Wednesday, 23 June 2021

పోతన భాగవతం 0018 పృథు చక్రవర్తి

 ద్రువుని అనంతరం ఆ వంశంలో చెప్పుకోదగినవాడు పృథు చక్రవర్తి.వేనుడు రాజ్యం చేస్తున్న కాలంలో ప్రజలు అనేక విధాల బాధలు అనుభవించారు. మునులనూ, బ్రాహ్మణులనూ నానా విధాల వేధించాడు వేనుడు. యజ్ఞయాగాదులు లేకుండా చేశాడు. దానధర్మాల జోలికి పోలేదు. దాంతో భూమి మీద అన్యాయం, అధర్మం ప్రబలిపోయాయి. రాజ్యం అతలాకుతలమయింది. అది తట్టుకోలేని మునులంతా వేనుణ్ణి సమీపించారు. ధర్మాని ఉద్ధరించమని ప్రార్థించారు. వారి ప్రార్థనను పట్టించుకోలేదు వేనుడు. పెడ చెవిన పెట్టాడు. మునులకు కోపం వచ్చింది. శపించారతన్ని. శాపకారణంగా వేనుడు మృతి చెందాడు. అతనికి పుత్రసంతానం లేని కారణంగా రాజ్యానికి రాజు లేకుండా పోయాడు. రాజు లేని రాజ్యంలో ధర్మాలన్నీ మరింతగా తలకిందులయ్యాయి. వాటిని అరికట్టేందుకు రాజుని సృజించాలనుకున్నారు మునులు. వేనుడి మృతదేహాన్ని తీసుకుని, అతని తొడని మథించారు. అప్పుడు అందులోంచి బాహుకుడు పుట్టుకొచ్చాడు. చాలా వికృతంగా కనిపించాడతను.


రాజయ్యే లక్షణాలు లేవతనిలో. నిషాదులకు మూల పురుషుడుగా మిగిలిపోయాడు. ఈసారి వేనుని బాహువులు మథించారు మునులు. అప్పుడు ఒక స్త్రీ, ఒక పురుషుడూ ఉద్భవించారు. ఇద్దరూ భగవదంశతో జన్మించిన వారే! ఆ పురుషుడే పృథువు. శ్రీమన్నారాయుణుని అంశతో జన్మించిన పృథువు, సాక్షాత్తూ లక్ష్మీదేవి అంశతో జన్మించిన స్త్రీని, ‘అర్చి’ని వివాహమాడాడు. ఆనాడు ఆ వివాహం మునులకూ, దేవతలకూ, సర్వులకూ కనుల పండువయింది. సంతోషించారంతా.

ప్రజాక్షేమాన్ని ఆశించే రాజు కోసం, ధర్మం నెలకొల్పే రాజు కోసం మునులు వేనుని బాహువులు మథించగా అప్పుడు ఒక స్త్రీ, ఒక పురుషుడూ ఉద్భవించారు. ఇద్దరూ భగవదంశతో జన్మించిన వారే! ఆ పురుషుడే పృథువు. శ్రీమన్నారాయుణుని అంశతో జన్మించిన పృథువు, సాక్షాత్తూ లక్ష్మీదేవి అంశతో జన్మించిన స్త్రీని, ‘అర్చి’ని వివాహమాడాడు. ఆనాడు ఆ వివాహం మునులకూ, దేవతలకూ, సర్వులకూ కనుల పండువయింది. సంతోషించారంతా. పుడమికి రాజయినాడు పృథువు. మునీశ్వరులు అతన్ని అభిషేకించారు. అష్టదిక్పాలకులూ అతనికి అద్భుతమయిన కానుకలు అందజేశారు. కానుకల రూపేణా పృథువుకి దివ్యమయిన ఆయుధాలు లభించాయి. భూలోకంలో అఖండమయిన కీర్తిని ఆర్జించిన వారిలో ప్రథముడు పృథువు. ధరాన్ని ప్రతిష్ఠించాడతను. ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు.పృథువు రాజ్యాన్ని చేపట్టే నాటికి లోకంలో ప్రజలంతా చెప్పలేనన్ని ఈతి బాధలు అనువిభవిస్తూ ఉన్నారు. అన్నం లేక అలమటిస్తూ ఉన్నారు.‘‘మహారాజా! మాకింత అన్నం పెట్టి, మమ్మల్ని కాపాడు.’’ పృథు చక్రవర్తిని వేడుకున్నారు ప్రజలు. పిడికెడు మెతుకులు దొరకని ఈ కరువేమిటి? ఎందుకొచ్చి పడిందని ఆలోచించాడు పృథువు. సమస్త ఓషధులనూ భూమి హరించి వేయడంతోనే ఈ అవస్థ వచ్చి పడిందని అర్థం చేసుకున్నాడతను. పట్టరాని కోపం కలిగింది. భూమిని సంహరించడానికి ధనుర్బాణాలు అందుకున్నాడు. బాణాన్ని సంధించాడో లేదో భూదేవి గో రూపం ధరించి, భయంతో పరుగందుకుంది. ఆమె వెంటపడ్డాడు పృథువు. భూదేవి సమస్తలోకాలూ తిరిగింది. రక్షించమని ఎందరినో వేడుకుంది. ఎవరూ రక్షించలేకపోయారామెను.


వెంటపడి తరుముకు వస్తూన్న పృథువుని అడ్డగించలేకపోయారు. చేసేది లేక ప్రాణభిక్ష పెట్టమని పృథువుని ప్రార్థించింది భూదేవి.‘‘ఓషధులన్నీ గర్భంలో దాచుకుని, ధాన్యాదులు ఇవ్వకుండా కరువు తెచ్చిపెట్టావు. ఇప్పటికయినా మించిపోయింది లేదు, నా ప్రజలందరికీ జీవనాధారం చూపించు. కాదన్నావా, నిన్ను సంహరించి తీరుతాను. హరిహరాదులు కూడా నిన్ను కాపాడలేరు.’’ గర్జించాడు పృథువు. చావు నుంచి తప్పించుకునేందుకు భూదేవి రకరకాలుగా పృథువుని స్తుతించింది. పట్టించుకోలేదతను. పట్టిన పట్టు వీడలేదు. అప్పుడిలా అంది భూదేవి.‘‘మహారాజా! నీ ముందు రాజులు నన్ను అలక్ష్యం చేశారు. జీవనాధారమయిన ఓషధులన్నీ దుర్మార్గుల పరం చేశారు. దానిని నేను తట్టుకోలేకపోయాను. దుర్మార్గుల చేతికి చిక్కకుండా ఓషధులన్నిటినీ నేనే స్వీకరించాను. వాటిని నా గర్భంలో దాచి పెట్టాను. అయితే ఇది జరిగి చాలా రోజులయిన కారణంగా, ఇప్పుడు ఆ ఓషధులు నాలో క్షీణించాయి.’’‘‘అబద్ధం’’ గర్జించాడు పృథువు.‘‘లేదు మహారాజా, నిజమే చెబుతున్నాను. కోపించకు. ఇప్పుడు నీకు ఆ ఓషధులు కావాలంటే నేను ఓ ఉపాయం చెబుతాను, విను.’’‘‘చెప్పు’’‘‘నేనిప్పుడు గోరూపంలో ఉన్నాను కదా, నాకు ఓ దూడనూ, పాలపాత్రనూ, పాలు పితికేవాణ్ణీ సృష్టించు. పాల రూపంలో సమస్త ఓషధులనూ నీకు అందజేస్తాను. అలాగే పర్వతాదులతో హెచ్చు తగ్గులుగా ఉన్న నన్ను చక్కగా చదును చెయ్యి. అలా చేస్తే వర్షం నీరు వృథాపోదు, సమతలంగా ఉన్న నాలోనే నీరంతా ఉంటుంది. ఏమంటావు?’’ అడిగింది భూదేవి.ఆవేశపడకుండా ఆలోచించాడు పృథువు. భూదేవి చెప్పినట్టుగా చేసేందుకు సిద్ధమయ్యాడు. స్వయంభువ మనువును దూడగా మార్చాడు. తన చేతుల్నే పాలపాత్రగా మర్చాడు. తానే పాలను పితికేవాడై, భూదేవి పొదుగు నుండి పాలను పితకాడు. పాత్ర నిండుగా పాలు పితికాడు. సమస్త ఓషధులతో నిండిన ఆ పాలను, భూమి అంతటా జల్లాడు. అంతలో దేవతలూ, మునులూ వచ్చారక్కడకి.


భూదేవి నుండీ తామూ తమకు కావాల్సినవి పితుక్కుంటామన్నారు. అభ్యంతరం చెప్పలేదు పృథువు. అంగీకరించాడందుకు. వశిష్ఠాది మునులంతా బృహస్పతిని దూడగా చేసి, ఇంద్రియాలను పాత్రను చేసి చంధోమయమైన పాలను పితికారు. దేవతలు ఇంద్రుని దూడను చేసి, బంగారు కలశంలో అమృతాన్ని పితుక్కున్నారు. దానవులు ప్రహ్లాదుని దూడను చేసి, ఇనుప పాత్రలో గౌడి, పైష్ఠి, మాధ్వి అని మూడు రకాల మద్యాన్ని పితుక్కున్నారు. గంధర్వులు విశ్వావసును దూడను చేసి, పద్మాన్ని పాత్ర చేసి, అందులో వాంగ్మాధుర్యాన్ని పాలగా పితికారు. పితృదేవతలు సూర్యుణ్ణి దూడను చేసి, మట్టిపాత్రలో అన్నాన్ని పితుక్కున్నారు. కపిలుని గోవుగా చేసి, ఆకాశాన్ని పాత్రను చేసి, సిద్ధులు అణిమాదిసిద్ధులు పితుక్కున్నారు. విద్యాధరులు ఆకాశగమనం మొదలయిన విద్యలను పితుక్కున్నారు. మయుని దూడను చేసి మాయావులు ఇంద్రజాలాది విద్యలను పితుక్కున్నారు. యక్ష రాక్షస భూత పిశాచాదులు రుద్రుని దూడను చేసి, కపాలాన్ని పాత్రను చేసి, మద్యంలాంటి మత్తు కలిగించే రక్తాన్ని పితుక్కున్నారు. సర్పాలు తక్షకుణ్ణి దూడను చేసి, రంధ్రాలనే పాత్రలో విషతుల్యమయిన పాలను పితుక్కున్నారు. పశువులు శివుని వాహనం నందిని దూడను చేసి, అరణ్యం పాత్రలో తృణాదులను పితుక్కున్నారు. హిమవంతుని దూడను చేసి, సానువులను పాత్ర చేసి, పర్వతాలు గౌరవాది ధాతువుల్ని పితుక్కున్నాయి. ఇలా పదిమందీ పదిరకాలుగా భూదేవిని పిండి వారికి కావాల్సినవి అందుకున్నారు. నిష్క్రమించారక్కణ్ణుంచి. అప్పటి నుంచీ భూదేవిని కన్నకూతురులా ప్రేమగా  చూడసాగాడు పృథువు. ఎగుడు దిగుళ్ళన్నీ సమం చేశాడు.

పోతన భాగవతం 0017 ధ్రువోపాఖ్యానం

 సర్వోతృష్టమయినది భగవద్భక్తి. ఆ హరిభక్తునికి అందనిదేదీ లేదు. అది చెప్పేందుకే ఇప్పుడీ ధ్రువోపాఖ్యానం. ద్రువం అంటే శాశ్వతమయినదీ, సత్యమయినదీ అని అర్థం. ధ్రువ నక్షత్రం అన్నింటి కంటే ఎత్తున ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటుంది. సప్తర్షులూ, సూర్యచంద్ర గ్రహ నక్షత్ర తారకాగణం యావత్తూ ఈ ధ్రువ నక్షత్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటాయి. కాలగణనలోనూ, ఖగోళశాస్త్రంలోనూ ధ్రువనక్షత్రానిదే ప్రముఖ పాత్ర. భాగవతంలో ధ్రువుని కథ విశిష్టమయినది. విశేషించి చెప్పుకోదగినది. మరందుకే వినండి!స్వయంభువ మనువు కుమారుడు ఉత్తానపాదుడు. అతనికి సునీతి, సురుచి అని ఇద్దరు భార్యలు. పెద్దభార్య సునీతి సద్గుణశీల సంపన్నురాలు. చిన్నభార్య సురచి మహా సౌందర్యవతి. సునీతికి ధ్రువుడు పుడితే, సురుచికి ఉత్తముడు జన్మించాడు. ఉత్తానపాద మహారాజుకి మహా సౌందర్యవతి సురుచి అంటే ప్రేమ ఎక్కువ. ఆమెను అధికంగా ప్రేమిస్తూ సునీతిని దూరం చేయసాగాడు. తల్లితో పాటు బిడ్డడు ధ్రువుణ్ణి కూడా అలక్ష్యం చేశాడు.ఒకనాడు సురుచి కుమారుడు ఉత్తముణ్ణి తొడపై కూర్చోపెట్టుకుని, వాణ్ణి ముద్దాడసాగాడు ఉత్తానపాదుడు. చూశాడది ధ్రువుడు. పసివాడయిన తననీ తండ్రి అలా ముద్దాడితే బాగుణ్ణనిపించింది. పరుగున వచ్చాడు. తండ్రి తొడ ఎక్కి కూర్చోబోయాడు. సింహాసనం మీద కూర్చున్న తండ్రి తొడ అందడం లేదు. తండ్రి చేయందిస్తాడేమోనని చూశాడు ధ్రువుడు. తండ్రి చేయందించలేదు సరికదా, పట్టించుకోలేదసలు. అది అనువుగా తీసుకుంది అక్కడే ఉన్న సురుచి. ధ్రువుణ్ణి పురుగును చూసినట్టుగా చూసింది. అసహ్యించుకుంది. సింహాసనం మీదికి ఎగబాకుతున్న ధ్రువుణ్ణి  రెక్క పుచ్చుకుని బలంగా ఇవతలికి లాగి పారేసింది.కోపంగా ఇలా అంది.


‘‘నువ్వేంటో నీ బతుకేంటో తెలుసుకోకుండా మహారాజు తొడను ఎక్కేందుకు ప్రయత్నిస్తావా? ఆ తొడను ఎక్కేందుకు ఒక్కడే అర్హుడు. వాడు నా కొడుకు ఉత్తముడొక్కడే! నీకా యోగ్యత ఈ జన్మలో లేదు. ఇంకో విషయం కూడా తెలుసుకో! రాజార్హత ఉన్న వాడే మహారాజు తొడనెక్కి కూర్చోగలగాలి. నీకా అర్హత కూడా లేదు. అధమురాలు సునీతి కడుపున పుట్టిన నీకు మహరాజయోగం లేదు. రాదు. వెళ్ళిక్కణ్ణుంచి.’’పినతల్లి మాటలు ధ్రువుడి మనసుని బాణాల్లా గాయం చేశాయి. విలవిల్లాడాడు. అనరాని మాటలని తనని సవతి తల్లి హింసిస్తున్నా పట్టించుకోని తండ్రిని చూసి మరింతగా బాధపడ్డాడు. ఏడుపొచ్చింది. ఏడుస్తూ తల్లిని సమీపించాడు ధ్రువుడు. ‘‘ఏంటమ్మా ఇది? నాన్నాగారి తొడ మీద కూర్చునే భాగ్యం నాకు లేదా? నేను అందుకు యోగ్యుణ్ణి కానా? ఉత్తముడూ నేనూ ఒకటి కాదా? నన్నెందుకు పిన్నమ్మ కసిరి కొట్టింది? పిన్నమ్మ నన్ను అనరాని మాటలని హింసిస్తుంటే నాన్నెందుకు కల్పించుకోలేదు? ఊరుకున్నారెందుకు? ఎందుకమ్మా మనం అంటే ఇంత చులకన?’’ అడిగాడు. సమాధానంగా సునీతి ముందు పెద్దగా ఏడ్చింది. తర్వాత ఇలా అంది. 

తప్పు మీ పిన్నిది కాదు నాయనా! తప్పంతా మహారాజుదే! ఆయనే మనల్ని నిరాదరిస్తున్నారు. నన్ను తన భార్యగా చెప్పుకోవడం మహారాజుకి సిగ్గుచేటు. ఏం చేస్తాం, అంతా మన ఖర్మ.’’భార్యని భార్యగా చెప్పుకోవడం మహారాజుకి ఎందుకు సిగ్గుచేటు? ఆలోచించసాగాడు ధ్రువుడు. ఆ పసివాణ్ణి అట్టే ఆలోచించనీయలేదు తల్లి. ఏడుస్తూ అంతలోనే ఇలా అంది.‘‘కొందరు పుట్టుకతోనే కష్టాలూ కన్నీళ్ళూ వెంటబెట్టుకుని పుడతారు. వారిలో నేనొకదాన్ని. నా కడుపున నువ్వు పుట్టావు. అదే నువ్వు చేసిన నేరం. పెద్ద పాపం.’’‘అవునా’ అన్నట్టుగా చూశాడు ధ్రువుడు. కన్నీరు తుడుచుకుంది సునీతి. చెప్పిందిలా.


‘‘సింహాసనం మీద కూర్చున్న తండ్రి తొడను ఎక్కలేదే అన్న బాధే కనుక నిజంగా నీకు ఉంటే బాధపడకు. నేనో మాట చెబుతాను, వింటావా?’’‘‘చెప్పమ్మా’’‘‘దేవాదిదేవుడు ఆ శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధించు. అతన్ని వేడుకుంటే నాన్నగారి తొడ మీదే కాదు, నాన్నగారి సింహాసనం మీదే నువ్వు కూర్చునే అవకాశం, అదృష్టం లభిస్తాయి. బ్రహ్మాది దేవతలెందరో హరిని పూజించి, అందరాని అదృష్టాలు అందుకున్నారు. ఆలస్యం చెయ్యకు, వెళ్ళు. నిండు గుండెతో విష్ణువుని పూజించు. అతని కరుణా కటాక్షం కోసం తపస్సు చెయ్యి.’’ చెప్పింది సునీతి. ఆ మాటలు మంత్రోపదేశం అయ్యాయి. అంతే! అయిదేళ్ళు కూడా నిండని  ధ్రువుడు అక్కణ్ణుంచి కదలి, అరణ్యమార్గం పట్టాడు. కాకులు దూరని కారడవిలో ఒంటరిగా నడచి వెళ్ళసాగాడు. అది గమనించాడు నారదుడు. ఆకాశం నుంచి కిందికి దిగాడు. ధ్రువునికి ఎదురయ్యాడు.‘‘అయిదేళ్ళయినా లేవు. చూడబోతే రాకుమారుడిలా ఉన్నావు. ఎక్కడికయ్యా ఈ కీకారణ్యంలోకి?’’ అడిగాడు నారదుడు.‘‘తమకు తెలియనిదేమున్నది మునీంద్రా? నా సవతితల్లి నన్ను అవమానించింది. నా గుండెను గాయం చేసింది. తట్టుకోలేకపోతున్నాను, తపస్సు చేసుకునేందుకు పోతున్నాను.’’ అన్నాడు ధ్రువుడు. ‘‘తపస్సా?’’ ఆశ్చర్యపోయాడు నారదుడు. తర్వాత పగలబడి నవ్వి, ఇలా అన్నాడు.‘‘ఏది మంచో ఏది చెడో తెలియని వయసు నీది. ఈ వయసులో తపస్సు చేస్తానంటున్నావు, సాధ్యమా?’’‘ఎందుక్కాదు మునీంద్రా?’ అన్నట్టుగా చూశాడు ధ్రువుడు.‘‘మహా మహాయోగులకు కూడా లభించని భగవత్‌ సాక్షాత్కారం నీకు లభిస్తుందని నువ్వు ఎలా అనుకుంటున్నావు? తపోనిష్ఠను తట్టుకోవడం చాలా కష్టం. అది నీ వల్ల కాదుగాని, నా మాట విను. ఎలా వచ్చావో అలాగే తిరిగి వెళ్ళిపో!’’ అన్నాడు నారదుడు. అతన్ని సన్నగా నవ్వుతూ చూశాడు ధ్రువుడు.


