Wednesday, 16 June 2021

పోతన భాగవతం 0015

దక్షయజ్ఞం సమయంలో అవమాన భారాన్ని భరించలేని సతీదేవి అగ్నికి ఆహుతవుతుంది. సతీదేవి కళేబరాన్ని భుజంపై వేసుకున్న శంకరుడు రుద్రమూర్తియై ప్రళయ తాండవం చేస్తాడు. ఆ సమయంలో శంకరుడి తాండవం వేగానికి తట్టుకోలేని సతీదేవి శరీర భాగాలు 52 ప్రదేశాలలో పడి అవి ప్రసిద్ధ శక్తి పీఠాలుగా పేరుగాంచాయి. అలా సతీదేవి కుడికాలి బొటనవ్రేలు భాగం పడిన ప్రదేశమే "కాళీఘాట్". 

మరో కథనం ప్రకారం.. ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడుగానీ.. కూతురినీ, అల్లుడినీ పిలవలేదు, ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి..? అని సతీదేవి, శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది గాని, అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు. 

కాని సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్ధనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని(శివుని) తోడుగా దర్శనమిస్తుంది.

విశాలమైన త్రినేత్రాలతో, పొడవైన బంగారు నాలుకతో, నాలుగు చేతులతో అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో తెగిన తలను ధరించిన అమ్మవారు అభయ వరద ముద్రలతో కనువిందు చేస్తుంటారు. మోక్షాన్ని కోరే మానవుడు తనలోని అహంకారాన్ని వదిలితే కాళీమాత అభయాన్నిస్తుంది.

(AN జగన్నాథశర్మ - ఆంధ్రజ్యోతి)

కోదండరాం కూరెళ్ల 

https://t.me/koorellaBhagavatham

No comments:

Post a Comment