పురాణానికి శ్రీకారం చుట్టాడు. అదే శ్రీమద్భాగవతం.


 భాగవతం లేదా భాగవత పురాణం లేదా శ్రీమద్భాగవతం. ఇది హిందూ సంప్రదాయంలో, సాహిత్యంలో, ఆలోచనా విధానంలోనూ ముఖ్యమైన ప్రభావం కలిగిన ఒక పురాణం. భగవంతుని లీలామృతంగా, శరణాగతులైన భక్తుల గాథగా, భక్తి యోగాన్ని చాటి చెప్పే ప్రాచీన గ్రంథంగా ప్రసిద్ధి చెందింది. ప్రధానంగా కృష్ణుడి లీలలు, శ్రీహరి అవతరాల గురించి ఈ గ్రంథంలో ఉంటాయి. 


భాగవతంలో అధ్యాయాలను ‘స్కంధాలు’ అంటారు. వీటిలో భగవంతుని అవతారాల వర్ణన, భక్తుల గాథలు, తత్వ బోధలు, పలు ఆరాధనా విధానాలు, ఆధ్యాత్మిక సంవాదాలను పొందుపరిచారు. ఇందులో 12 స్కంధాల్లో భగవంతుని లీలలు సవివరంగా వర్ణింపబడ్డాయి. భాగవత రసామృతాన్ని పానం చేసినవారికి మరేవి రుచించవు. వైష్ణవ సిద్ధాంతాలలో వేదాంత సూత్రాలకు భాగవత పురాణమే సహజమైన వ్యాఖ్య. అందుకే దీనిని వేదాంతసారమంటారు. 


భాగవత పురాణం సంభాషణల రూపంలో సాగుతుంది. ఒక మునిశాపం వల్ల ఏడు రోజుల లోపు మరణిస్తానని తెలిసిన అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్తు మహారాజు తన విధులను త్వజించి జీవి అంతిమ లక్ష్యాన్ని తెలుసుకోవాలని భావించాడు. అదే సమయంలో తన అపార జ్ఞాన సంపదను ఎవరికి బోధించాలో తెలియక, మంచి శిష్యుడి కోసం వెతుకుతున్న శుక మహర్షికి పరీక్షిత్తు ఎదురుపడటంతో ఆయనకు భాగవత కథలను బోధించడానికి అంగీకరిస్తాడు. ఈ సంభాషణ విరామం లేకుండా ఏడు రోజులపాటు కొనసాగింది. ఈ వారం రోజులూ రాజు నిద్రాహారాలు లేవు. నిత్యసత్యమైన భగవంతుని గురించి తెలుసుకోవడమే జీవి అంతిమ లక్ష్యమని శుకుడు వివరించాడు.


కోదండరామం  కూరెళ్ల 

https://t.me/koorellaBhagavatham

No comments:

Post a Comment