‘‘వెళ్ళను మునీంద్రా! సవతితల్లి అవమానాన్ని తట్టుకుని బతకలేను. ఆ అంతఃపురంలో అడుగు పెట్టలేను.’’ అన్నాడు. గట్టి నిర్ణయం మీద ఉన్నట్టుగా గుండె నిండుగా ఊపిరి పీల్చి వదిలాడు.‘‘తండ్రి తొడని అధిరోహించడం కాదు, వారి సింహాసనాన్ని అధిష్ఠించడం అంతకంటే కాదు. ఇంతకు ముందు మా పెద్దలెవరూ పొందని ఉత్తమపదం నేను పొందాలి. దాన్ని నేను సాధించాలి. సాధించే మార్గం చెప్పండి మునీంద్రా.’’ నారదుడికి చేతులు జోడించి నమస్కరించాడు ధ్రువుడు.‘‘పరమ భాగవతోత్తములు. బ్రహ్మమానస పుత్రులు. మీరే నాకు దిక్కు. కర్తవ్యాన్ని బోధించండి.’’ ప్రార్థించాడు.వజ్రసంకల్పంతో వన్నె తేరిన ధ్రువుణ్ణి చూసి సంతోషించాడు నారదుడు.‘‘నీ దీక్ష మహదాశ్చర్యాన్ని కలిగిస్తున్నది. నీ కోరిక తీరాలంటే ఒకటే మార్గం, నీ తల్లి చెప్పినట్టుగా నువ్వు ఆ దేవదేవుణ్ణి, శ్రీహరిని ధ్యానించి తీరాలి. మరో దిక్కు లేదు.  వెళ్ళు, నిశ్చల మనస్కుడవై శ్రీహరిని ధ్యానించు.’’ అన్నాడు నారదుడు. తపోనిష్ఠకు సంబంధించిన విధి విధానాన్ని చెప్పాడు. భక్తితత్త్వాన్ని బోధించాడు. వాసుదేవుని ద్వాదశాక్షర మంత్రం ఉపదేశించాడు. 

‘‘నాయనా! నిష్ఠతో ఈ మంత్రాన్ని జపించు. నీ కోరిక సిద్ధిస్తుంది.’’ అన్నాడు నారదుడు.‘‘ధన్యుణ్ణి మునీంద్రా’’ అన్నాడు ధ్రువుడు. నారదునికి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. తర్వాత మధువనికి తరలిపోయాడు.భార్య సురుచి చేసిన అవమానాన్ని తట్టుకోలేక, కొడుకు ధ్రువుడు తపోవనాలకు తరలిపోయాడని తెలిసి, తండ్రి ఉత్తానపాదుడు తీవ్రంగా దుఃఖించాడు. జరిగిన దానిలో తన తప్పూ ఉన్నదని బాధపడ్డాడు. నిరాహారంతో ధ్రువుడు ఎన్నాళ్ళు బతికి ఉంటాడు? అసలు బతికి ఉన్నాడో లేదో? ఈ సరికి ఏ వన్యమృగం నోట పెట్టుకున్నదో? అని వాపోయాడు రాజు. కన్నీరు పెట్టుకు కూర్చున్నాడు. అప్పుడక్కడ నారదుడు ప్రత్యక్షమయ్యాడు.‘‘నీ కొడుకు ధ్రువుడు దేవతలూ మునులూ సాధించలేని గొప్ప కార్యాన్ని సాధిస్తాడు. ముల్లోకాల్లో కీర్తి గడిస్తాడు.’’ అని చెప్పాడు. అయినా కొడుకుని దూరం చేసుకున్న దుఃఖం ఉత్తానపాదుణ్ణి నిలువనీయలేదు. రాజ్యభోగాలకు దూరమయ్యాడతను. నిరక్తుడయిపోయాడు.కాలం గడుస్తోంది.మధువనానికి చేరుకున్నాడు ధ్రువుడు. కాళిందీనదిలో స్నానం చేశాడు. దీక్ష చేపట్టాడు. నారదుడు ఉపదేశించినట్టుగా తపస్సు ప్రారంభించాడు.మూడు రోజులకొకసారి దొరికిన కాడికి పళ్ళు తినేవాడు. అలా ఓ నెల రోజులు గడిపాడు. తర్వాత నెల ఆరు రోజులకొకసారి ఆకులూ అలములూ తింటూ గడిపాడు. ఆ తర్వాతి నెల తొమ్మిది రోజులకొకసారి మంచితీర్థం పుచ్చుకుంటూ గడిపి, ఆ పైనెల పన్నెండు రోజులకొకసారి వాయుభక్షణ చేస్తూ గడిపాడు. నాలుగు నెలలు అలా పూర్తి చేసి, అయిదవ నెలలో ఉచ్ఛ్వాస నిశ్వాసలు నిరోధించాడు. 


పంచప్రాణాల్నీ బిగబట్టాడు. ఒంటికాలిపై నిలుచుని, నిశ్చలుడయినాడు. స్థాణువయ్యాడు. శ్రీహరిని ప్రార్థిస్తూ చాలా ఏళ్ళు అలా తపస్సు చేశాడు ధ్రువుడు. అయినా భగవత్‌ సాక్షాత్కారం లభించలేదు. కాలి బొటన వేలు మీద నిలబడి తపస్సు ప్రారంభించాడు. ఘోర తపస్సు చేపట్టాడు. ఆ తపస్సుకీ, బొటన వేలితో నొక్కిపెడుతున్న బాధకీ భూమి వణకి పోసాగింది. సురలూ, మునులూ భ యకంపితులయినారు. లోకంలో ప్రాణి కోటి అంతా ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయింది. దేవతలకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. శ్రీమన్నారాయుణ్ణి శరణు కోరారు. కాపాడమని ప్రార్థించారు. అభయాన్ని ప్రసాదించాడు శ్రీహరి. శంకు చక్రాలు దాల్చి, గరుడవాహనారూఢుడై మధువనానికి బయల్దేరాడు. చేరుకున్నాడక్కడకి.‘‘భక్తా’’ పిలిచాడు. ఆ పిలుపునకు కళ్ళు తెరచి, శ్రీమన్నారాయుణుని చూశాడు ధ్రువుడు. ఆనందంతో కన్నీరు పెట్టుకున్నాడు. చేతులు జోడించి, సాష్టాంగప్రణామం చేశాడు. తర్వాత లేచి ఆ దేవదేవుణ్ణి ఏమని స్తుతించాలో, ఎలా స్తుతించాలో తెలియక చూస్తూ నిల్చున్నాడు. అయిదేళ్ళ పసివాడికి అనంతుని ఆరాధనలు ఎలా తెలుస్తాయి? నవ్వుకున్నాడు శ్రీహరి. నవ్వుతూనే ధ్రువుడి చెక్కిళ్ళు నిమిరాడు. తర్వాత వేదమయమయిన శంఖాన్ని తాకించాడతనికి. ఎప్పుడయితే శ్రీహరి చెక్కిళ్ళు నిమిరి, శంఖాన్ని తాకించాడో అప్పుడు ధదివ్యజ్ఞానం కలిగింది. సరస్వతి జిహ్వాగ్రంపై నాట్యం చేయడంతో వేదసూక్తాలతో శ్రీమన్నారాయునిని వేయి విధాల స్తుతించాడు ధ్రువుడు. ఆ స్తుతులకు పొంగిపోయాడు శ్రీహరి. సంతుష్టాంతరంగుడయినాడు.


‘‘భక్తా! నువ్వు కోరుకున్నది సిద్ధిస్తుంది. ఇంతకు మునుపెన్నడూ ఎవరూ అధిష్ఠించని మహోన్నతపదం నీకు ప్రసాదిస్తున్నాను. నీ పదం గ్రహనక్షత్రాది జ్యోతిశ్చక్రానికి ఆధారభూతమవుతుంది. ముల్లోకాలకూ పైన ఉండే నక్షత్రరూపులయిన మహామహులంతా నీ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు.’’ అన్నాడు శ్రీహరి.‘‘ధన్యుణ్ణి’’ అన్నాడు ధ్రువుడు.‘‘తొలుత ఈ భూమిని పరిపాలించి, తర్వాతే నేను ప్రసాదించిన మహోన్నత పదాన్ని అధిష్ఠిస్తావు. నీ కీర్తి చిరస్థాయిగా నిలుస్తుంది.’’ అన్నాడు శ్రీహరి. అదృశ్యుడయ్యాడు.సూర్యుడిలా వెలిగిపోతూ ధ్రువుడు, తల్లిదండ్రుల్ని కలిసేందుకు తిరుగు ప్రయాణమయ్యాడు. శ్రీహరి కరుణా కటాక్షాలతో కుమారుడు తిరిగి వస్తున్నాడని తెలుసుకుని, భార్యలిద్దరితోనూ, కొడుకు ఉత్తముడితోనూ ధ్రువుడికి ఎదురేగాడు ఉత్తానపాదుడు. బంగారు పల్లకీలో వచ్చాడు. మంగళవాయిద్యాలతో స్వాగతించాడు. తల్లిదండ్రుల్ని చూసి, ఆనందించాడు ధ్రువుడు. నమస్కరించాడు వారికి.  ధ్రువుణ్ణి ప్రేమగా కౌగలించుకున్నాడు తండ్రి. తమ్ముడు కూడా అతన్ని చేరదీశాడు. రాజధానికి చేరుకున్నారంతా.

ధ్రువుడికి యుక్తవయసు రాగానే అతనికి రాజ్యాన్ని అప్పగించి, తపోవనాలకు తరలిపోయాడు తండ్రి.  ద్రువుడు భ్రమిని వివాహమాడాడు. ఆమె శిశుమారుడు కుమార్తె. వాయుపుత్రి ఇలను కూడా వివాహమాడాడతను.ఉత్తముడు, హిమవత్పర్వత ప్రాంతానికి వేటకి వెళ్ళి, అక్కడ యక్షులతో పోరాడి మరణించాడు. ఎంతకీ తిరిగి రాని కుమారుణ్ణి వెదుకుతూ సురుచి బయల్దేరింది. కుమారుణ్ణి వెదుకుతూ వెదుకుతూ మరణించిందామె. సవతితల్లీ, తమ్ముడూ మరణించడంతో అందుకు కారణమయిన యక్షుల మీద కోపగించాడు ద్రువుడు. వారి మీద యుద్ధాన్ని ప్రకటించాడు. ఒకొక్కరినీ సంహరించసాగాడు. తరిగిపోతున్న యక్ష సంతతి మీద జాలి చెందాడు స్వాయంభువమనువు. తాతగా అతను ద్రువుణ్ణి వారించాడు. హింస తగదని, యుద్ధం మానమన్నాడు. మానాడు ద్రువుడు. కుబేరుడితో స్నేహం చేసుకున్నాడు. తిరిగి వెళ్ళిపోయాడు. అరవై ఆరువేల సంవత్సరాలు రాజ్యాన్ని పాలించాడు. రాజభోగాలన్నీ అనుభవించాడు. మరిక భౌతికంగా అనుభవించేదీ ఆశించేదీ లేక రాజ్యాన్ని త్యజించాడు ద్రువుడు. బదరీవనానికి వెళ్ళిపోయాడు. అక్కడ మందాకినిలో స్నానం చేసి, హరిని ధ్యానిస్తూ సమాధివిష్టుడయినాడు.కొన్నాళ్ళు గడిచింది.భౌతికదేహాన్ని త్యజించే సమయం ఆసన్నమయింది. విష్ణుదూతలు దివ్య విమానాన్ని వెంటబెట్టుకుని రావడంతో భౌతికదేహాన్ని త్యజించి, జ్యోతిర్మయమయిన దివ్య రూపాన్ని ధరించాడు ద్రువుడు. విమానాన్ని అధిరోహించాడు. సమస్త దేవతలూ, మునులూ కీర్తించగా ముల్లోకాలనూ, గ్రహమండలాన్నీ, సప్తర్షుల స్థానాన్నీ అతిక్రమించి, ఉత్తర దిక్కున అన్నిటికంటే ఎత్తున ఉండే సత్యమూ నిత్యమయిన ద్రువపదం చేరుకున్నాడు. 


స్వయం ప్రకాశిగా వెలుగొందుతూ అక్కడే స్థిరనివాసాన్ని ఏర్పరుచుకున్నాడు. ఆ క్షణం దేవదుందుభులు మోగాయి. పూలవాన కురిసింది. గంధర్వగానం వినిపించింది. ఆసరికే అతని తల్లి సునీతి స్వర్గాన్ని అలంకరించింది.ఉత్తర దిక్కున సప్తర్షి మండలానికి ఎగువున మహోన్నత స్థానంలో ద్రువనక్షత్రం అందరికీ కనిపిస్తూ నేటికీ కను విందు చేస్తున్న సంగతి తెలిసిందే! శుభప్రదమయిన ఈ నక్షత్రాన్ని నూతన వధూవరులకు చూపడం సంప్రదాయంగా వస్తోంది. అయితే గొప్ప కీడు మూడునున్నవాడికీ, అంత్యకాలం సమీపించేవాడి కీ ద్రువనక్షత్రం కనిపించదంటారు ఆర్యులు.


జగన్నాథ శర్మ, ఆంధ్రజ్యోతి 

కోదండరాం కూరెళ్ల 

https://t.me/koorellaBhagavatham

Wednesday, 16 June 2021

పోతన భాగవతం 0016

యోగసమాధిలో ఉన్న శివునికి సంగతంతా తెలిసింది. యోగాగ్నిలో సతీదేవి దేహత్యాగం, ప్రమథుల పరాజయం తెలిసి, కోపం తెచ్చుకున్నాడతను. కళ్ళు తెరిచాడు. దిగ్గున లేచి నిల్చున్నాడు. ప్రళయ తాండవం చేశాడు. ఆ తాండవంలో శిరస్సున జట ఒకటి తెంచి, భూమి మీదకి విసిరాడు. భయంకరంగా సింహంలా గర్జించాడు. చూస్తూండగానే జట నుండి మంటలు చెలరేగాయి. అంతెత్తున లేచాయవి. ఆకాశాన్ని దహించేట్టుగా నాలికలు చాపాయి. 

ఆ మంటల్లోంచి అప్పుడు వీరభద్రుడు పుట్టాడు. వెయ్యి చేతులు, భయంకరంగా కోరలు, నల్లటి దేహంతో ఆకాశం అంత ఎత్తుగా నిలిచాడు వీరభద్రుడు. నిప్పులు చెరగుతున్న మూడు కళ్ళు, అగ్ని జ్వాలల్లా ఎగిసిపడుతున్న జటలు, వెయ్యి చేతుల్లోనూ త్రిశూలాది ఆయుధాలు, మెడలో కపాల మాలికలతో అరివీర భయంకరంగా ప్రత్యక్షమయ్యాడు వీరభద్రుడు. శివునికి సాష్టాంగ ప్రణామం చేశాడు.‘‘దేవా! ఆజ్ఞ’’ అన్నాడు.‘‘తక్షణం నువ్వు ప్రమథగణాలతో బయల్దేరి, దక్షుని యజ్ఞం ధ్వంసం చెయ్యి. బ్రాహ్మణ తేజం నిన్నేమీ చేయలేదు. నా అంశతో పుట్టిన నీకు ఎక్కడా ఎదురుండదు. వెళ్ళు.’’ ఆజ్ఞాపించాడు శివుడు.

లేచి నిల్చున్నాడు వీరభద్రుడు. శివునికి ప్రదక్షిణం చేశాడు. పెద్దగా కేకపెట్టాడు. అతని కేకకి సకల లోకాలూ తల్లడిల్లాయి. గాయాలపాలయి, కసితో ఉన్న ప్రమథగణాలను చూశాడు. ‘పదండి’ అన్నట్టుగా కళ్ళెగరేశాడు. కదిలాడక్కణ్ణుంచి. వీరభద్రుడు నడుస్తోంటే మృత్యుధూళి జగం అంతా నిండిపోయింది. దక్షుని యజ్ఞవాటికకు చేరుకున్నాడతను. వీరభద్రుణ్ణి చూస్తూనే దక్షుడు సహా దేవతలూ, మునులూ గజగజా వణకిపోయారు. 

వీరభద్రుని అండ చూసుకుని ప్రమథులు రెచ్చిపోయారు. యజ్ఞశాలల్ని ధ్వంసం చేశారు. హోమకుండాల్ని చల్లార్చారు. వేదికల్ని పెకిలించి వేశారు. హోమద్రవ్యాల్ని విసిరి వేశారు. 

మునులనూ, దేవతలనూ కసిదీరా కొట్టి తిట్టి బాధించారు. కళ్ళెదుట భర్తలు చావుదెబ్బలు తింటుంటే చూడలేక మునిపత్నులూ, సురాంగనలూ చేతుల్లో ముఖాలు దాచుకుని పరుగెత్తారక్కణ్ణుంచి. యజ్ఞవాటిక అంతటినీ శ్మశానవాటికలా చేసి, భీకరంగా నవ్వుతూ నిల్చున్నాడు వీరభద్రుడు. నందీశ్వరుడు, చండీశ్వరుడు, మణిమంతుడు, శృంగి, భృంగి మొదలయిన ప్రమథులంతా ఇంద్రాది దేవతలనూ, సూర్యచంద్రులనూ అనేక విధాల బాధించి, తీవ్ర అవమానాల పాల్జేశారు. మునులందరినీ తాళ్ళతో కట్టి పడేశారు. 

