Saturday, 12 June 2021

పోతన భాగవతం 0002

 మరణ భయంతో ఏడు రోజుల్లో భాగవతాన్ని పూర్తిగా విన్నాడు పరీక్షిత్తు. తాను చనిపోతానని బెంగపెట్టుకోవడమే భాగవతాన్నంతటినీ అంత ఓపిగ్గా వినడానికి కారణం. అయినా మరణం రాకుండా ఆగలేదు. అది వచ్చే సమయానికి ఆయన ఆలోచనా సరళిలో మాత్రం ఎంతో మార్పు వచ్చింది. మొదట భయంతో వినడం మొదలుపెట్టిన అతడి మానసిక స్థితి- ఆ ఏడు రోజులు భాగవత ప్రవచనాలు విన్న తరవాత అత్యంత దృఢంగా మారింది. దానికి కారణం భాగవతంలో చెప్పిన విషయాల తాలూకు గాఢతే.

చాలామంది ఈ శరీరం శాశ్వతంగా ఉండిపోతుందన్న భ్రాంతిని పొందుతున్నారు. అలా అనుకోవడానికి కారణం మరణం అంటే భయంతోనే. ఎవరేమనుకున్నా మరణం వచ్చి తీరుతుంది. దేహం నశించి తీరుతుంది. అందులో ఉండే ఆత్మ మాత్రమే ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. దానికి మరణం లేదు. మమకారం అంతకంటే లేదు. ‘నేను’ అనే మమకారం శరీరం పట్లే ఎక్కువ. అది మరణం రూపంలో నశించి తీరుతుంది. కాబట్టి నిత్యమైనది, సత్యమైనది ఆత్మ అని గ్రహిస్తే మరణ భయం కలగదు. సుడిగుండం లాంటి ఈ సంసార బంధనాల్లో చిక్కుకుంటే కాలం తీరాక మరణం, మళ్ళీ జననం, మళ్ళీ అదే తాపత్రయం. దీనికి అంతుండదు. అందుకే అందులో ఏ సుఖమూ లేదన్నది ఆధ్యాత్మిక వాదుల మాట.

వీటన్నింటికీ పరిష్కారం భగవన్నామ స్మరణ. అదే సంసార సాగర తరణానికి తోవ అని సూటిగా సున్నితంగా, సుబోధకంగా భాగవతం వెల్లడిస్తుంది. ఇవన్నీ వినడం వల్ల పరీక్షిత్తుకు తెలిసిన ముఖ్యవిషయాలు- ప్రతి శరీరం లోనూ ఆత్మ ఉంటుంది.

ఆత్మకు మాత్రం చావు అనేది లేదు. పుణ్యం, యజ్ఞం, యాగం, తపస్సుల వంటివి ఏం చేసినా, కల్పాలు యుగాలు మారినా సాక్షాత్తు దేవతలే ఆ జీవి పక్షాన నిలబడినా సరే, శరీరం నశించక మానదు. కచ్చితంగా నశించి తీరుతుంది. మనిషిదే కాదు, ఏ ప్రాణి శరీరం అయినా నశించిపోవలసిందే! నశించడం అవసరం కూడా. నశించకుండా ఉండిపోతేనే ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ఇవన్నీ కాదనలేని సత్యాలు. శరీరం నశించిన తరవాత ఆత్మ మరో శరీరంలోకి ప్రవేశిస్తుందని బోధపడింది.

అవన్నీ విన్న పరీక్షిత్తు ఏడోరోజుకు నిర్మల మనస్కుడయ్యాడు. ఆ స్థితిలో అతడన్న మాట ‘ఇప్పుడు నా శరీరానికి మరణం వచ్చినా భయం లేదు. ఇపుడు నేను ఆత్మగా నిలబడబోతున్నాను’ అని. అది ఆయనలోని మార్పునకు నిదర్శనం మాత్రమేకాదు. భాగవత పఠన/శ్రవణ పటుత్వానికి నిలువెత్తు సాక్ష్యం.

భాగవతంలో ఏముంది? ధర్మం ఉంది. సత్య దర్శనం ఉంది. దాన్ని నిర్మొహమాటంగా బోధించి మనిషిని సరైన మార్గంవైపు మళ్ళించే తత్వం ఉంది. అదే సుఖజీవనానికి, తద్వారా మోక్షానికి మార్గమనే జ్ఞాన బోధ ఉంది.

అసత్య వస్తువును పట్టుకుంటే మరణ భయం కలుగుతుంది. మరణభయంలో అజ్ఞానం, అవిద్య ఉన్నాయి. అవి జీవిని అధోగతికి చేర్చుతాయి. కాబట్టి ఏది సత్యమో దాన్ని పట్టుకోగలగాలి. భాగవతాన్ని విన్నవారు లేక చదివినవారు మాత్రమే ఆ సత్యాన్ని తేలికగా పట్టుకోగలరు. దేనికైనా తట్టుకోగలరు. అలా పట్టుకునే జీవితసత్యాల గురించి భాగవతంలో ప్రతిపాదన చేశారు.

ఎవరు భాగవతాన్ని వింటున్నారో లేక చదువుతున్నారో వారికి సత్యంపట్ల పూనిక కలుగుతుంది. ఈశ్వరుడి (అంతర్యామి) పట్ల దృష్టి మరలుతుంది. ఆయన పాదాలు పట్టుకున్నవాళ్లు ఎలా తరించారో భగవంతుడి భక్తుల గాథలుగా భాగవతం బోధిస్తోంది. అంత సరళంగా భాగవతాన్ని శుక బ్రహ్మ ప్రవచనం చేశారు. దాన్ని అక్షరబద్ధం చేసింది వ్యాసభగవానుడు. మన అదృష్టం కొద్దీ ఆ జ్ఞాన సంపద మనందరికీ అందుబాటులో ఉంది. అందుకోగలిగిన వారికి ఆనందం కలుగుతుంది. అందుకోలేనివారికి అయోమయం మిగులుతుంది.

(అయ్యగారి శ్రీనివాసరావు గారి ఈనాడులో వ్యాసం)


కోదండరామం  కూరెళ్ల 

https://t.me/koorellaBhagavatham

No comments:

Post a Comment