Friday, 3 December 2021

సాధన అంటే ఇలా ఉండాలి

  దక్షిణ భారత  దేశం లో 'తిరువళ్ళువార్ ' అనే పేరుని విననివారు ఉండరు.  అతను మహా భక్తుడు, జ్ఞాని. 

నేత నేసి తన సంసారాన్ని నిర్వహించేవాడు . వారంలో ఒకరోజు పూర్తిగా భగవంతుని సేవ కోసం వినియోగించేవాడు . ఆయన భార్య వాసుకి. కాపురానికి వచ్చినప్పటినుంచి భర్త ఆదేశానుసారం విస్తరి దగ్గర ఒక దొన్నె నిండా నీరు, ఒక సూది ఉంచుతూ ఉండేది. అయితే భర్త ఆ దొన్నె నీటిని గాని, సూదిని గాని ఎప్పుడూ ఉపయోగించలేదు. ఆ సందేహం వాసుకి కి అలాగే జీవితాంతం ఉండిపోయింది. 

వాసుకి అంత్యకాలం సమీపించింది. ఆ సమయంలో వాసుకి 'నాకోక సందేహం ఉంది తీరుస్తారా ? " అని అడిగింది భర్తను. సరే అన్నాడు  తిరువళ్ళువార్. 

"మీరు భోజనం చేసేటప్పుడు విస్తరి పక్కన దొన్నెలో నీరు, సూది ఉంచమనేవారు. కానీ మీరెప్పుడూ దొన్నెలో నీరు గాని, సూది గాని  ఉపయోగించడం నేను చూడలేదు. వాటిని మీ విస్తరి పక్కన పెట్టమనటంలో మీ ఉద్దేశ్యం ఏమిటన్నదే నా సందేహం. దీనినే తీర్చవలసింది" అని అడిగింది. 

తిరువళ్లువారు చిరునవ్వుతో ఇలా అన్నాడు. "అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నాన్ని కింద పడేయరాదు. వ్యర్థం చేయరాదు. నీవు వడ్డించేటప్పుడు పొరపాటున మెతుకు కింద పడితే దానిని సూదితో తీసి, నీటిలో శుద్ధి చేసి ఆకులో వేసుకోవాలని నా ఉద్దేశ్యం. నీవు ఏనాడు పొరపాటున కూడా ఒక్క మెతుకైనా కింద పడేయలేదు. అందుకే సూదిని, నీటిని ఉపయోగించే అవసరం రాలేదు" అన్నాడు. వాసుకి సందేహం తీరి, భర్త ఒడి లో ప్రాణం వదిలింది. 

తిరువళ్ళువార్ అన్నాన్ని బ్రహ్మగా భావించాడు. అతని భార్య అన్నాన్ని బ్రహ్మభావంతో, కింద పడకుండా జాగ్రత్తగా వడ్డించింది. ఒక్కసారి కాదు జీవితాంతం చేసింది. ఈ యోగం ప్రతి ఒక్కరు నిత్య జీవితంలో చేస్తే ఇంతకంటే సాధన వేరొకటి లేదు.