ప్రమథుడొకడు, భృగుమహర్షి మీసాలు లాగివేశాడు. మరొకడు అతని కళ్ళు పెరికి వేశాడు. ఇంకొకడు భృగుని జాలిగా చూస్తున్న సూర్యుని వెంటపడి, అతని పళ్ళూడగొట్టాడు. వెన్నిచ్చి పారిపోతున్న దక్షుణ్ణి చేతులు జాచి అందుకున్నాడు వీరభద్రుడు. బంతిలా అతన్ని కింద పడేశాడు. లేవకుండా అతని రొమ్ము మీద కాళ్ళుంచి, మట్టిని తొక్కినట్టుగా తొక్కిపారేశాడు. కత్తితో శిరస్సు ఖండించాడు. తెగి పడ్డ శిరస్సును చేతిలోనికి తీసుకుని చూసి, ఆనందించి, దానిని దక్షిణాగ్నిలో హోమంలో వేశాడు. దక్ష సంహారంతో వచ్చిన పనయిపోయింది. ప్రమథులతో మరలిపోయాడు వీరభద్రుడు. కైలాసానికి చేరుకున్నాడు.

శివునితో వైరం తెచ్చుకున్న కారణంగా దక్షయజ్ఞానికి బ్రహ్మ, విష్ణువులు రాలేదు. తమ మిత్రుని అవమానం తమదిగా భావించి, ఆహ్వానాలు అందినా ఊరుకున్నారు వారు. బ్రహ్మ, విష్ణువులు వచ్చి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదనుకుని, జరిగిందంతా విన్నవించేందుకు ముందు బ్రహ్మని సమీపించారు దేవతలూ, మునులూ. అంతా పూసగుచ్చినట్టుగా చెప్పారాయనకి. ఆ తర్వాత శివుని కోపం చల్లారి ఉండదని, ప్రమథులూ, వీరభద్రుడూ మళ్ళీ మీద పడే అవకాశం ఉన్నదని గోలు గోలున విలపించారు. తమని కాపాడమని వేడుకున్నారు.

అంతా విన్న బ్రహ్మ, బాగా ఆలోచించి, ఇలా అన్నాడు.‘‘శివుని కోపం చల్లార్చడం నా వల్ల కూడా కాదు. శాంతించమంటే నా మీదే తిరగబడొచ్చు. అందుకని, ఓ పని చేద్దాం. ఏమయితే అది అయిందని అందరం కలసికట్టుగా కైలాసానికి పోదాం. కాపాడమని ఆ పరమ శివుణ్ణే వేడుకుందాం. పరమ దయాళువు ఆ పరమేశ్వరుడు మన మొర వినకపోడు.’’

శివుని ఉగ్రస్వరూపం వీరభద్రుడు

మన దేశంలో చాలాచోట్ల వీరభద్రుని ఆలయాలు కనిపిస్తాయి. ఏ గ్రామంలో చూసినా వీరభద్రుని పురాతన విగ్రహాలు దర్శనమిస్తాయి. చాలామంది ఈ వీరభద్రుడు ఎవరో గ్రామదేవత అనుకుంటూ ఉంటారు. మరికొందరేమో ఈయనను పరమశివుని కుమారునిగా భావిస్తారు. ఇంతకీ ఈ వీరభద్రుడు ఎవరు? శివునితో ఈయనకు ఉన్న అనుబంధం ఏమిటి?

శివునికి సంబంధించిన గాథలలో దక్షయజ్ఞానికి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకించి వివరించాల్సిన అవసరం లేదు. వీరభద్రుని ఆవిర్భావం గురించి చెప్పుకోవాలంటే ఈ దక్షయజ్ఞాన్ని తలుచుకోవలసిందే! దక్షునికి మొదటినుంచీ పరమేశ్వరుని పొడ గిట్టేది కాదు. కానీ ఆయన కుమార్తె సతీదేవి మనసు మాత్రం శివుని మీదే లగ్నమై ఉండేది. ఆమెను శివునికి తప్ప వేరెవ్వరికైనా కట్టబెట్టేందుకు దక్షుడు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆఖరికి సతీదేవి వివాహం చేసేందుకు, శివుని తప్ప మిగతా దేవతలందరినీ స్వయంవరానికి పిలిచాడు దక్షుడు. కానీ అక్కడ శివుని శిల్పం మెడలోనే తన పూలహారాన్ని వేసి, తన మనసులో శివునికి తప్ప అన్యులకు స్థానం లేదని చెప్పకనే చెప్పింది సతీదేవి. ఇక దక్షునికి కుమార్తె మనసుని ఆలకించడం మినహా వేరే గత్యంతరం లేకపోయింది.

శివుని తన అల్లునిగా చేసుకున్నప్పటికీ, అతనని ఎలాగైనా అవమానించాలన్న సంకత్పంతో రగిలిపోయాడు దక్షుడు. అందుకోసం ఒక గొప్ప యజ్ఞాన్ని తలపెట్టాడు. ఆ యజ్ఞానికి సమస్త దేవతలనూ ఆహ్వానించాడు- ఒక్క శివుని తప్ప! శివునికి దక్షుని మనసులో ఉన్న ద్వేషం అర్థం కావడంతో ఆ యజ్ఞానికి తాను కూడా దూరంగా ఉన్నాడు. కానీ సతీదేవికి మాత్రం తన తండ్రి అంగరంగవైభవంగా తలపెట్టిన యజ్ఞంలో పాలుపంచుకోవాలన్న కోరిక కలిగింది. శివుడు ఎంతగా వారించినా వినకుండా ఆ యజ్ఞవాటికను చేరుకుంది. అక్కడ శివుడు ఊహించిందే జరిగింది. దక్షుడు శివుని అనరాని మాటలూ అనడం మొదలుపెట్టాడు. ఆ మాటలకు అవమానం చెందిన సతీదేవి తనను తాను అగ్నికి ఆహుతి చేసుకుంది.

సతీదేవి ఆత్మాహుతి గురించి విన్న పరమేశ్వరుడు క్రోధంతో రగిలిపోయాడు. తన కేశాన్ని పెరికి నేలకేసి కొట్టాడు. అప్పుడు ఉద్భవించిన ఉగ్రరూపమే వీరభద్రుడు. ఆకాశమంత ఎత్తున, కారుమేఘపు చాయతో, పదులకొద్దీ ఆయుధాలను ధరించిన చేతులతో ఆవిర్భవించాడు వీరభద్రడు. ఆ వీరభద్రునికి తోడుగా అవతరించిన శక్తి స్వరూపమే భద్రాకాళి. దక్షవాటికను ధ్వంసం చేయమంటూ వారిని అజ్ఞాపించిడమే ఆలస్యం. ప్రమథగణాలతో కలిసి వారిరువురూ విధ్వంసాన్ని సృష్టించారు

దక్షుని రాజ్యంలో వీరభద్రుడు వేసిన వీరంగం అంతాఇంతా కాదు. అడ్డువచ్చిన వారికి ఘోర అవమానమే ఎదురైంది. చంద్రుడు, అగ్ని, పూషుడు. ఎవ్వరూ వీరభద్రుని ఆపలేకపోయారు. మెడలో కపాలమాలతో వీరభద్రడు, నిప్పులను చిమ్ముతూ భద్రకాళి ఆ రాజ్యం యావత్తునూ రణరంగంగా మార్చేశారు. చివరికి దక్షుని కాపాడేందుకు ఆ విష్ణుమూర్తే వీరభద్రుని ఎదుర్కోవలసి వచ్చింది. ఎదురుగా సాక్షాత్తూ ఆ నారాయణుడే నిలిచినా, వీరభద్రుని నిలువరించడం సాధ్యం కాలేదు. ఇరువురి మధ్యా ఘోర సమరం జరిగింది. ఆ పోరు ధాటికి ముల్లోకాలూ కంపించిపోయాయే కానీ, వారిరువురిలో ఏ ఒక్కరూ వెనక్కి తగ్గలేదు. ఇక విష్ణుమూర్తి తన ఆఖరి ఆస్త్రంగా సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆశ్చర్యం! వీరభద్రుడు ఆ సుదర్శన చక్రాన్ని కూడా మింగివేసి ముందుకురికాడు. ధర్మాగ్రహంతో ప్రళయకారునిలా విజృంభిస్తున్న వీరభద్రుని నిలువరించడం ఎవ్వరి తరమూ కాదని తేలిపోవడంతో, ముక్కోటి దేవతలూ తప్పుకున్నారు. దక్షుని మీ వీరభద్రుడు పగని తీర్చుకునేందుకు అవకాశాన్నిచ్చారు. అంతట వీరభద్రుడు కసితీరా దక్షుని సంహరించి విజయగర్వంతో కైలాసానికి బయల్దేరాడు.

ఇదీ వీరభద్రుని విజయగాథ! శివుని ఉగ్ర స్వరూపంగా ఈ వీరభద్రుని భక్తులు కొలుచుకుంటారు. దేశమంతా ఈ వీరభద్రుని ఆలయాలు ఉన్నప్పటికీ, దక్షిణభారతంలో మాత్రం గ్రామగ్రామానా ఈ స్వామి దర్శనమిస్తుంటాడు. కోరిన వరాలను తీర్చే కల్పతరువుగా, అడ్డంకులను తొలగించే నాథునిగా, నిరాడంబరమైన పూజకు లొంగిపోయే భోళా శంకరునిగా. భక్తుల మనసుని నిలిచి ఉంటాడు.

‘‘అయితే ఆలస్యం దేనికి, పదండి.’’ అన్నారంతా. బయల్దేరారు. కైలాసానికి చేరుకున్నారు. పరమ శివుణ్ణి పలు విధాల స్తోత్రం చేశారు. ప్రార్థించారు.‘‘దేవాదిదేవా! మహాశివా! నీకు యజ్ఞభాగం లేకుండా చేసిన దక్షునికి తగిన శాస్తే జరిగింది. అయిపోయిందేదో అయిపోయింది. ఇక మీదట నీ యజ్ఞభాగం నీదే! ఎప్పటిలా హవిర్భాగాన్ని అందుకొంటావు.’’ అన్నాడు బ్రహ్మ.‘‘కరుణించు దేవా! కటాక్షించు.’’ మొక్కుకున్నారంతా. శివుని కోపం చల్లారిందప్పుడు. కళ్ళు తెరిచి, అందరినీ కరుణించాడు. దేవతల్నీ, మునుల్నీ అనుగ్రహించాడు. తెగిన శిరస్సు స్థానంలో మేక తలని అతికించి, దక్షుణ్ణి బతికించాడు. భృగునికి కళ్ళూ, సూర్యునికి పళ్ళూ ప్రసాదించాడు. యజ్ఞశాలలో ప్రాణాలు కోల్పోయిన వారందరినీ పునర్జీవితుల్ని చేశాడు. అందరికీ ప్రాణాలు పోశాడు. భృగుమహర్షికి మేక మీసాలు పెట్టాడు. యథావిధిగా యజ్ఞం కొనసాగించండన్నట్టుగా యజ్ఞవాటికను శోభిల్ల చేశాడు. తనని క్షమించమని శివుణ్ణి వేడుకున్నాడు దక్షుడు. చేతులు జోడి ంచి, సర్వేశ్వరుణ్ణి స్తుతించాడు. యజ్ఞాన్ని ప్రారంభించాడు. ఎలాంటి అడ్డంకులూ లేకుండా యజ్ఞం పూర్తయింది. యజ్ఞవాటికలో అప్పుడు విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. అందరినీ దీవించి ఇలా అన్నాడప్పుడు.‘‘నాకూ శివునికీ భేదం లేదు. శివుణ్ణి నిందిస్తే నన్ను నిందించినట్టే! శివనిందని మించిన పాపం కూడా లేదు.’’‘‘అవునవును’’ అన్నారంతా. విష్ణువుకి సాష్టాంగ పడ్డారు.-ఇదీ దక్షయజ్ఞం కథ. ఈ కథ విన్నా చదివినా సమస్త పాపాలూ పోతాయి. ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. శివుని కరుణా కటాక్షాన్ని అందుకుంటారు.

కోదండరాం కూరెళ్ల 

https://t.me/koorellaBhagavatham

పోతన భాగవతం 0015

దక్షయజ్ఞం సమయంలో అవమాన భారాన్ని భరించలేని సతీదేవి అగ్నికి ఆహుతవుతుంది. సతీదేవి కళేబరాన్ని భుజంపై వేసుకున్న శంకరుడు రుద్రమూర్తియై ప్రళయ తాండవం చేస్తాడు. ఆ సమయంలో శంకరుడి తాండవం వేగానికి తట్టుకోలేని సతీదేవి శరీర భాగాలు 52 ప్రదేశాలలో పడి అవి ప్రసిద్ధ శక్తి పీఠాలుగా పేరుగాంచాయి. అలా సతీదేవి కుడికాలి బొటనవ్రేలు భాగం పడిన ప్రదేశమే "కాళీఘాట్". 

మరో కథనం ప్రకారం.. ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడుగానీ.. కూతురినీ, అల్లుడినీ పిలవలేదు, ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి..? అని సతీదేవి, శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది గాని, అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు. 

కాని సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్ధనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని(శివుని) తోడుగా దర్శనమిస్తుంది.

విశాలమైన త్రినేత్రాలతో, పొడవైన బంగారు నాలుకతో, నాలుగు చేతులతో అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో తెగిన తలను ధరించిన అమ్మవారు అభయ వరద ముద్రలతో కనువిందు చేస్తుంటారు. మోక్షాన్ని కోరే మానవుడు తనలోని అహంకారాన్ని వదిలితే కాళీమాత అభయాన్నిస్తుంది.

(AN జగన్నాథశర్మ - ఆంధ్రజ్యోతి)

కోదండరాం కూరెళ్ల 

https://t.me/koorellaBhagavatham

పోతన భాగవతం 0014

దక్షయజ్ఞం ధ్వంసం:వీరభద్ర జననం

శివుడు ఎన్ని విధాల చెప్పినా వినిపించుకోలేదు సతీదేవి. పుట్టింటి మీది మమకారాన్ని చంపుకోలేకపోయింది. దక్షయజ్ఞానికి వెళ్ళి తీరుతానని పట్టుబట్టింది. అంగీకరించక తప్పలేదు శివునికి. ‘సరే! వెళ్ళు’ అన్నాడతను.సతీదేవి ఒంటరిగా బయల్దేరింది. ఆమె అలా ఒంటరిగా బయల్దేరడం, ప్రమథులకి ఆందోళన కలిగించింది. ఇంత మంది ఉన్నా ఎవరూ లేని దానిలా సతీదేవి ఒంటరిగా పుట్టింటికి పయనమవడం బాధ కలిగించింది వారికి. కాలినడకన వెళ్తున్న సతీదేవిని చూసి కళ్ళు చెమర్చుకున్నారు. తప్పు! ఇది భావ్యం కాదనుకున్నారు. కూడబలుక్కున్నారంతా. కానుకలు, వాహనాలు, వాయిద్యాలు సమకూర్చున్నారు. ఈ లోపు సతీదేవిని చక్కగా అలంకరించారు. నంది వాహనంపై కూర్చోబెట్టారు. ‘పదమ్మా’ అంటూ ఆమె వెంట తరలి వెళ్ళారు. అంతా దక్షుని యజ్ఞవాటికకు చేరుకున్నారు.యజ్ఞం మహా వైభవంగా జరుగుతోందక్కడ. సమస్త దేవతలూ, మునులూ కొలువుదీరి ఉన్నారు. అంతటా వేదఘోష వినవస్తోంది. చూసి పొంగిపోయింది సతీదేవి. యజ్ఞశాలలోకి ప్రవేశించింది. అయిన వారూ, అమ్మ వంక వారూ గుంపులు గుంపులుగా ఉన్నా, సతీదేవిని ఒక్కరూ ‘వచ్చావా తల్లీ’ అంటూ పలకరించలేదు. పలకరిస్తే ప్రమాదం అన్నట్టుగా ఊరుకున్నారంతా. దక్షుడు అసలు పట్టించుకోలేదు. కన్నెత్తి కూడా కూతురిని చూడలేదు. బాధపడింది సతీదేవి. తల దించుకుని నిలబడింది. అంత దూరం నుండి తల్లి గమనించిందది. పరుగున వచ్చింది. సతీదేవిని గట్టిగా కౌగిలించుకుంది.‘‘వచ్చావా తల్లీ! రావేమో అనుకున్నాను.’’ అంది.‘‘ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నావు’’ అంది. చీర కొంగుతో కూతురు ముఖాన్ని తుడిచింది.తల్లి ఎప్పుడయితే సతిని చేరదీసిందో అప్పుడు ఇక ప్రమాదం లేదనుకుని, తోబుట్టువులంతా చుట్టుముట్టారామెను. అభిమానంగా పలకరించారు. ‘రా రా’ అంటూ సరసన కూర్చోబెట్టుకునేందుకు సిద్ధపడ్డారు. కూర్చోలేదు సతి. కళ్ళెర్రజేసుకుని నిలబడింది.అమ్మ అక్కున చేర్చుకుంది. తోబుట్టువులు చేరదీశారు. నాన్న రాడే! వచ్చి పలకరించడే! అంత కానిదయిపోయిందా తను? తండ్రి చేసిన అవమానాన్ని తట్టుకోలేకపోతోంది సతీదేవి. తోబుట్టువులంతా కుటుంబసమేతంగా వచ్చారు.

వారందరినీ పేరు పేరునా పిలిచి, తన భర్తనే తండ్రి పిలకపోవడాన్ని భరించలేకపోయిందామె. మండుతున్న కళ్ళను ఒక్క క్షణం మూసుకుని, తెరిచింది. నిప్పుకణాల్లా, నెత్తురు చుక్కల్లా సతీదేవి కన్నీటిబొట్లు జలజలా నేల రాలాయి. చూశారది ప్రమథులు. కోపోద్రిక్తులయ్యారు. దక్షుని వధించేందుకు కత్తులు దూశారు. వారిని వారించింది సతీదేవి. తండ్రిని కోపంగా చూస్తూ ఇలా అంది.‘‘మదాంధుడువై నా భర్త శివుణ్ణి ద్వేషిస్తున్నావు. నీకిది మంచిది కాదు తండ్రీ! సర్వేశ్వరుడు నా భర్త ఎక్కడ? అధమాధముడవి నువ్వెక్కడ? నా భర్తకు హవిర్భాగం లేకుండా చేస్తావా? మమ్మల్ని అవమానిస్తావా? దీనికి ఇంతకింతా అనుభవిస్తావు నువ్వు. నీ తనువున పుట్టిన పాపాన్ని నేను భరించలేను. నాకీ శరీరం వద్దు. ఇప్పుడే ఈ క్షణమే ఈ శరీరాన్ని వదలి వేస్తాను. పవిత్రురాలునవుతాను.’’అయోమయంగా ఆందోళనగా చూస్తున్న మునులనూ, దేవతలనూ కడగంట చూసి, కుశలు పరచింది సతీదేవి. వాటిపై ఉత్తరదిశగా కూర్చుంది. కళ్ళు మూసుకుంది. చిత్తం పరమశివుని అధీనం చేసి, నవరంధ్రాలనూ బంధించింది. మహా మహా యోగులకు కూడా సాధ్యం కాని యోగాన్ని ఆరంభించింది. పంచప్రాణాలనూ వాటి మూలస్థానాల్లోంచి కదలించింది. దాంతో సమాధి స్థితిలో ఉన్న ఆమె శరీరం నుండి మంటలు ఎగసిపడ్డాయి. ఆ యోగాగ్నిలో సతీదేవి దహనమయిపోయింది. ఆమె అలా దహనమయిపోవడం ఏమిటి, ముల్లోకాల్లోనూ హాహాకారాలు చెలరేగాయి. భయంతో సమస్త భూతకోటీ కంపించింది.

దక్షుణ్ణి అంతా అసహ్యించుకున్నారు.ప్రమథులు మరిక ఆగలేదు. యజ్ఞవాటికలో ఉన్న అందరినీ చంపేందుకు సిద్ధమయ్యారు. భృగుమహాముని అది గమనించి, ఋషుల్ని కాపాడేందుకు దక్షిణాగ్నిలో అభిచార హోమం చేశాడు. ఆ హోమ ఫలితంగా ఋభనామకులు దేవతలు వేలాదిగా పుట్టుకొచ్చారు. యజ్ఞశాలలోని కొరవులనే ఆయుధాలుగా ధరించి, దండెత్తి వచ్చిన ప్రమథులను ఎదుర్కొన్నారు. వారిని కొట్టిన చోట కొట్టకుండా కొట్టి, అక్కణ్ణుంచి తరమి కొట్టారు.


(AN జగన్నాథశర్మ - ఆంధ్రజ్యోతి)

కోదండరాం కూరెళ్ల 

https://t.me/koorellaBhagavatham

పోతన భాగవతం 0013

నంది శాపానికి భృగుమహామునికి కోపం వచ్చింది. దిగ్గున లేచి నిల్చున్నాడతను.‘‘నందీ! నిష్కారణంగా మా మునులను శపించావు. నేనూ శపిస్తున్నాను, చూడు! కేవలం శివుణ్ణి కొలిచేవారంతా వేద విరుద్ధ కర్మలాచరిస్తూ పాషాండులయి పడి ఉందురుగాక.’’ అన్నాడు.శాపాలు, ప్రతిశాపాలతో సభామండపం అంతా అట్టుడుకుపోవడాన్ని తట్టుకోలేని శివుడు, తన పరివారంతోఅక్కణ్ణుంచి నిష్క్రమించాడు. శంకరుని నిష్క్రమనానంతరం మరీచ్యాదులు వెయ్యేళ్ళు సత్రయాగం చేసి, తృప్తి చెందారు. గంగా యమునా సంగమంలో అవభృధస్నానం చేసి, ఎక్కడి వారక్కడికి వెళ్ళిపోయారు.యాగం పూర్తయినా, ఎవరి మానాన వారున్నా మామా అల్లుళ్ళ మధ్య ఆ యాగం రేపిన విరోధం మాత్రం సమసిపోలేదు. పైగా నానాటికీ పెరిగి పెద్దదయింది.దక్షుడు అనేక యాగాలు చేశాడు. ఆ యాగాలు వేటికీ శివునికి ఆహ్వానించలేదతను. హవిర్భాగం అందివ్వలేదు. తర్వాత వాజపేయం చేశాడు దక్షుడు. దాని తర్వాత బృహస్పతి సవనం ప్రారంభించాడు. ఆ యగానికి దేవతలూ, బ్రహ్మర్షులూ, మహారుషులూ అంతా బంధు మిత్ర సపరివారంగా బయల్దేరారు. వారంతా దక్షాధ్వరం గురించి గొప్పగా చెప్పుకోవడాన్ని వినువీధిన విన్నది సతీదేవి. తనూ కూడా ఆ యజ్ఞానికి వెళ్ళాలనుకుంది. అనుమతి కోసం శంకరుణ్ణి సమీపించిందామె. చేతులు జోడించి, నమస్కరించింది.‘‘ప్రాణనాథా! నా తండ్రి గొప్ప యజ్ఞం చేస్తున్నాట్ట! అంతా సపరివారంగా తరలి వెళ్తున్నారు. నాకూ వెళ్ళాని ఉంది. దయచేసి అనుమతించండి, వెళ్ళి వస్తాను. మీకూ, నా తండ్రిగారికీ సరిపడదని తెలుసు. మీరు రారనీ తెలుసు. అయినా అడుగుతున్నానంటే నన్ను అర్థం చేసుకోండి! నేను ఆ ఇంటి ఆడబిడ్డను. పుట్టింటి మీద మమకారంతో ప్రార్థిస్తున్నాను. పైగా నా తోబుట్టువులంతా ఈ యాగానికి వస్తున్నట్టుగా తెలిసింది. వారిని చూసి, చాలా యేళ్ళయింది. ఈ యాగం రూపేణా వారినీ చూసినదానినవుతాను. మా అమ్మను కూడా చూడాలని ఉంది. దయచేసి అంగీకరించండి.’’ వేడుకుంది. 


సమాధానంగా ముందు సన్నగా నవ్వాడు శివుడు. తర్వాత ఇలా అన్నాడు.‘‘సతీ! నీ మాటను నేను కాదనను. పుట్టింటికి వెళ్తానంటే పంపనని అనలేను. కాకపోతే ఒక్క విషయం ఆలోచించుకో! నీ తండ్రికీ నాకూ బద్ధవైరం. ఐశ్వర్యమదంతో విర్రవీగుతున్నాడు. మన పొడే గిట్టదతనికి. అటువంటి చోటుకి వెళ్తానంటున్నావు. నిన్ను మర్యాదగా చూస్తారంటావా? లేనిపోని తలవంపులు తెచ్చుకుంటావేమో అనిపిస్తోంది. దేనినయినా భరించవచ్చు కాని, అవమానాన్ని భరించలేం. శత్రువు అవమానిస్తే భరించగలమేమో! అయిన వారూ, అమ్మవంక వారూ అవమానిస్తే తట్టుకోవడం కష్టం. నలుగురిలో నవ్వుల పాలవ్వడం దుర్భరం. అంత కంటే మరణమే మేలనిపిస్తుంది.’’ అన్నాడు శివుడు.తల దించుకుంది సతీదేవి.‘‘పైగా ఇది పిలవని పేరంటం. ఎంత పుట్టింటివారయినప్పటికీ, పిలవకుండా వెళితే అవమానం కాదంటావా? అందుకని నా మాట విను. వద్దు. నువ్వు అక్కడికి వెళ్ళొద్దు.’’వినిపించుకోలేదు సతీదేవి. శివుడు ఎన్ని విధాలా చెప్పినా పుట్టింటి మీది మమకారాన్ని చంపుకోలేకపోయిందామె. యజ్ఞానికి వెళ్ళి తీరాల్సిందేనని పట్టుబట్టింది. శంకరుడు సర్వేశ్వరుడు. అతనికి జరగబోయేదంతా తెలుసు. తెలుసు కనుకనే వద్దని వారించాడు. వినడం లేదు సతీదేవి. తప్పదనుకున్నాడప్పుడు.‘‘సరే నీ ఇష్టం. వెళ్ళు.’’ అన్నాడు శివుడు.శివుని ఆనతి లేనిదే చీమయినా కదలదు. తను దాన్ని బలవంతంగా పొందింది. దీని పర్యవసానం ఎలా ఉంటుందో? వెళ్దామా? వద్దా? చాలాసేపు తీవ్రంగా ఆలోచించింది సతీదేవి. ఆఖరికి పుట్టింటి మీది ప్రేమతో వెళ్ళేందుకు సిద్ధమయింది.

(AN జగన్నాధశర్మ - ఆంధ్రజ్యొతి)

కోదండరాం కూరెళ్ల 

https://t.me/koorellaBhagavatham

పోతన భాగవతం 0012

అంగీరసుడికీ శ్రద్ధకీ బృహస్పతి మొదలగు వారు జన్మిస్తే, పులస్త్యుడు, హవిర్భుక్కుకు అగస్త్యుడు, విశ్రవసువు జన్మించారు. విశ్రవసు, ఇలబిలకు కుబేరుడు జన్మించాడు. విశ్రవసుకు అతని రెండవ భార్య కేకసికీ రావణ, కుంభకర్ణ, విభీషణాది దానవులు జన్మించారు. క్రతువుకీ క్రియకీ వాలఖిల్యాది అరవైమంది మహామునులు జన్మించారు. అరుంధతి వశిష్ఠులకు సురోచి, విరజుడు మొదలయిన తొమ్మిది మంది కుమారులు కలిగారు. వశిష్ఠుని రెండో భార్య శక్తిముఖ పుత్రులను కన్నది. భృగువుకీ ఖ్యాతికీ దాత, విధాత అనే ఇద్దరు కుమారులు, శ్రీ అనే కుమార్తె కలిగారు. దాత విధాతలు మేరువు అనే మునీంద్రుని కుమార్తెలు ఆయతిని, నియతిని పెళ్ళాడారు. ఆయతికి మృకండుడు, నియతికి ప్రాణుడు జన్మించారు. మృకండుడికి మార్కేండేయుడు, ప్రాణుడికి వేదశిరుడు జన్మించారు. ఈ వేదశిరుని కుమారుడే శుక్రాచార్యుడు.దక్షప్రజాపతికీ ప్రసూతికీ పదహారు మంది కుమార్తెలు జన్మించారు. వారిలో పదమూడు మందిని ధర్ముడికి ఇచ్చి వివాహం జరిపించాడు దక్షుడు. ఆ పదమూడు మందిలో చివరిదయిన మూర్తికి నరనారాయణులు జన్మించారు. వీరే లోక రక్షణార్ధం ద్వాపరయుగంలో కృష్ణార్జునులుగా జన్మించారు. దక్షుని కూతురు స్వాహాదేవి అగ్నిహోత్రుణ్ణి పెళ్ళాడింది. దక్షుని ఆఖరి కూతురు, మహాసాధ్వి సతీదేవి పరమ శివుణ్ణి పెళ్ళాడింది. మహాశివుడు అల్లుడు అయినందుకు ఆనందించక, అతనితో విరోధం తెచ్చుకున్నాడు దక్షుడు. కన్నకూతురు సతీదేవిని అవమానించి, అనర్ధం కొని తెచ్చుకున్నాడు. 

అదేమిటో తెలుసుకోవాలనుకుంటే...ఒకప్పుడు మరీచుడు మొదలయిన ప్రజాపతులంతా సత్రయాగం చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ యజ్ఞాన్ని చూసేందుకు దేవతలూ, మునులూ అంతా తరలి వచ్చారు. దక్షుడు కూడా సపరివారంగా వచ్చాడక్కడకి. అప్పుడు బ్రహ్మ, శివుడు తప్ప అంతా దక్షుని చూసి, గౌరవ సూచికంగా లేచి నిల్చున్నారు. శివుడు లేచి నిల్చోలేదని, తనని గౌరవించలేదనీ కోపం వచ్చింది దక్షునికి. తండ్రి బ్రహ్మకి నమస్కరించి, ఆ అగౌరవానికి అల్లుడు శివుణ్ణి నానా దుర్భాషలాడాడు.‘‘మునులారా! దేవతులారా! చూశారుగా, నేనొస్తే గౌరవంతో మీరంతా లేచి నిల్చున్నారు. ఈ శివుడు మాత్రం, తానేదో అధికుణ్ణన్నట్టుగా కూర్చున్న చోటు నుంచి లేచి నిల్చోలేదు. నిండు సభలో నన్ను అవమానించాడు. దుష్టుడు వీడు. లోకపాలకుడన్న పేరుకే అప్రతిష్ఠ తెచ్చి పెట్టాడు. ఇలాంటి వాడని తెలియక, నా కుతుర్నిచ్చి పెళ్ళి చేశాను. తప్పు చేశాను. కురూపి, భయంకరాకారుడు, దురహంకారి, జడలు విరబోసుకుని, దిగంబరంగా శ్మశానంలో తిరిగేవాడు. భూత పిశాచాలు పరివారం. వల్లకాటి భస్మం గంధం. ఇలాంటివాడు నాకు అమర్యాద చేస్తాడా? వీణ్ణి ఇప్పుడే శపిస్తాను.’’ అన్నాడు దక్షుడు. జలం తీసుకున్నాడు.

‘‘ఇక మీదట ఇంద్రాది దేవతలతో పాటుగా హవిస్సులందు ఈ శివుడికి, ఈ దురాచారికి భాగం లేకుండుగాక.’’ అని శపించాడు. శపించి, అక్కణ్ణుంచి చరచరా వెళ్ళిపోయాడు.తనని మామగారు అనరాని మాటలు అన్నప్పటికీ, తనని శపించినప్పటికీ, నవ్వుతూ కూర్చున్నాడేగాని, మారుమాటాడలేదు శివుడు. దక్షునికి భయపడి మిగిలిన వారూ మాట్లాడలేదు. అంతటా భరించలేని నిశ్శబ్దం నిండుకుంది. దాన్ని భరించలేకపోయాడు శంకరుని పరిచారకుడు నంది. పట్టరాని కోపంతో ఊగిపోయాడతను.‘‘విన్నారుగా దక్షుని కారు కూతలు. విని కూడా మీరంతా ఊరుకున్నారంటే మిమ్మల్నేమనుకోవాలి? శివనింద మహా పాపం అని తెలియదా? అశాశ్వతమయిన సంపద, అధికారం, భోగభాగ్యాలు చూసుకుని, దక్షుడు విర్రవీగుతున్నాడు. అతనికి మీరంతా వత్తాసు పలుకుతున్నట్టుగా ఊరుకున్నారు. తప్పు. లోకపూజ్యుడయిన శంకరుణ్ణి నిందించి, దక్షుడు చేజేతులా కష్టాన్ని కొనితెచ్చుకున్నాడు.త్వరలోనే దక్షుడు మేషముఖుడై పశువులా ప్రవర్తిస్తాడు. ఇది నా శాపం.’’ అన్నాడు నంది.ఆ శాపానికి అక్కడున్న మునులంతా ఒకరినొకరు చూసుకున్నారు. ఏదో మాట్లాడాలనుకుని, మనకెందుకనుకున్నారేమో! వూరుకున్నారు మళ్ళీ. అది గమనించాడు నంది. ఇలా శపించాడు వారిని.‘‘శివనింద చెవులారా వింటూ మారు మాటాడని మీరంతా విద్యలభ్యసించి గొప్పవారయినా, ఉదరపోషణార్థం యాచకులై పోదురుగాక.’’ (సశేషం)

కోదండరాం కూరెళ్ల 

https://t.me/koorellaBhagavatham 

పోతన భాగవతం 0011

రసాతలంలో మునిగి ఉన్న భూమండలాన్ని యజ్ఞవరాహా రూపంలో తన కోరల కొనలతో ఎత్తసాగాడు విష్ణుమూర్తి. తన శక్తియుక్తులన్నీ అందుకు ధారపోయసాగాడు. ఆ సమయంలో హిరాణ్యాక్షుడు వచ్చాడక్కడకి. వస్తూనే విష్ణుమూర్తిని యుద్ధానికి రమ్మన్నాడు. పట్టించుకోకపోతే కవ్వించాడతన్ని. ఆ కవ్వింపుకి కోపం వచ్చింది విష్ణుమూర్తికి. హిరణ్యాక్షుడితో యుద్ధానికి తలపడ్డాడు. ఇద్దరూ ప్రళయ భీకరంగా యుద్ధం చేయసాగారు. బ్రహ్మాది దేవతలూ, మునులూ దగ్గరుండి ఆ యుద్ధాన్ని చూస్తూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. ఆ భయంలోనే హిరణ్యాక్షుని త్వరగా సంహరించి, లోకాల్ని కాపాడమని విష్ణుమూర్తిని వేడుకున్నారంతా. వినవచ్చిన వే డుకోలుకి ‘సరే’నన్నట్టుగా తలూపాడు విష్ణుమూర్తి. రాక్షసమాయతో యుద్ధం చేస్తున్న హిరణ్యాక్షుణ్ణి మరింత గట్టిగా ఎదుర్కొన్నాడప్పుడు.‘‘దేవాదిదేవా! ఆలస్యం చెయ్యకు. చీకటి చిచ్చు రగలకముందే, రాత్రి కాకుండానే ఆ రాక్షసుణ్ణి అంతమొందించు.’’ ప్రార్థించారు మునులు. ఆ ప్రార్థనను ఆలకించిన మరుక్షణంలోనే విష్ణుమూర్తి చక్రాయుధాన్ని ధరించాడు. వాయువు మేఘాలను చెదరిగొట్టినంత సులభంగా చక్రాయుధంతో రాక్షసమాయను ఛేదించాడు. హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు. హిరణ్యాక్షుడు నేలకొరగడంతో బ్రహ్మాది దేవతలూ, మునులూ హరిని వేదసూక్తాలతో అనేక విధాల స్తోత్రం చేశారు. దేవదుందుభులు మోగాయి. పూలవాన కురిసింది. లోకాలన్నీ శాంతించాయి. హిరణ్యాక్షుణ్ణి సంహరించిన విష్ణుమూర్తి, భూమండలాన్ని రక్షించి, వరాహ అవతారాన్ని చాలించాడు. వైకుంఠానికి వెళ్ళిపోయాడు.

కపిలాచార్యుడు

బ్రహ్మ సృష్టించిన ప్రజాపతులలో కర్దముడు ఒకడు. సరస్వతి నదీతీరం అతని నివాసం. పదివేల సంవత్సరాలు ఘోరమయిన తపస్సు చేసి, శ్రీహరి అనుగ్రహాన్ని సంపాదించాడతను.తన కుమార్తె దేవహూతిని కర్దముడికి ఇచ్చి వివాహం చేశాడు స్వాయంభువమనువు. కర్దముడికీ, దేవహూతికీ తొమ్మిది మంది కుమార్తెలూ, ఒక కుమారుడూ జన్మించారు. ఆ కుమారుడే కపిలుడు. సాక్షాత్తూ శ్రీమన్నారాయణుని అంశతో జన్మించాడతను.తన తొమ్మిది మంది కుమార్తెలనూ మరీచ్యాది మహామునులకు ఇచ్చి పెళ్ళి చేశాడు కర్దముడు. కళను మరీచికీ, అనసూయను అత్రికీ, శ్రద్ధను అంగీరసునికీ, హవిర్భూవును పులస్త్యునికీ, గతిని పులహునికీ, క్రియను క్రతువుకీ, ఖ్యాతిని భృగుమహర్షికీ, అరుంధతిని వసిష్ఠమహర్షికీ, శాంతిని అధర్వణునికీ ఇచ్చాడు.సాక్షాత్తూ భగవంతుడే తనకు కుమారునిగా జన్మించినందుకు కర్దముడు ఎంతగానో ఆనందించాడు. ఆఖరికి సంసారబంధాలు తెంచుకుని, మూక్తిమార్గం అనుసరించాడు. ఆ దశలో తల్లి దేవహూతికి కపిలుడే ముక్తిమార్గం బోధించాడు. మూక్తిమార్గాన్నే కాదు, ఆత్మస్వరూపాన్ని తెలియజేసి, పిండోత్పత్తిక్రమం, జీవికి కలిగే ప్రకృతి బంధాలులాంటి పరమ రహస్యాలెన్నో తెలియజేశాడు. భక్తిమార్గాన్ని కూడా ఉపదేశించించాడు. మహాయోగులకు కూడా అందని అద్భుత జ్ఞానాన్ని తల్లికి బోధించి, ఈశాన్యదిశగా ప్రయాణించాడు కపిలుడు. ప్రయాణించి ప్రయాణించి, అందరూ పరమపవిత్రంగా భావించే సముద్రుడిచ్చిన స్థలంలో నివాసం ఏర్పరుచుకుని, అక్కడే యోగం అవలంబించాడు. సాంఖ్యతత్త్వాన్ని ప్రతిపాదించాడు.కపిలుడు ఉపదేశాన్ని అనుసరించి తపోయోగంతో భగవంతుణ్ణి చేరుకుంది దేవహూతి. కొడుకు కపిలుని జ్ఞానోపదేశం పొంది, దేవహూతి సిద్ధి చెందిన ప్రదేశానికి ‘సిద్ధాశ్రమం’ అని పేరు. పుణ్యస్థలి అని ముల్లోకాలూ ఈ ఆశ్రమాన్ని పేర్కొంటున్నాయి.కపిలుడు ప్రతిపాదించిన సాంఖ్యతత్త్వాన్ని ఆసురి, పంచశిఖుడూ మొదలయిన వారంతా తర్వాతి కాలంలో ప్రచారం చేస్తూ వచ్చారు.

దక్షయజ్ఞం

పరమేష్ఠి సృష్ఠించిన ప్రజాపతులంతా సంతానాన్ని వృద్ధి చేస్తూ వచ్చారు. వీరిలో ద క్షుడు ముఖ్యుడు.స్వాయంభువ మనువుకీ, శతరూపకీ ముగ్గురు కుమార్తెలు. వారిలో దేవహూతి, కర్దముని భార్య. ఇక ఆకూతి, రుచి భార్య. ఆకూతికీ రుచికీ విష్ణుమూర్తి యజ్ఞుడు పేరిట కుమారుడిగా జన్మిస్తే, లక్ష్మి దక్షిణ పేరిట కుమార్తెగా జన్మించింది. స్వాయంభువ మనుమడు క్రతువు, దక్షిణను పెళ్ళాడాడు. వారికి లెక్కకు మిక్కిలిగా సంతానం కలిగింది. వారంతా భగవద్భక్తులై లోకధర్మానికి అనుగుణంగా రాజ్యాలు ఏలారు. స్వాయంభువ మనువు మూడవ కుమార్తె ప్రసూతి దక్షప్రజాపతికి భార్య. వారికి కలిగిన సంతానంతో మూడులోకాలూ నిండిపోయాయి.అనసూయను పెళ్ళాడిన అత్రి మహాముని బ్రహ్మదేవుని ఆదేశానుసారం ఋక్షమనేకుల పర్వత ప్రాంతానికి చేరుకున్నాడు. అక ్కడ వాయుభక్షణ చే స్తూ నూరు దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆ తపస్సుకి మెచ్చి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులు ముగ్గురూ ప్రత్యక్షమయ్యారు. తమ అంశలతో ముగ్గురు పుత్రులు జన్మిస్తారని వరాన్ని ప్రసాదించారు. ఆ వరప్రసాదంతో అత్రి అనసూయలకు బ్రహ్మ అంశతో చంద్రుడు, విష్ణు అంశతో దత్తాత్రేయుడు, రుద్రుని అంశతో దుర్వాసుడు జన్మించారు.


(ఆంధ్రజ్యోతి - A N జగన్నాథశర్మ)

కోదండరాం కూరెళ్ల 

https://t.me/koorellaBhagavatham

పోతన భాగవతం 0010

హరి హిరణ్యాక్షుల యుద్ధం.

హిరణ్యాక్షుడు ఎల్లప్పుడూ యుద్ధాన్ని కోరుకునేవాడు. అయితే అతనితో యుద్ధం చేసేందుకు ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు. దేవతలు కూడా హిరణ్యాక్షుడు కనిపిస్తే చాలు, అతనికి కనిపించక దాగునేవారు. స్వర్గ మర్త్య పాతాళలోకాల్లో తనతో యుద్ధం చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో పిచ్చెక్కినట్టయింది హిరణ్యాక్షుడికి. ‘రండిరా రండి! యుద్ధానికి రండి.’ అంటూ కేకలేస్తూ లోకాలన్నీ చుట్టబెట్టాడు. ఎవరూ రాలేదు. భూమి మీద తనతో యుద్ధం చేసేవారు ఎవరూ లేరని తెలిసి, గదాదండం గిరగిర తిప్పుతూ సముద్రంలోనికి ప్రవేశించాడతను. చాలా ఏళ్ళు జలంలో వీరవిహారం చేసి, ఆఖరికి విభావరీపురం చేరాడు. ఆ పురం వరుణుని రాజధాని. అక్కడ నిల్చుని యుద్ధానికి వరుణుని కేకేశాడు. వరుణుడొచ్చాడు. తాను యుద్ధానికి రాలేదంటూ ముందుగా చేతులు జోడించాడతను. తర్వాత ఇలా చెప్పాడు.‘‘ఈ ముల్లోకాల్లోనూ నీతో యుద్ధం చెయ్యగల సమర్థుడు ఆ విష్ణుమూర్తి ఒక్కడే! అతను వైకుంఠంలో ఉన్నాడు. వెళ్ళు. నీ బలపరాక్రమాలు చూపించు.’’ అన్నాడు. హిరణ్యాక్షునికి చావు దగ్గర పడిందని ఆనందించాడు. తనతో యుద్ధం చేసేందుకు ఇన్నాళ్ళకు ఒక్కడయినా దొరికాడని సంతోషించాడు హిరణ్యాక్షుడు. వైకుంఠానికి బయల్దేరాడు. ఆకాశమార్గాన పయనిస్తున్న హిరణ్యాక్షుని అటుగా వస్తున్న నారదమహాముని చూశాడు.‘‘మహావీరా! గదాదండం తిప్పుతూ ఎక్కడికి ఇటు? ఎవరి మీద యుద్ధానికి?’’ అడిగాడు నారదుడు.


‘‘ఎవడో విష్ణుమూర్తిట! వైకుంఠంలో ఉన్నాట్ట! నాతో యుద్ధం చేయగలిగేది వాడొక్కడే అని తెలిసింది, వాడితో యుద్ధానికి పోతున్నాను.’’ అన్నాడు హిరణ్యాక్షుడు.‘‘అలాగా’’ అని నవ్వాడు నారదుడు. తర్వాత ఇలా చెప్పాడు.‘‘నీకు కావాల్సిన విష్ణుమూర్తి ఇప్పుడు వైకుంఠంలో లేడు. పాతాళంలో ఉన్నాడు. యుద్ధం కావాలనుకుంటే నువ్వు పాతాళానికి వెళ్ళాల్సిందే!’’నారదుని మాటతో హిరణ్యాక్షుడు పాతాళానికి పరుగుదీశాడు. అక్కడ మహా తేజస్సుతో, తనంత బలంగా, తనంత ఎత్తున ఉన్న ఒక వరాహాన్ని చూశాడత ను. రసాతలంలో మునిగి ఉన్న భూమండలాన్ని యజ్ఞ వరాహరూపంలో ఉండి, కోరల కొనలతో ఎత్తుతున్నాడప్పుడు విష్ణుమూర్తి. ‘ఈ వరాహమా విష్ణుమూర్తి’ అని నవ్వుకున్నాడు హిరణ్యాక్షుడు.‘‘నువ్వేనా విష్ణుమూర్తివి? ఇలా పంది రూపంలో పాతాళంలో దాగున్నావా? నీ కోసమే వచ్చానిక్కడకి. రా! నాతో యుద్ధానికి రా.’’ పిలిచాడు హిరణ్యాక్షుడు. పట్టించుకోలేదు విష్ణుమూర్తి. భూమండలాన్ని జలమధ్యం నుండి వెలికి తీసే ప్రయత్నంలో కష్టపడుతున్నాడతను.‘‘యుద్ధానికి రమ్మంటే రావేమిటి? నిన్నే! వినిపించడం లేదా? సిగ్గూ ఎగ్గూ ఉంటే యుద్ధానికి రా.’’ రెట్టించాడు మళ్ళీ హిరణ్యాక్షుడు. అయినా విష్ణుమూర్తి నుంచి సమాధానం లేదు. శక్తియుక్తులన్నీ ఉపయోగించి, భూమండలాన్ని పైకి తీసే ప్రయత్నంలో నిమగ్నమయి ఉన్నాడు విష్ణుమూర్తి. గమనించాడది హిరణ్యాక్షుడు. ఇలా అన్నాడప్పుడు.‘‘ఆ భూమండలం అంతా నా అధీనం. దానిని దొంగిలిద్దామని ప్రయత్నిస్తున్నావేమో! జరగని పని. ఆజ్ఞాపిస్తున్నాను, ఆగిపో.’’ఆ మాటలకి కోపోద్రిక్తుడయ్యాడు విష్ణుమూర్తి. భూమిని నీటి ఉపరితలాన జాగ్రత్తగా నిలిపి ఉంచాడు. దాని ఆధారశక్తి తానై కదలకుండా చేశాడు. హిరణ్యాక్షుణ్ణి కోపంగా చూశాడు. క్షణం కళ్ళు మూసుకున్నాడు. మూసిన కళ్ళు తెరిచేసరికి అతను మణిమయ భూషణాలూ, బంగారు కవచాన్నీ ధరించి కానవచ్చాడు. చేతికి గదాదండం అందింది. మరుక్షణంలో హిరణ్యాక్షుని ఎదుర్కొన్నాడు వరాహమూర్తి. ఇద్దరూ ప్రళయ భీకరంగా యుద్ధం చేయసాగారు. కాలం కరిగిపోతోంది. రోజులూ, వారాలూ, నెలలూ గడిచిపోతున్నాయి. యుద్ధానికి అంతులేకుండాపోతోంది. ఆ యుద్ధాన్ని బ్రహ్మాది దేవతలూ, మునులూ దగ్గరుండి చూస్తూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు.

(ఆంధ్రజ్యోతి - AN Jagannatha Sharma)

కోదండరాం కూరెళ్ల 

https://t.me/koorellaBhagavatham

పోతన భాగవతం 0009

హిరణ్యాక్షుని కథ ఇలా ప్రారంభమయింది.

దక్షుని కూతురు దితి, కశ్యప ప్రజాపతిని పెళ్ళాడింది.ఒకానొక అసురసంధ్య వే ళ ఆమెకి మన్మథోద్రేకం కలిగింది. భర్తను సమీపించింది. కశ్యపుడు అప్పుడు అగ్నిశాలలో ఉన్నాడు. నియమవ్రతుడై భగవంతుని ధ్యానిస్తున్నాడు. తన కోరికను తీర్చమని అడిగింది దితి.‘‘నాథా! మన్మథబాధను తాళలేకుండా ఉన్నాను. రా! నాతో సంగమించు. నా సవతులు అదితి, వినత, కద్రువ…ఇంకా అనేక మంది గర్భవతులు. నేనే గర్భవతి కానిది. సహించలేకపోతున్నాను. నాకు సంతాన భిక్ష పెట్టు.’’ ప్రార్థించింది. నవ్వాడు కశ్యపుడు. ఇలా అన్నాడు.

‘‘నీ మనోభీష్టం తప్పకుండా నెరవేరుస్తాను. అయితే ఇది మూడు సంధ్యలూ ముడిపడే వేళ. ఇది భయంకరులకు కూడా మహా భయంకరమయిన సమయం. రుద్రుడు భూతగణాలతో సంచరించే సమయం. ఈ సమయంలో సంగమించకూడదు. ఓ ఘడియసేపాగు. తర్వాత నీ కోరిక తీరుస్తాను.’’వినలేదు దితి. మన్మథోద్రేకాన్ని తట్టుకోలేకపోయింది. ఒళ్ళు విరుచుకోసాగింది. కామం కళ్ళు కప్పడంతో కశ్యపుని గట్టిగా కౌగిలించుకుంది. విడిపించుకోజూసిన కశ్యపుణ్ణి కదలనీయక, అధరామృతాన్ని అందించింది.‘అంతా దైవప్రేరణ. తప్పదిక.’ అనుకున్నాడు క శ్యపుడు. నిష్ఠని వదలి వేశాడు. దితిని ముద్దిడితూ తీసుకుని వెళ్ళి ఆమె కోరికను తీర్చాడు. తర్వాత నదికి చేరుకుని స్నానం చేసి శుచి అయినాడు. సంధ్యావందనాదులు పూర్తి చేశాడు. మౌనం దాల్చి, బ్రహ్మోపాసన చేయసాగాడు.కోరిక తీరడంతో శరీరం చల్లబడి, తాను చేసిన తప్పేమిటో గ్రహించింది దితి. చేసిన తప్పుకి సిగ్గుపడింది. ఎంతగానో బాధపడింది. భర్తని సమీపించి మన్నించమని వేడుకుంది.‘‘నాథా! నువ్వు చెబుతూనే ఉన్నావు, వినలేదు. పాపాన్ని చేశాను. రుద్రుడికి కోపం కలిగించానేమో! నా గర్భస్థ శిశివుని హింసిస్తాడేమో! దేవతలు ఏ అపకారాన్ని తలపెడతారో! నువ్వే నాకు దిక్కు.’’ అంది దితి.మౌనాన్ని వీడాడు కశ్యపుడు. ఇలా అన్నాడప్పుడు.‘‘జరిగిందంతా విధికృతం. దీనిని తప్పించడం ఎవరితరమూ కాదు. అసురసంధ్యవేళ నన్ను కోరావు కనుక నీకందరూ రాక్షసులే జన్మిస్తారు. నీ కొడుకులిద్దరు మహారాక్షసులై లోక కంటకులవుతారు. దేవతలనూ, మునులనూ హింసించి, ముల్లోకాలనూ ఆక్రమించుకుంటారు. ఆఖరికి ఆ శ్రీహరి చేతిలో మరణిస్తారు.’’దితి అందుకు చాలా దుఃఖించింది.

అయితే కొడుకులిద్దరూ భగవంతుని చేతిలో మరణిస్తారని తెలిసినందుకు కొంతలో కొంత మేలనుకుంది.‘‘నా కడుపున పుట్టిన బిడ్డలంతా రాక్షసులై లోకకంటకులై నానా అల్లరీ చేసి నాకు అమర్యాద కలిగించడమేనా? అంతేనా నా బతుకు? గొప్పవాడు ఒక్కడు కూడా పుట్టే అవకాశమే లేదా?’’ కన్నీరు మున్నీరయింది దితి.‘‘కొడుకుగా పుట్టే అవకాశం లేదు. గొప్పవాడు నీకు మనవడుగా పుడతాడు. రాక్షసుని కడుపున పుట్టినా అతగాడు గొప్ప హరిభక్తుడై పరమ భాగవతోత్తముడు అవుతాడు. సచ్చరిత్రుడై నీకు ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు కలిగిస్తాడు. వాడి కీర్తిని సమస్తలోకాలూ గానం చేస్తాయి. చాలా?’’‘‘చాలు’’ అంది దితి. చేతులు జోడించి నమస్కరించి వెళ్ళిపోయిందక్కణ్ణుంచి. గర్భవతి అయింది. నూరు సంవత్సరాలు గడిచాయి. అప్పుడామె గర్భంలో ఉన్న తేజస్సు దిక్కులన్నిటా అలుముకుంది. ఆ తేజస్సు ముందు సూర్యచంద్రులు వెలవెలబోయారు. ఏది పగలో ఏది రాత్రో తెలియని స్థితి. మునులకీ, దేవతలకీ అంతు చిక్కలేదేదీ. బ్రహ్మని సమీపించారంతా. నమస్కరించారు.‘‘ఏమిటి దేవా, ఏమిటిదంతా?’’ అడిగారు.‘‘ఇదంతా దితి మహిమ. దీనంతటికీ దితి గర్భమే కారణం.’’ అన్నాడు బ్రహ్మ.

తర్వాత జయవిజయులిద్దరూ శాపవశాన ఆమె గర్భాన రాక్షసులుగా జన్మించనున్నారని తెలియజేశాడు. భయపడిన మునులనూ, దేవతలనూ చూసి ఇలా చెప్పాడు.‘‘ఆ రాక్షసులిద్దరినీ శ్రీహరి సంహరిస్తాడు. లోకాల్ని కాపాడుతాడు.’’మునులూ, దేవతలూ అందుకు సంతోషించారు. నిష్క్రమించారక్కణ్ణుంచి.

కోదండరాం కూరెళ్ల 

https://t.me/koorellaBhagavatham

పోతన భాగవతం 0008

యజ్ఞవరాహ మూర్తి వర్ణన విన్నా ఆవిర్భావమును గూర్చి విన్నా, చదివినా, ఉత్తర క్షణంలో కొన్ని కోట్ల జన్మల పాప సంచయము దగ్ధమయిపోతుందని ప్రతీతి. అటువంటి ఘట్టాన్ని ఈరోజు విన్నారు. సూక్ష్మంగా చూద్దాం.


సృష్టిలో ప్రతి ప్రాణికీ ఒక్కొక్క ప్రత్యేక లక్షణం, శక్తి ఉంటాయి. అందువల్ల ఆ లక్షణాలుగల జీవి కొన్ని విషయాల్లో అత్యంత బలసమన్వితమై ఉంటుంది. ఆ కారణంగానే స్థితికారకుడైన విష్ణువు దుష్టశిక్షణ చేయవలసివచ్చినప్పుడు స్వస్వరూపంతో కాకుండా ఆయా ప్రాణుల రూపాల్లోనే అవతారం దాల్చాడంటారు. వాటిలో ఒకటి వరాహావతారం.


వరాహం అంటే పంది. ఈ రూపంలో అవతారం దాల్చడానికి కారణం ఉంది. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు తన బలగర్వంతో భూమినంతటినీ చాపలా చుట్టి పాతాళలోకంలో దాగున్నాడు. బ్రహ్మ సృష్టి అయిన ఈ విశ్వంలో ఏడు వూర్ధ్వలోకాలు, ఏడు అధోలోకాలున్నాయంటారు. అన్నింటిలోనూ అత్యంత ప్రాధాన్యం, ప్రాభవం కలిగినది, వూర్ధ్వలోకాల్లో చేరిఉన్న భూలోకం మాత్రమే. దానిమీదనే మానవాది సర్వప్రాణికోటి నివసించేది. మిగిలిన లోకాలన్నింటి ఉనికికీ కేంద్రస్థానం లాంటిది భూమి. అలాంటి భూలోకం ఉనికికి ప్రమాదం ఏర్పడితే మిగిలిన లోకాల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. ఇదంతా విష్ణువుకు విన్నవించుకున్నారు దేవతలంతా. భూదేవి సైతం తన బాధలను సమగ్రంగా విష్ణువుకు మొరపెట్టుకుంది. తనను రక్షించమని వేడుకుంది. అప్పుడు హిరణ్యాక్షుని చెరనుంచి భూమిని విడిపించడానికి ధరించినదే వరాహావతారం.


ఆ రూపం- పర్వత సమానమై, కొవ్వుపట్టి, బలిష్ఠమైన నల్లని దేహం. చీకట్లను చీల్చుకొని ప్రజ్వరిల్లుతున్న జ్యోతుల్లా ప్రకాశవంతమైన కళ్లు. రెండు దౌడలనుంచి పైకి చొచ్చుకు వచ్చిన ఇనుప కమ్మీల్లాంటి కోరలు. తన పదఘట్టనతో ఎంతటి దుష్టశక్తినైనా అణగదొక్కే సమర్థత కలిగి ఉన్నట్టున్న గిట్టలు. మేఘగర్జనను మించిన 'ఘర్ఘర(పంది అరుపు పేరు) ధ్వని'తో పాతాళంలో దాగిన హిరణ్యాక్షుణ్ని ఎదుర్కోవడానికి అనువైన లక్షణాలతో ఆవిర్భవించిందా వరాహం. పాతాళలోకానికి మార్గమైన సముద్రంలోకి దిగింది. పాతాళలోకం చేరాక అక్కడి వరకూ వ్యాపించి ఉన్న కుల పర్వతాల మొదళ్లను తన ముట్టెతో పెకలించసాగింది. ఆ చర్యతో పర్వతాలు భయపడి హిరణ్యాక్షుడు దాగిన చోటును చూపించాయి. అలా దొరకబుచ్చుకుంది హిరణ్యాక్షుణ్ని. అయినా లొంగక విష్ణువుతో యుద్ధానికి తలపడ్డాడతడు. తనకున్న శక్తినంతా కూడగట్టుకుని వరాహాన్ని కొట్టాడు. తిరిగి తన శరీరానికే దెబ్బతగిలి విపరీతమైన నొప్పి పుట్టసాగింది. దానికితోడు వరాహ రూపధారి అనేక రకాలుగా కొడుతున్న దెబ్బలను తాళలేకపోతున్నాడు హిరణ్యాక్షుడు. పట్టుకుందామంటే దొరకదు, రెండు కాళ్ల సందునుంచి దూరి తప్పించుకుంటోంది. అంతలో అన్నివైపుల నుంచీ హిరణ్యాక్షుడి మీద దాడి చేస్తోంది. అల్పప్రాణిలా కనబడుతున్నా, పైకి కనిపించని శక్తులు కలిగిన వరాహంతో యుద్ధంచేసి అలసి చివరికి మరణించాడు హిరణ్యాక్షుడు. అప్పుడా వరాహమూర్తి పాతాళంలో చుట్టగా పడిఉన్న భూమిని తన కోరలతో పైకి ఎత్తి యథాస్థానంలో ప్రతిష్ఠించాడు. అలా భూమిని ఉద్ధరించిన వరాహమూర్తిని దేవతలందరూ స్తుతించారు.


విష్ణువు మరొక సందర్భంలో కూడా వరాహరూపం దాల్చవలసి వచ్చింది. అది అవతారం కాదు. రూపం మాత్రమే. ఎప్పుడంటే... అది కల్పాంతం ముగిసిశాక కొత్త జగతికి ప్రారంభ సమయం. అంతవరకూ జలమయమై ఉన్న బ్రహ్మాండాన్ని ఏడు వూర్ధ్వ భాగాలుగా, ఏడు అధో భాగాలుగా విభజించి ఆయా లోకాల్లో అవసరమైన వనరులను కూర్చుతున్నాడు విష్ణువు. ఆ ప్రక్రియలో భాగంగా భూమిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలనే తలంపుతో అనేక పర్వతాలు, నదులు, సముద్రాలను సమకూర్చుతున్నాడు. ఆ భారాన్ని తాళలేక భూమి కిందికి కుంగిపోసాగింది. ఆ దశలో విష్ణువు వరాహ రూపం ధరించి తన కోరల మీద భూమిని ఉంచుకున్నాడు. ఆ స్థితిలో భూమిని స్థిరంగా నిలపడానికి అష్టదిగ్గజాలను ఆసరాగా ఏర్పరచి, వాటి తొండాలమీద భూమిని ప్రతిష్ఠించాడు. అప్పటినుంచి ఆ దిగ్గజాలే భూమి గతితప్పకుండా కాపాడుతున్నాయని పురాణ కథనం. అలా అవతరించిన వరాహరూపాన్ని యజ్ఞ వరాహరూపం అంటారు.


రెండుసార్లు వరాహరూపం దాల్చడం వల్లనే వరాహ జయంతి విషయంలో సందిగ్ధం నెలకొంది. సృష్ట్యాదిలో భూమిని సుప్రతిష్ఠితం చేయడానికి ఎత్తిన యజ్ఞవరాహ జయంతి చైత్ర బహుళ త్రయోదశినాడు, హిరణ్యాక్షుడి బారినుంచి భూమిని రక్షించడానికి ఏర్పడిన వరాహరూప జయంతి భాద్రపద శుక్ల తృతీయ అని గ్రంథాల ఆధారంగా వెల్లడవుతోంది.


వరాహ రూపంలో ఉన్న విష్ణువుకు ప్రత్యేకంగా ఆలయాలు లేవు. ఆ తరవాతి అవతారమైన నరసింహావతారంతో కలిసి సింహాచలంలో 'వరాహ లక్ష్మీనరసింహ స్వామిగా పూజలందుకొంటున్నాడు.

                                              (అయ్యగారి శ్రీనివాసరావు - భక్తిసాగర్)

కోదండరాం కూరెళ్ల 

https://t.me/koorellaBhagavatham

పోతన భాగవతం 0007

 పోతన భాగవతం 0007

ఈరోజు కధకు అనుసంధానంగా పోతన భాగవతం  ద్వితీయస్కంధం లో శుకమహాముని వారి విరాట్స్వరూప వర్ణన చూద్దాం. 

 

పరీక్షిత్తు విభుడా! విను, భగవంతుడైన విష్ణుని విరాటస్వరూపంలో జరిగిన, జరగనున్న, జరుగుతున్న ప్రపంచమంతా గోచరిస్తుంది. భూమి, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారము, మహత్తత్త్వము అనే ఆవరణాలు ఏడూ మహాండకోశమైన విరాట్పురుషుని శరీరమే అయి ఉన్నాయి. ఆ శరీరంలో ధారణకు నెలవై విరాట్పురుషుడు ప్రకాశిస్తున్నాడు. ఆ మహాత్ముడికి పాతాళం అరికాలు; రసాతలం కాలిమడమ మునివ్రేళ్ళు; మహాతలం చీలమండలు; తలాతలం పిక్కలు; సుతలం మోకాళ్ళు రెండు; వితలము అతలము తొడలు; భూతలం పిరుదు; ఆకాశం బొడ్డు; గ్రహాలూ తారకలూ మొదలైన జ్యోతిస్సమూహంతో కూడిన నక్షత్రలోకం వక్షస్థలం; మహర్లోకం మెడ; జనలోకం ముఖం; తపోలోకం నొసలు; సత్యలోకం శిరస్సు; ఇంద్రుడు మొదలైనవారు భుజదండాలు; దిక్కులు చెవులు; శబ్దం శ్రోత్రేంద్రియం; అశ్వినీ దేవతలు ముక్కుపుటాలు; గంధం ఘ్రాణేంద్రియం; అగ్ని నోరు; అంతరిక్షం కళ్లు; సూర్యుడు నేత్రేంద్రియం; రేయింబవళ్ళు కనురెప్పలు; బ్రహ్మపదం కనుబొమలు; జలాలు దవడలు; రసం జిహ్వేంద్రియం; సమస్త వేదాలు భాషణాలు; తుదిలేని సృష్టులే కడగంటి చూపులు; సిగ్గు లోభం పెదవులు; ధర్మ మార్గాలు కడుపు; కొండలు ఎముకలు; నదులు నాడులు; చెట్లు రోమాలు; వాయువు నిట్టూర్పులు; కడలేని కాలమే ప్రాయం; పలువిధాలైన ప్రాణులతో గూడిన సంసారాలు కర్మలు; మబ్బులు శిరోజాలు; సంధ్యలు కట్టుబట్టలు; ప్రధానం హృదయం; చంద్రుడు వికారాలన్నింటికీ నెలవైన మనస్సు; మహత్తత్త్వం చిత్తం; రుద్రుడు అహంకారం; గుర్రాలు, కంచరగాడిదలు, ఒంటెలు, ఏనుగులు గోళ్ళు; పశువులు, మృగాదులు కటిప్రదేశం; పక్షులు చిత్రమైన మాటల నేర్పులు; మనువు బుద్ధి; పురుషుడు నివాసం; దానవులు వీర్యం. అంతేకాదు. ఆ మహాప్రభువునకు బ్రాహ్మణులు ముఖం; క్షత్రియులు బాహువులు; వైశ్యులు తొడలు; శూద్రులు పాదాలు; వసువులు రుద్రులు మొదలైన పెక్కు దేవతల పేర్లే నామాలు; హవిర్భాగాలు ద్రవ్యాలు; యజ్ఞప్రయోగాలు కర్మలు అవుతున్నాయి. ఇటువంటి విశ్వమయుడైన విరాట్పురుషుని విగ్రహాన్ని మోక్షార్థి అయినవాడు తన మనస్సులో అనుసంధానం చేసుకోవాలి.” అంటూ చెప్పి, ఇంకా ఈ విధంగా చెప్పసాగాడు శుకముని.


కురు కులపావనుడవైన రాజా! విశ్వమంతా విష్ణుమయం. విష్ణువు విశ్వమయుడు. ఇందులో సందేహం లేదు. విష్ణుమయం కాని పదార్థం ఈ ప్రపంచంలో ఒక్క పరమాణువు కూడా లేదు.


రాజా! కలలు కనేటప్పుడు జీవుడు ఉబలాటంతో పలు శరీరాలు తాలుస్తాడు. పలుపేర్లతో వ్యవహరింప బడతాడు. ఇంద్రియాల ద్వారా విశేషాలన్నీ గమనిస్తాడు. పిమ్మట మెళకువ వచ్చిన తరువాత, తన్ను తాను తెలుసుకుంటాడు. ఇలాగే సమస్తానికి అంతరాత్మగా ఉన్న పరమేశ్వరుడు, సర్వ ప్రాణుల హృదయాలలో ఉండి ప్రజ్ఞావంతుడై బుద్ధివ్యాపారా లన్నింటినీ పరిశీలిస్తుంటాడు. తానే అన్నిటికీ ప్రభువు కాబట్టి, దేనికీ బద్ధుడు కాడు. తాను సత్యస్వరూపుడు. ఆనదంతో నిండిన విజ్ఞానమూర్తి. ఆయన సేవ వల్లే మోక్షం సిద్ధిస్తుంది. ఇతరులను కొలిస్తే మోక్షం లభించదు. ఈ సంసార బంధం వదలదు. స్వస్తి.

కోదండరాం కూరెళ్ల 

https://t.me/koorellaBhagavatham

Saturday, 12 June 2021

పోతన భాగవతం 0007

భాగవతం 12 అంతస్తుల భవనం. దాని నిర్మాత శ్రీమహావిష్ణువు. ఈ భవన నిర్మాణం జరిగి చాలాకాలమైనా నిత్యనూతనంగా ఉంది. భాగవత భవనంలో ప్రవేశించి ఎందరో తరించారు. అనేకులు తరిస్తున్నారు. ఇంకా ఎందరో తరించనున్నారు. ఆభవనంలో ప్రవేశించిన భాగవతులు ఎవరు, ఎలా తరించారో తెలుసుకుందాం. 

ఈ భాగవతం పరీక్షిత్తు మహారాజుకు శుకమహర్షి భోదించారు. శృంగి శాపంతో రాజు చనిపోయాడు, ఏడు సంవత్సరాల వయసు కలిగిన శృంగికి పరిక్షిత్తుకి శాపం పెట్టగలిగే శక్తి ఎలా వచ్చింది అనే సందేహానికి సమాధానం శృంగి వెనుక 21 తరాలవారు అబద్దం ఆడక సదాచార సంపన్నులై ఉన్నారు. ఆ ప్రభావంతోనే శృంగికి శాప శక్తి కలిగింది. 

శాపగ్రస్తుడైన పరీక్షిత్తు శుకులవారితో మహాత్మా, శృంగి శాపం వల్ల నాకు ఏడు రోజులలో మృత్యువు తప్పదని తెలుసుకున్నా, మృత్యువు వల్ల నాకు భయం లేదు. కానీ మిమ్మల్ని నేను ఈ ఏడు రోజులలో మోక్షమునకు మార్గం తెలుపమని ప్రార్ధిస్తున్నాను అన్నాడు. 

రాజా.. కలియుగ మానవులకు దేనివల్ల దుఃఖ నివృత్తి, మోక్షప్రాప్తి ఎలా లభిస్తుందో ఆ సులభ ఉపాయం నీవు శ్రద్దగా విను అంటూ శుకమహర్షి ఇలా చెప్తున్నారు. 

మనిషి ఆయుష్షుని రాత్రి పగలు అనే రూపంతో సూర్యచంద్రులు హరించివేస్తున్నారు. అది తెలియక ఇంకా చాలా కాలం జీవిస్తామని కొందరు, అసలు మనకు మృత్యువు ఉంది అని కలలో కూడా తెలియని మహానుభావులు కోకొల్లలుగా ఉన్నారు. 

ఈ మాయా మోహంలో పది కాలాన్ని, మృత్యువును మరిచిన మనుషులను యమభటులు వచ్చి తీసుకుపోతున్నప్పుడు పాపినై పుణ్యానికి దూరమయ్యానని పశ్చాత్తాపపడితే ప్రయోజనం ఏమిటి? పవిత్రమైన మానవ జన్మకు మట్టి కలిపినట్లే కదా. మళ్ళీ రమ్మంటే వస్తుందా ఈ మానవజన్మ..? కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. భక్తులలో అగ్రగణ్యురాలైన కుంతీ దేవి శ్రీకృష్ణ పరమాత్మనే తన సర్వస్వంగా భావించి తరించిన సాధ్వి, చేసిన మేలును మరవకూడా ఆమె పరమాత్మను స్తుతించిన తీరు. ఇలా ఉన్నది. 

"మహాత్మా.. నీ దయవల్ల పాండవ వంశాంకురమైన పరీక్షిత్తు జననం కలిగింది. పాండవ వంశ దీపాంకురానికి నీ డయ్యు కారణం. నా హృదయం సంతోషంతో నిండిపోయింది. భక్తవరదుడివైన నీవు నేను కోరే వరాన్ని ఇవ్వడానికి బాధపడతావు, మాకు చేసిన మేలు చాలు. నీవు ద్వారకకు విచ్చేయి తండ్రి అని అన్నది. 

భక్తుల కోరిక మేరకు వరాలు ఇచ్చి వారి అభీష్టాలు తీర్చడం నా కర్తవ్యమ్ కదా తల్లీ, వరం కోరుకోమన్నాడు స్వామి చిరునవ్వుతో. 

ఆ మాటకు కుంతీ దేవి, " మహాత్మా, నీవు నాకు వరం ఇవ్వదలిస్తే నా జీవితాంతం వరకు నాకు కష్టాలు, బాధలు తొలగకుండా ఉండేలా అనుగ్రహించు" అంది. 

దానికి శ్రీకృష్ణభగవానుడు, "బాల్యం నుండి నీ జీవితం  కష్టాలతోనే నడిచింది. ఇంకా ఎందుకు మాతా నీకు  ఈ వరం" అని అడిగారు. 

దానికి ఆమె "కష్టాలలో ఉండబట్టే కదా నీవు ద్వారక ను విడిచి , భార్యలను విడిచి , నీ బంధువులను, పుత్రులను, మిత్రులను విడిచి మాతోనే ఉన్నావు. మేము ఐశ్వర్యంతో, వైభవంతో విలసిల్లి ఉంటె నీవు మా దరిదాపులకు కూడా రావు కదా కృష్ణా.. నీతోటి జీవితమే సంపద.. నీ మరపే ఆపద " అంది కుంతీదేవి.  ఇది భాగవతం మొదటి అంతస్థులో కుంతీ దేవి సాధించిన ఘనత. 



https://t.me/koorellaBhagavatham

పోతన భాగవతం 0006

ధర్మ శాస్త్రాల ప్రకారం మానవుడు చేసిన తప్పులకు, పాపాలకు ఫలితం దు:ఖం రూపంలో అందుకుంటాడు. ప్రతి ఒక్కరూ తెలిసో లేక తెలియకో ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటారు. 

పురాణాల ప్రకారం కలియుగంలో ఈ నాలుగు ప్రదేశాల్లోనే భూతాలు ఉన్నట్లు నమ్ముతారు. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు కొంత కాలం హస్తినాపురను పాలించారు. పాండవుల మరణం తర్వాత రాజ్య బాధ్యతలను పరీక్షిత్తు స్వీకరించాడు. అప్పటికి ద్వాపర యుగం చివరి అంకంలో ఉంది. అంతే కాదు కలియుగ ఆరంభ కావడంతో దోపిడీలు, పాపాలు పెరగడంతో పరీక్షిత్తు మహారాజు ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

కలిని వేటాడి యుగాన్ని ముగించడానికి విల్లు ధరించి బయలుదేరాడు. దీంతో మరణానికి భయపడి పరీక్షిత్తుకు కలి లొంగిపోయాడు. 

ఓ రాజా! బ్రహ్మ నాలుగు యుగాలను సృష్టించాడు... అవి సత్య లేదా కృత‌, త్రేతా, ద్వాపర, కలి యుగం. సత్య యుగం 17,28,000 సంవత్సరాలు, త్రేతా యుగం 12,96,000 సంవత్సరాలు, ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు, ప్రస్తుతం నా యుగం అంటే కలియుగ సమయం వచ్చింది. ఇది 4,32,000 ఏళ్లు ఉంటుంది. ఈ సామ్రాజ్యం నుంచి నన్నే వెళ్లిపోమని అంటున్నావు అని కలి పేర్కొన్నాడు. నేను ఎక్కడకు వెళ్లాలో నువ్వే చెప్పు అన్ని ప్రశ్నించాడు. ఈ మాటలు విన్న పరీక్షిత్తు యుగ ఆరంభం చేయమని కలికి అనుమతి ఇచ్చాడు. కానీ కేవలం నాలుగు ప్రదేశాలకు మాత్రమే అనుమతి ఇస్తానని అన్నాడు. 

ఇందులో మొదటిది మద్యం అమ్మే స్థలం. మద్యపానం చేసే ప్రాంతంలో కలి తొలి ప్రవేశం. 

రెండోది వ్యభిచార గృహాలు. 

మూడోది హంతకులు, జంతువులను క్రూరంగా హింసించే ప్రదేశాలు. 

నాలుగోది జూద గృహాల్లో ఉండాలని పరీక్షిత్తు ఆదేశించాడు. దీనికి అంగీకరించిన కలి ఓ రాజా ఇవన్నీ చెడు ప్రాంతాలు కాబట్టి మంచి వారు రారు. కనీసం గౌరవంగా ఉండే ఒక ప్రాంతంలో చోటు కల్పించాలని కోరాడు. 

కలికి కోరిక ప్రకారం బంగారంలోనూ ఉంటావని పరీక్షిత్తు అన్నాడు. పరీక్షిత్తు మహారాజు అలా చెప్పగానే కలి ఆయన కిరీటంలోకి దూరిపోయాడు. ఈ విషయాన్ని అతడు కూడా గమనించలేదు. 

తన కుటుంబం కూడా చాలా పెద్దదని, ఇందులో కామం, కోపం, దురాశ, అసత్యం, అహంకారం, అసూయ, లోభం సభ్యులని పరీక్షిత్తుకు తెలిపాడు.

కోదండరామం  కూరెళ్ల 

https://t.me/koorellaBhagavatham

పోతన భాగవతం 0005

శౌనకాది మహర్షులతో పరీక్షిన్మహారాజు పుట్టుక తరువాతి కథా విధానం‌ చెబుతున్నారు సూత పౌరాణికులు.

పట్టాబిషిక్తుడైన ధర్మరాజుగారు సుఖంగా రాజ్యం చేసుకుంటూ, తమ్ముళ్ళతోనూ, మనవడి ముద్దూముచ్చట్లతోనూ కాలం గడుపుతున్నారు. ఒకనాడు విదురుడు గుడ్డిరాజును చూడటానికి వెళ్ళాడు.  ఈ విదురుడు నిజానికి యముడు.

ఒకప్పుడు మాండవ్యుడనే ముని శాపం కారణంగా యమధర్మరాజు భూలోకంలో శుద్రుడిగా జనించవలసి వచ్చింది.  ఆ కథ సంక్షిప్తంగా చెప్పుకుందాం.

మాండవ్యుడు కళ్ళుమూసుకుని తపస్సు చేసుకుంటున్నాడు తన ఆశ్రమంలో. 

ఒక రాత్రి ఆయన ఆశ్రమంలో దొంగలు పడ్డారు.  అబ్బే,  వాళ్ళేమీ‌ దొంగతనం చేయటానికి రాలేదు.  అయినా ఆయన దగ్గర ఏం‌ ఉంటుందనీ!  వాళ్ళు ప్రాణభయంతో‌ రాజభటుల్ని తప్పించుకుని పారిపోతూ మాండవ్యుడి ఆశ్రమంలో ప్రవేశించారు.  ఆ దొంగలు ఇలాంటీ అలాంటీ తప్పు చేయలేదు - ఏకంగా రాజుగారి అంతఃపురంలో దూరి రాజకుమారుణ్ణి చంపి నగలు దోచుకు పోయారు.   రాజభటులు వెంట పడరూ‌ మరి? 

ఆశ్రమంలో దూరినా వాళ్ళకు ఆ గుడిసె భద్రంగా తోచలేదు.  దానితో తాము దోచుకొచ్చిన సొత్తు యావత్తూ అక్కడే వదిలేసి పారిపోయారు.  రాజభటులు వచ్చి మాండవ్యుడే దొంగ అనీ మునివేషంలో నాటకం ఆడుతున్నాడనీ భావించి ఈడ్చుకు పోయారు.

రాజుగారు కూడా, అసలే పుత్రశోకంలో ఉన్నాడేమో,  విచారణ చేయకుండానే,  ఈ దొంగని శూలానికి గుచ్చండి అని శిక్ష వేసేసాడు.  ఇంత జరుగుతున్నా,  మాండవ్యుడు లోకవ్యవహారం ఏమీ పట్టించుకోకుండా మౌనంగానే ఉండి పోయాడు.  భటులు మాండవ్యుడిని ఊరి బయటకు తీసుకుపోయి శూలానికి  గుచ్చారు.   మాండవ్యుడు అదీ‌ మౌనంగానే భరిస్తున్నాడు.

ఆ రాత్రి, అనేక మంది మహర్షులు వచ్చి మాండవ్యుడిని దర్శించి ఎంతో గొప్పగా స్తుతించారు.  మాండవ్యుడు వాళ్ళతో ఈ శరీరం గురించి బాధపడటం‌ అనవసరం అనీ, తన తపస్సుకు ఈ శిక్ష యేమీ ఆటంకం‌ కాదనీ చెప్పాడు. 

కాపలా భటులు ఈ‌ సంఘటన చూసి విస్తుపోయి, రాజు వద్దకు పోయి చెప్పారు.  రాజుగారు భయంతో గడగడ లాడుతూ వచ్చి మాండవ్యుడికి శతకోటి క్షమాపణలు చెప్పుకున్నాడు.   శూలం పూర్తిగా బయటకు రావటం‌ లేదు. చేసేది లేక కొద్దిగా మొన లోపలే వదిలేసి,  శూలాన్ని కోసి తీసివేసారు.  అప్పటినుండీ ఆమునికి అణిమాండవ్యుడు అన్న పేరు వచ్చింది (అణి అంటే మొన)

మాండవ్యుడు తిన్నగా యమలోకానికి పోయి యముణ్ణే అడిగాడు.  మహానుభావా సమవర్తీ, ఏ తప్పు చేసానని నాకీ  శిక్ష పడిందీ‌ అని.  ఆయన మాండవ్యుడికి నమస్కరించి చెప్పాడు. మహామునీ, గత జన్మలో నీవు ఏడేళ్ళ పిల్లవాడిగా ఉన్నప్పుడు తూనీగలని పట్టుకునే‌ వాడివి ఆటగా. ఐతే అంతటితో‌ ఆగకుండా,  ఆ తూనీగలను ఈను పుల్లలకు గుచ్చి అవి విలవిల లాడుతుంటే వినోదించే వాడివి. అందుకే ఈ‌జన్మలో నీకీ‌ శిక్ష విధించబడింది అని చెప్పాడు యముడు.

మాండవ్యుడు విస్తుబోయాడు.  ఏమిటీ ఏడేళ్ళ పిల్లవాడి పనులకు శిక్షా? నీకు తెలియదా? పద్నాలుగేళ్ళు వచ్చేదాకా చిన్నపిల్లలు చేసిన పనులకు తల్లిదండ్రులే‌ బాధ్యులు. ఊహ తెలియని పిల్లలకు తప్పు వేయకూడదు.

ఇంత చిన్న విషయంలో పరాకుగా ఉన్నావే? అందుకని ఈ‌ దోషం పోవటానికి భూలోకంలో శూద్రుడిగా జన్మించు అని శపించాడు మాండవ్యుడు.  ఆ శాపం కారణంగా యముడు విదురుడిగా జన్మించాడు. 

భూలోకంలో యముడు విదురుడిగా ఉన్నది నూరేళ్ళ పైచిలుకు కాలం. అన్నాళ్ళూ అర్యముడు అనే పితృదేవుడు యముడి స్థానంలో ఉన్నాడు.

యముడి అవతారం అయిన విదురుడు  ధృతరాష్ట్ర మహారాజు మందిరంలో ఆయన్ను చూసి నాలుగు మంచి మాటలు చెప్పాడు.

రాజా,  మనుషులు బంధువులతోనూ, భోగాలతోనూ హాయిగా ఉన్నామనుకుంటారు.  కాలం తరుముకుని వస్తోందని మాత్రం ఏమీ ఆలోచించరు!  ముసలితనం మీదపడినా, ఇంకా భోగాలూ జీవితాశలతోనే ఉంటారు.  అయినా మృత్యువు తప్పదు కదా?  నువ్వే‌మైనా ఈ‌ విషయం ఆలోచించుకున్నావా?  నీ పరిస్థితిని గమనిస్తున్నావా?

నువ్వా పుట్టుగుడ్డివి. పెద్దవాడివి.  ఏమన్నా మహాభోగాల్లో ములిగి తేలుతున్నావా అంటే అదేమీ‌ లేదాయె.ముసలాడివి. నీ చుట్టాలెవరూ కూడా బతికి లేరు.  ఎందుకయ్యా, ఇంకా మీ మొగుడూ పెళ్ళాలు, ఏడుస్తూ దాయాదుల కొంపలో పడి తింటున్నారూ?  ఇదేమన్నా బాగుందా?

ఏం‌ గౌరవంలే. మీరు చేసినవి ఎంతలేసి పనులనీ!  వాళ్ళను విషం పెట్టి చంపాలని చూసారు. వేరు పెట్టారు. కొంపకి నిప్పుపెట్టి చంపాలని చూసారు. ఇక్కడికి పిలిపించి, వాళ్ళనీ వాళ్ళ భార్యనీ దారుణంగా అవమానించారు.  అయినా వాళ్ళు ఉదారంగా ఇంత తిండి పెడుతున్నారు మీకీ ముసలితనంలో.  అలా వాళ్ళ దయాధర్మభిక్షం తిని బతక్క తప్పదా?  

రోజూ భీముడు ఎంతలేసి మాటలంటున్నాడో వినబడటం లేదా? పిల్లలకి బుధ్ధి చెప్పక ఇలా అయిపోయిన ముసలాళ్ళు మన నెత్తిన పడ్డారు గదా!   ఏం చేస్తాం, వాళ్ళకి ఇంత పిండం వండి పడేస్తున్నాం అని వాడు రోజూ అంటుంటే ఆ అన్నం మీకు ఎలా నోటికి పోతోందయ్యా?   ఏమయ్యా, ఇంకా బతికి మీరు పిల్లల్ని కనాలా పెంచాలా? మనవల్నెత్తాలా?  రాజభోగాలు సంపాదించి బ్రాహ్మల్ని పిలిచి దానాలివ్వాలా?  ఎందుకొచ్చిన బతుకయ్యా ఇక్కడ?  ఇదిగో వింటున్నావా?

ఈ శరీరం ఏమాత్రమూ‌ శాశ్వతం‌ కాదూ ఎప్పటికైన పోయేదేలే అని తెలుసుకుని శరీరమోహం వదిలేయాలి. అలా దేహభ్రాంతి వదిలి సిధ్ధులూ మునులూ ఇళ్ళు వదిలేస్తారని తెలుసుకో.  అలా ఇల్లూ వాకీలీ అనే ఇరుకు నించి బయటపడిన మనిషి ఒక మునిలాగా సిధ్ధుడిలాగా ఉత్సాహంగా యోగవృత్తి అవలంబించి మోక్షం సంపాదించుకుంటాడు.

అలా విదురుడు మార్గోపదేశం చేయగానే ధృతరాష్ట్రుడికి ఉన్న కాస్త మోహపాశమూ తెగిపోయింది.  సంతోషంగా విదురుడు చెప్పిన జ్ఞానమార్గంలో ముందుకు పోవాలని నిశ్చయించు కున్నాడు.  గాంధారీమహాదేవికి కూడా విదురుడు చెప్పిన మాటలు కనువిప్పు కలిగించాయి. ఆవిడ కూడా సంతోషంగా భర్తతో పాటు బయలుదేరింది. 

ఇద్దరు వృధ్ధులూ పరమానందంగా అంతఃపురం వదిలిపెట్టి, హస్తినాపురం వదిలి పెట్టి, హిమాలయాలకేసి సాగిపోయారు.

కోదండరామం  కూరెళ్ల 

https://t.me/koorellaBhagavatham

పోతన భాగవతం 0004


ఈరోజు భాగవత కధలో అంపశయ్య పైనున్న భీష్ముల వారిని ధర్మరాజు సామాన్య ధర్మాలు అడిగి తెలుసుకున్నారని వచ్చింది. ఇది విస్త్రృతంగా భారతంలో ఉంది. మచ్చుకి ఒక సంభాషణ పొందు పరుస్తున్నాను.

భారతం యొక్క శాంతిపర్వం లోని చతుర్ధాశ్వాసంలో వచ్చే భీష్మ-ధర్మరాజుల సంభాషణ!

ధర్మరాజు "పితామహా ! నరుడు చేసే కర్మలకు అతడి పూర్వజన్మ సుకృతాన్ని అనుసరించి సుఖదుఃఖములు, శుభాశుభములు ఉంటాయి కదా ఆ కర్మల కర్త అతడేనా ! కాదా ! అని నాకు అనుమానంగా ఉంది దానిని వివరించండి " అని అడిగాడు. 

భీష్ముడు ! ధర్మనందనా ! ఒక సారి ఇంద్రుడు ప్రహ్లాదుడి మధ్య జరిగిన సంవాదము వింటే నీ సందేహము తీరుతుంది. సత్వగుణ సంపన్నుడు, ఎల్లప్పుడూ సంయమనం పాటించే వాడు, అహంకారము లేని వాడు, కోపమంటే తెలియనివాడు, నిందను స్తుతిని సమానంగా పరిగణించేవాడు, ఇనుమును బంగారమును సమానంగా విలువ కట్టేవాడు అయిన ప్రహ్లాదుడు తన మందిరములో కూర్చుని ఉండగా ఇంద్రుడు అతడి అంతరంగం తెలుసుకోవాలని అక్కడకు వచ్చి " ప్రహ్లాదా ! నీవు సంపద లేకున్నా దుఃఖించవు, శత్రువుల చేతికి చిక్కుతానన్న భయము లేదు, అసలు ఏమీ చేయవు ఇంతటి బేలగా ఉంటే ఎలా ? " అని అడిగాడు. 

ప్రహ్లాదుడు " ఇంద్రా ! కలిమి లేమి పక్క పక్కనే ఉంటాయి. సంపదలు ప్రయత్నిస్తే వస్తాయి లేకున్న రావు అనుకోవడము నీ బేలతనమే ! సంపదలు సంపాదించనవసరం లేదు విధి అనుకూలిస్తే వచ్చి పడతాయి ప్రతికూలించిన హారతి కర్పూరంలా కరిగి పోతాయి. దీనికి మానవ ప్రయత్నముతో పని లేదు. 

శత్రువులు ఓడించడం, మిత్రులు కాపాడడము, సంపదల రాకపోక అంతా విధిలిఖితమే. మానవుడి మనసును అనుసరించి భావాలుపుడతాయి, పోతాయి. చంచలమైన మనసులోని భావాలు చంచలమైనవే అని తెలుసుకుని మనసుని నిగ్రహించాలి. తన పనులన్నిటికీ తానేకర్తను అనుకోవడము అవివేకము. అలా అయితే మానవులు చేసే కర్మలన్నిటికీ సమ ఫలితాలు ఉండాలి కదా ! 

అఖిలకర్మలకు కర్త ఆ పరమేశ్వరుడే కాని మానవుడు కాదు. తాను చేసే కర్మలకు తానేకర్తను అన్న అహంకారంతో కర్మలు చేసే వాడికి కర్మఫలం అంటు కుంటుంది. ఫలాపేక్ష లేక కర్మలనుచేస్తూ సుఖదుఃఖాలకు  లోను కాక మనసు నిలకడగా ఉంచుకున్న వాడు మహనీయుడు. కనుక దేవేంద్రా ! నేను ఈ లోకములో ఉన్న సకల ప్రాణులకూ అనిత్యములే అని అసత్యాలని తెలుసుకుని సంసార బంధంలో చిక్కక సంతోషంతో ఉంటాను. శాంతితోను ఇంద్రియనిగ్రహం తో ఉండే వాడికి చింతలు దరిచేరవు. నేను అలా నిశ్చింతగా జీవిస్తున్నాను " అని ప్రహ్లాదుడు అన్నాడు. 

ఇంద్రుడు " దానవేంద్రా ! నీకు ఇంతటి ప్రశాంతచిత్తము ఎలా అలవడింది చెప్పవా ! " అని అడిగాడు. 

ప్రహ్లాదుడు " దేవేంద్రా ! ఆత్మావలోకనము, మంచిప్రవర్తన, మనసును ప్రసన్నంగా ఉంచుకోవడము, అప్రమత్తత, పెద్దలను వృద్ధులను గౌరవించుట లాంటి ఉత్తమ లక్షణాలు మానవులకు మేలుచేసి మానవుడికి ప్రజ్ఞా శాంతి ఇస్తాయి. ఇది విన్న ఇంద్రుడు ఆశ్చర్యముతో తిరిగి స్వర్గానికి వెళ్ళాడు " అని చెప్పాడు. స్వస్తి.


కోదండరామం  కూరెళ్ల 

https://t.me/koorellaBhagavatham

పోతన భాగవతం 0003

 నారద జన్మ వ్రృత్తాంతం.


వేదాల్ని సమకూర్చి, మహా భారతాన్ని వ్రాసి, ఎన్నో పురాణాల్ని రచించినా వేదవ్యాసుల వారికి చిత్త శాంతి కలగ లేదు. అటువంటి పరిస్థితిలో నారదుల వారు వారి వద్దకు వచ్చి ఈ విధంగా చెప్తారు.


"మునీంద్రా! ఈ విశ్వమంతా ఆ శ్రీ మహావిష్ణువే. ఆతనికి మించినది,వేరైనది ఏదీ ఈ విశ్వం లోలేదు. సర్వ సృష్టి, స్థితి, వృద్ధి, లయాలన్నీ ఆ పరమేశ్వరుని వలననే జరుగునని నీకు తెలిసిన విషయమే కదా! నీవు ఈ లోకకళ్యాణానికై వ జన్మించిన వాడవు. కావున ఆ హరి లీలలన్నిటినీ భాగవత కథారూపాన లోకానికి వివరించు. ఆ కమలనాభుని కీర్తించగలిగినప్పుడే కదా సర్వ రూపమైన తపస్సులూ, సర్వమైన సంపదలూ సఫలాలౌతాయి!


మహాత్మా! నేను నా పూర్వజన్మలో (ఇంతకు ముందు కల్పాన) సదాచారులైన వేదవిదుల ఇంటి దాసికి జన్మించాను. వాళ్ళు,నా చిన్నతనంలో ఒక వానాకాలంలో, చాతుర్మాస్య వ్రతం చేస్తూ వున్న యోగులకు పరిచర్య చేయటానికి నన్ను నియమించారు.


(చాతుర్మాస్య వ్రతం ఆషాఢ శుద్ధ ఏకాదశి-శయనైకాదశి తో మొదలై కార్తీక శుద్ధ ఏకాదశి-ఉత్థాన ఏకాదశితో ముగుస్తుంది.ఈ నాల్గునెలలూ నిత్య సంచారులైన యోగులు దేశ సంచారం చేయకుండా  ఒకేచోట ఉండి ఆ నారాయణున్ని అర్చిస్తారు.)


నేను నేర్పుగా,ఓర్పుగా అన్ని పనులు చేస్తూ, అందరు పిల్లల్లాగా ఆటలకు వెళ్ళక, ఏ ఇతర వ్యాపకం పెట్టుకోక భక్తితో వారిని సేవించాను. వారు మిగిల్చిన ఎంగిలి మహాప్రసాదంగా భావించి భుజిస్తూ,ఎండ వానల్ని లెక్కచేయకుండా వారిని వర్షాకాల, శరత్కాలాలు సేవించాను. వాళ్ళు విష్ణుచరితలు చదువుతూ, పాడుతూ ఉంటే, అవి నా చెవులకు అమృతంలా అనిపించేవి. మనసుకు అపరిమితమైన ఆనందం కలిగేది. దానితో నేను కూడా హరినామకీర్తనం చెయ్యటం మొదలెట్టాను. అలా ఆ మహాజనులవల్ల నాలో రజస్తమోగుణ హారిణియైన ’భక్తి’ కలిగింది.


కొంతకాలానికి వారి చాతుర్మాస్య వ్రతం ముగిసి, ఆ యోగులు తిరిగి దేశాటనానికి బయల్దేరారు. అంతట వారు, ఎటువంటి అపచారం లేకుండా భక్తితో నిత్యపరిచర్య చేసిన నన్ను పిలిచి, పరమ ప్రీతితో, కరుణతో నాకు అతిరహస్య మైన జ్ఞానాన్ని ఉపదేశించారు.


ఆ ఉపదేశం వల్ల వాసుదేవుని తత్వాన్ని తెలుసుకున్నాను. ఏ పదార్థం వలనైతే వ్యాధి వస్తుందో, ఆ వ్యాధి మాన్చటానికి అదే పదార్థం ఎలా పనికిరాదో, అలానే సంసారహేతుకమైన కర్మలు భగవత్ సన్నిధానానికి ప్రతిబంధకాలుగా మారతాయి. వాటిని భగవదర్పితంగా భావించి ఆచరించాలి.అప్పుడు  భక్తియోగం కలుగుతుంది. నేను ఆ విధంగా చేయగా, ఆ హరి సంతసించి జ్ఞానాన్ని నాకు ప్రసాదించాడు.


అలా రోజులు గడుస్తున్నాయి. నా తల్లి మా యజమానుల ఇంట భక్తితో పనులన్నీ చేసి, నావద్దకు రేపు మాపు వచ్చి నేను అలసిపోయానని నన్ను ముద్దాడి, కౌగిలించుకుని ప్రేమగా ఒళ్ళంతా నిమిరేది. ఒకనాటి రాత్రి, నా తల్లి పాలు పితకటానికి వెళ్ళ్గి చీకటిలో చూడక పాముతోక తొక్కగా, అది వెంటనే నా తల్లిని కరిచింది. ఆ విషప్రభావాన నా తల్లి మరణించింది. అది చూచి నేను మోహం పొందక, సంసార బంధాలు తొలగిపోయాయని భావించి, విష్ణుపద ధ్యానం మీద బుద్ధి నిలిపి ఇల్లు వదిలి ఉత్తరాభిముఖంగా బయలుదేరాను. అలా బయలుదేరి, పట్టణాలు, జనపదాలు, పల్లెలు, నదులు, పర్వతాలు, అడవులు దాటి  ఒక భీకరారణ్యం ప్రవేశించాను. అక్కడ ఒక సరస్సులో స్నానమాడి, శుచినై, ఒక రావిచెట్టు క్రింద కూర్చుని, నేను విన్న విధంగా నా హృదయగతుడైన ఆ పరమాత్మని, హరిని చింతించాను. అలా ధ్యాననిమగ్నుడనైన నాకు, ఆనందాశ్రువులు రాలగా, రోమాంచం కలుగుతుండగా, నా తలపులో ఆ దేవదేవుడు కనిపించినట్లైంది. కాని ఆ హరి దివ్యరూపం నా కన్నులకు కనపడలేదు. ఆ హరికోసం శోకిస్తూ, నేను ఆ వనం అంతా కలియతిరుగుతుండగా, నన్నుద్దేశించి ఆ హరి మృదు మధుర స్వరంతో ఇలాపలికాడు."కుమారా!దుఃఖించకు. ఈ జన్మలో నన్ను చూడలేవు. నీవు ఈ శరీరాన్ని విడిచిన పిమ్మట, నా భక్తుడవై జన్మిస్తావు.ఈ సృష్టి లయం జరిగి, పునఃసృష్టి జరిగినప్పుడు నా కృపతో జన్మించి, శుద్ధసత్వులందరి లోకి అగ్రగణ్యుడవౌతావు."


అలా ఆ అశరీరవాణి పలుకగా, నేను తలవంచినమస్కరించి కామ క్రోధ అరిషడ్వర్గాన్ని వర్జించి, ఆ అనంతుని నామాలు పఠిస్తూ, విషయ విరక్తుణ్ణై, కాలానికై ఎదురుచూస్తూ తిరుగుతూ ఉండగా కొంతకాలానికి మెఱుపు మెఱిసినట్టు మృత్యువు రాగా, ఈ పాంచ భౌతికదేహాన్ని విడిచి, ఆ శ్రీహరి కృపవల్ల శుద్ధసత్వమయమైన భాగవత దేహాన్ని పొందాను. అంత ముల్లోకాల్నీ లయంచేసి, ఆ ప్రళయకాల జలరాశిమధ్య శయనించి ఉన్న నారాయణ మూర్తి యొక్క నాభికమల గతుడై శయనించబోతున్న బ్రహ్మ నిశ్వాస వెంట ఆతని లోనికి ప్రవేశించాను. తరువాత వెయ్యి యుగాల కాలం గడిచిన తర్వాత నిద్రలేచి, లోకాల్ని సృష్టించడానికి ఉపక్రమిస్తున్న ఆ బ్రహ్మ ఉచ్ఛ్వాస వెంట నేను, మరీచి మొదలైన మునులు జన్మించాము. అప్పుడు నేను అఖండమైన బ్రహ్మచర్యాన్ని పూని, ఈశ్వరదత్తమై, బ్రహ్మనుంచి పుట్టిన సప్తస్వరాలని తనంతట తానుగా మోగించే ఈ మహతి(అనే వీణ)ని పూని, ఈ ముల్లోకాలలో ఆ నారాయణుని అనుగ్రహంతో ఏ అడ్డంకి లేకుండా, నారాయణ కథాగానం చేస్తూ చరిస్తూ ఉన్నాను. అంత ఆ మహావిష్ణువు పిలిచిన పలికే వాని లాగా నా మనసులో నిత్యం దర్శనం ఇస్తారు మునీంద్రా!ఈ సంసారమనే సాగరంలో మునిగి, కర్మ వాంఛలచేత వేదన పడేవారికి, ఆ శ్రీహరి నామకీర్తనం తెప్పలాంటిది. అందువల్ల ఆ హరికథామృతాన్ని ప్రవచించి లోకాల్ని పావనం చెయ్యి." అని చెప్పి నారదుడు వ్యాసుని వద్ద వీడ్కోలు తీసుకుని వీణానాదం చేస్తూ ఆకాశమార్గాన వెళ్ళారు. స్వస్తి.


కోదండరామం  కూరెళ్ల 

https://t.me/koorellaBhagavatham

పోతన భాగవతం 0002

 మరణ భయంతో ఏడు రోజుల్లో భాగవతాన్ని పూర్తిగా విన్నాడు పరీక్షిత్తు. తాను చనిపోతానని బెంగపెట్టుకోవడమే భాగవతాన్నంతటినీ అంత ఓపిగ్గా వినడానికి కారణం. అయినా మరణం రాకుండా ఆగలేదు. అది వచ్చే సమయానికి ఆయన ఆలోచనా సరళిలో మాత్రం ఎంతో మార్పు వచ్చింది. మొదట భయంతో వినడం మొదలుపెట్టిన అతడి మానసిక స్థితి- ఆ ఏడు రోజులు భాగవత ప్రవచనాలు విన్న తరవాత అత్యంత దృఢంగా మారింది. దానికి కారణం భాగవతంలో చెప్పిన విషయాల తాలూకు గాఢతే.

చాలామంది ఈ శరీరం శాశ్వతంగా ఉండిపోతుందన్న భ్రాంతిని పొందుతున్నారు. అలా అనుకోవడానికి కారణం మరణం అంటే భయంతోనే. ఎవరేమనుకున్నా మరణం వచ్చి తీరుతుంది. దేహం నశించి తీరుతుంది. అందులో ఉండే ఆత్మ మాత్రమే ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. దానికి మరణం లేదు. మమకారం అంతకంటే లేదు. ‘నేను’ అనే మమకారం శరీరం పట్లే ఎక్కువ. అది మరణం రూపంలో నశించి తీరుతుంది. కాబట్టి నిత్యమైనది, సత్యమైనది ఆత్మ అని గ్రహిస్తే మరణ భయం కలగదు. సుడిగుండం లాంటి ఈ సంసార బంధనాల్లో చిక్కుకుంటే కాలం తీరాక మరణం, మళ్ళీ జననం, మళ్ళీ అదే తాపత్రయం. దీనికి అంతుండదు. అందుకే అందులో ఏ సుఖమూ లేదన్నది ఆధ్యాత్మిక వాదుల మాట.

వీటన్నింటికీ పరిష్కారం భగవన్నామ స్మరణ. అదే సంసార సాగర తరణానికి తోవ అని సూటిగా సున్నితంగా, సుబోధకంగా భాగవతం వెల్లడిస్తుంది. ఇవన్నీ వినడం వల్ల పరీక్షిత్తుకు తెలిసిన ముఖ్యవిషయాలు- ప్రతి శరీరం లోనూ ఆత్మ ఉంటుంది.

ఆత్మకు మాత్రం చావు అనేది లేదు. పుణ్యం, యజ్ఞం, యాగం, తపస్సుల వంటివి ఏం చేసినా, కల్పాలు యుగాలు మారినా సాక్షాత్తు దేవతలే ఆ జీవి పక్షాన నిలబడినా సరే, శరీరం నశించక మానదు. కచ్చితంగా నశించి తీరుతుంది. మనిషిదే కాదు, ఏ ప్రాణి శరీరం అయినా నశించిపోవలసిందే! నశించడం అవసరం కూడా. నశించకుండా ఉండిపోతేనే ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ఇవన్నీ కాదనలేని సత్యాలు. శరీరం నశించిన తరవాత ఆత్మ మరో శరీరంలోకి ప్రవేశిస్తుందని బోధపడింది.

అవన్నీ విన్న పరీక్షిత్తు ఏడోరోజుకు నిర్మల మనస్కుడయ్యాడు. ఆ స్థితిలో అతడన్న మాట ‘ఇప్పుడు నా శరీరానికి మరణం వచ్చినా భయం లేదు. ఇపుడు నేను ఆత్మగా నిలబడబోతున్నాను’ అని. అది ఆయనలోని మార్పునకు నిదర్శనం మాత్రమేకాదు. భాగవత పఠన/శ్రవణ పటుత్వానికి నిలువెత్తు సాక్ష్యం.

భాగవతంలో ఏముంది? ధర్మం ఉంది. సత్య దర్శనం ఉంది. దాన్ని నిర్మొహమాటంగా బోధించి మనిషిని సరైన మార్గంవైపు మళ్ళించే తత్వం ఉంది. అదే సుఖజీవనానికి, తద్వారా మోక్షానికి మార్గమనే జ్ఞాన బోధ ఉంది.

అసత్య వస్తువును పట్టుకుంటే మరణ భయం కలుగుతుంది. మరణభయంలో అజ్ఞానం, అవిద్య ఉన్నాయి. అవి జీవిని అధోగతికి చేర్చుతాయి. కాబట్టి ఏది సత్యమో దాన్ని పట్టుకోగలగాలి. భాగవతాన్ని విన్నవారు లేక చదివినవారు మాత్రమే ఆ సత్యాన్ని తేలికగా పట్టుకోగలరు. దేనికైనా తట్టుకోగలరు. అలా పట్టుకునే జీవితసత్యాల గురించి భాగవతంలో ప్రతిపాదన చేశారు.

ఎవరు భాగవతాన్ని వింటున్నారో లేక చదువుతున్నారో వారికి సత్యంపట్ల పూనిక కలుగుతుంది. ఈశ్వరుడి (అంతర్యామి) పట్ల దృష్టి మరలుతుంది. ఆయన పాదాలు పట్టుకున్నవాళ్లు ఎలా తరించారో భగవంతుడి భక్తుల గాథలుగా భాగవతం బోధిస్తోంది. అంత సరళంగా భాగవతాన్ని శుక బ్రహ్మ ప్రవచనం చేశారు. దాన్ని అక్షరబద్ధం చేసింది వ్యాసభగవానుడు. మన అదృష్టం కొద్దీ ఆ జ్ఞాన సంపద మనందరికీ అందుబాటులో ఉంది. అందుకోగలిగిన వారికి ఆనందం కలుగుతుంది. అందుకోలేనివారికి అయోమయం మిగులుతుంది.

(అయ్యగారి శ్రీనివాసరావు గారి ఈనాడులో వ్యాసం)


కోదండరామం  కూరెళ్ల 

https://t.me/koorellaBhagavatham

పోతన భాగవతం 0001

 ఋషుల కోరిక మేరకు సూతుడు తాను శుక మహర్షి ద్వారా విన్న భాగవత కథను వారికి చెప్పగా, దానిని వేదవ్యాసుడు గ్రంథస్తం చేశాడు. 


తెలియని వెలితి ఆవహించడంతో నారద మహర్షి సూచన మేరకు భగవంతుని లీలలను వర్ణించే పురాణానికి శ్రీకారం చుట్టాడు. అదే శ్రీమద్భాగవతం.


 భాగవతం లేదా భాగవత పురాణం లేదా శ్రీమద్భాగవతం. ఇది హిందూ సంప్రదాయంలో, సాహిత్యంలో, ఆలోచనా విధానంలోనూ ముఖ్యమైన ప్రభావం కలిగిన ఒక పురాణం. భగవంతుని లీలామృతంగా, శరణాగతులైన భక్తుల గాథగా, భక్తి యోగాన్ని చాటి చెప్పే ప్రాచీన గ్రంథంగా ప్రసిద్ధి చెందింది. ప్రధానంగా కృష్ణుడి లీలలు, శ్రీహరి అవతరాల గురించి ఈ గ్రంథంలో ఉంటాయి. 


భాగవతంలో అధ్యాయాలను ‘స్కంధాలు’ అంటారు. వీటిలో భగవంతుని అవతారాల వర్ణన, భక్తుల గాథలు, తత్వ బోధలు, పలు ఆరాధనా విధానాలు, ఆధ్యాత్మిక సంవాదాలను పొందుపరిచారు. ఇందులో 12 స్కంధాల్లో భగవంతుని లీలలు సవివరంగా వర్ణింపబడ్డాయి. భాగవత రసామృతాన్ని పానం చేసినవారికి మరేవి రుచించవు. వైష్ణవ సిద్ధాంతాలలో వేదాంత సూత్రాలకు భాగవత పురాణమే సహజమైన వ్యాఖ్య. అందుకే దీనిని వేదాంతసారమంటారు. 


భాగవత పురాణం సంభాషణల రూపంలో సాగుతుంది. ఒక మునిశాపం వల్ల ఏడు రోజుల లోపు మరణిస్తానని తెలిసిన అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్తు మహారాజు తన విధులను త్వజించి జీవి అంతిమ లక్ష్యాన్ని తెలుసుకోవాలని భావించాడు. అదే సమయంలో తన అపార జ్ఞాన సంపదను ఎవరికి బోధించాలో తెలియక, మంచి శిష్యుడి కోసం వెతుకుతున్న శుక మహర్షికి పరీక్షిత్తు ఎదురుపడటంతో ఆయనకు భాగవత కథలను బోధించడానికి అంగీకరిస్తాడు. ఈ సంభాషణ విరామం లేకుండా ఏడు రోజులపాటు కొనసాగింది. ఈ వారం రోజులూ రాజు నిద్రాహారాలు లేవు. నిత్యసత్యమైన భగవంతుని గురించి తెలుసుకోవడమే జీవి అంతిమ లక్ష్యమని శుకుడు వివరించాడు.


కోదండరామం  కూరెళ్ల 

https://t.me/koorellaBhagavatham